ఫేస్‌బుక్ కవిసంగమం - స్కైబాబ

వేరే వేరే జిల్లాల్లో ఉన్నవాళ్లు, ఇతర రాష్ట్రాల్లో, దేశదేశాల్లో ఉన్నవాళ్లు పక్క పక్కనే ఉన్నట్లు ఇన్నాళ్లూ ఫేస్‌బుక్‌లో మాట్లాడుకున్నాం. ఇవాళ వీలైనంతమంది కలుసుకొని పొయిట్రీ ఫెష్టివల్ చేసుకుంటున్నాం. ఒకరు ఒక కవిత రాయగానే నెల్లూరులో ఉన్న మిత్రుడు వావ్ అంటాడు. బెంగుళూరులో ఉన్న మిత్రుడు ఏదో కామెంట్ పెడతాడు. అమెరికాలో ఉన్న మరో మిత్రుడు కొత్తగా ఉందంటాడు. ఇలా ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు పక్కపక్క వీధుల్లోనే ఉన్నట్లు పలకరించుకుంటారు. అలాంటి ఒక అవకాశాన్ని ఫేస్‌బుక్ కల్పిస్తే- మేమంతా కలిసి దాన్ని కవిత్వ పండుగ చేసుకుంటున్నాం.. - యాకూబ్

కొన్ని సంఘటనలు అలా ఒరుసుకుంటూ వెళ్లిపోతే, అప్పటికేం తెలియదు. కొంత సమయం గడిచాక తెలుస్తుంది, అదెంత గొప్ప అనుభూతో! కవిసంగమం అలాంటి అనుభవమే! రోజువారీ హడావిడిలో ఉద్యోగ, వ్యాపకాల ఒత్తిడిలో కంప్యూటర్ దొరికితే ఏదో కొంచేపు ఆటలాడుకుందామనే దశనుంచి బయటకు తెచ్చి పరస్పర ఉపయోగకర వ్యాపకంగా మార్చవచ్చన్నదానికి ఉదాహరణ కవి సంగమం. - కట్టా శ్రీనివాస్, టీచర్


ఎప్పుడూ కలవనివాళ్లు.. ఫోటోల్లో చూసుకోవడం తప్ప కరచాలనం కూడా చేసుకోనివాళ్లు.. గొంతెలా ఉంటుందో.. పలకరింపు ఎలా ఉంటుందో.. నవ్వెలా ఉంటుందో తెలియనివాళ్లు ఫేస్‌బుక్‌లో 'కవి సంగమం' కారణంగా కలుసుకొని కవిత్వ పండగ చేసుకోవడం వింతైన అనుభవమే! 15 ఆగస్టు నాడు హైదరాబాద్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీలో అలాంటి పసైందైన పండగే జరిగింది.

ఇంట్లో,ఆఫీసులో, నెట్‌లో కూర్చొనో, చేతిలోని సెల్‌తోనో కవితలు ప్రచురించేస్తూ.. అందరినీ పలకరించేస్తూ.. కామెంట్స్ పెడుతూ.. లైక్ కొడుతూ.. షేర్ చేస్తూ.. ఒక కొత్త దునియాఁలో ఓలలాడడం ఇక్కడి ఫ్రెండ్స్ ప్రత్యేకత. ఈ దునియాఁ మనకు కొత్త కవు ల్ని బహూకరించింది. తమ భావాల్ని ఎలా ఎక్కడ వ్యక్తపరచాలో వెతుక్కుంటున్న వారి కి.. రాసే ఆసక్తి ఉన్నా సమయమూ సందర్భమూ అవకాశమూ దొరకని వారికి.. ఎప్పు డో కాసిన్ని కవితలు రాల్చినా ఉద్యోగాల్లోకో సంసారాల్లోకో, పరుగు పెట్టిస్తున్న ప్రపంచంలోకో కూరుకుపోయిన వారికి- ఒక వేదిక దొరికీ.. తమను కవులుగా ఎగరడానికి అవకాశం చిక్కీ.. ఉబ్బితబ్బిబ్బవుతున్న వారు కనిపించారు.. కవి సంగమం నిండా!

ఇంటర్‌నెట్ ప్రపంచంలో ఫేస్‌బుక్ ఒక సంచలనం. కొత్త మిత్రులను వెతుక్కోవడం.. వారందరికీ తమ ఫోటోలు, అభిప్రాయాలు, ఇష్టమైన బొమ్మలు పంచుకోవడం.. వాటి కింద 'కామెంట్'లు పెట్టడం.. చర్చోపచర్చలు చేయడం మామూలైపోయింది. చూస్తుండగానే 'ఫ్రెండ్స్' సంఖ్య వందలు దాటి వేలలోకి వెళ్లిపోతుంది. కొత్త కొత్త అభిరుచుల ఫ్రెండ్స్ ఒక్కచోట కలవడం ఒక సంభ్రమమే!

ఇలాంటి ఫేస్‌బుక్‌ను మన తెలుగు కవి యాకూబ్ ఒక ప్రయోగానికి ఉపయోగించుకున్నారు. ఫేస్‌బుక్‌లో ఏదేని ఒక 'గ్రూప్' ఏర్పాటు చేసుకొని ఆ విషయానికే పరిమితమై అక్కడ మాట్లాడుకోవడం చేస్తుంటారు చాలామంది. యాకూబ్ 'కవి సంగమం' అనే గ్రూప్ 'క్రియేట్' చేసి కవులందరినీ అందులో జమ చేశారు. ఇక అక్కడ కవిత్వం 'పోస్ట్' చేయడం మొదలయ్యింది. మొత్తంగా 545 మంది కవులు ఆ గ్రూప్‌లో ఒక్కటయ్యారు.

యాకూబ్ గైడెన్స్ ఇస్తూ ఉంటే రోజుకో పోయెం 'కవి సంగమం' గ్రూప్‌లో పోస్ట్ చేయడం చేస్తున్నారు చాలామంది నవ కవులు. ఈ హడావుడిని ఫేస్‌బుక్‌లోని మన తెలుగు వాళ్లు వందల మంది చూడ్డం మొద లయ్యింది కూడా. ఇలాంటి గ్రూపులు మరికొన్ని ఉన్నప్పటికీ కవి సంగమం మిత్రులంత పట్టుదలగా కనిపించరు. ఠీఠీఠీ.జ్చుఠిజీట్చnజ్చఝ్చఝ.ఛిౌఝ పేర బ్లాగ్ కూడా ఏర్పర్చి కవి సంగమంలో పోస్ట్ అయిన కవితలను ఏరి ఆ బ్లాగ్‌లో 600 దాకా ఉంచారు మిత్రులు. ఆ బ్లాగ్‌ను ఫెస్టివల్ నాటికే దాదాపు 7 వేలమంది దాకా వీక్షించారట!

ఆశ్చర్యం ఏమంటే- పత్రికల్లో కనిపించని కవులు ఎంతోమంది అక్కడ కనిపిచండం మొదలయ్యారు. కొత్త 'ఫ్లెవర్'తో, కొత్త ప్రతీకలతో, కొత్త కొత్త విషయాలను కవితలుగా ఫేస్‌బుక్ కెక్కించడం, చదివినవారికి కిక్కెంచడం మొదలుపెట్టారు. ఇక్కడ కవితలు, అభిప్రాయాల్లో కనిపించేవారితోపాటు ఆలూరు శ్రీకాంత్, బాబీ నీ (క్రాంతి), వంశీధర్‌రెడ్డి, అనిల్ దాని, జయశ్రీ నాయుడు లాంటివారితోపాటు శైలజా మిత్ర, రేణుక అయోల, జాన్ హైడ్ కనుమూరి, పెరుగు రామకృష్ణ, పులిపాటి పరమేశ్వరి లాంటివారు రోజూ క్రమం తప్పకుండా కవితలతో పలకరింపులు కొనసాగిస్తున్నారు. పులిపాటి గురుస్వామి, బివివి ప్రసాద్ లాంటి కవులైతే విజృంభించి రాస్తున్నారు. క్రాంతి శ్రీనివాసరావు, జిలుకర శ్రీనివాస్ లాంటివారు మళ్లీ కవితలు రాయడం మొదలుపెట్టారు. కె.శ్రీకాంత్, స్కైబాబ, ఊడుగుల వేణు లాంటివారు అప్పుడప్పు డు చమక్కున మెరుస్తుంటారు.

నా జీవితంలో ఒక పరిపూర్ణమైన రోజు. ఎంతోమంది సహచరులను కలిశాను. ఎన్నో అనుభవాలు మూటకట్టుకున్నాను. ఎనలేని ఆనందంతో ఎల్లలు దాటే పారవశ్యంతో గడిపాను. ఇవన్నీ పంచిన కవి సంగమానికి ఎంత రుణపడి ఉన్నానో.. - యజ్ఞపాల్ రాజు

జీవితంలో మరచిపోలేని రోజు. ఎంతోమంది మిత్రులను కలిశాను. ఎన్నో అనుభవాలను మూటకట్టుకున్నాను. ఇంకొంతమంది కవిమిత్రులను కలవలేకపోయామన్న బాధ కూడా కలిగింది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారిని మిస్సయ్యాము.. - కాశిరాజు

యాకూబ్‌తో జత కలిసిన కట్టా శ్రీనివాస్, కాశిరాజు, నంద కిశోర్, గురుస్వామి, మోహన్ రుషి, కిరణ్ గాలి, రేణుక అయోల ఇలా ఎందరో కలిసి కవి సంగమం మిత్రులను కలిపే ప్రయత్నంలో హర్షాతిరేకాలతో శ్రమించారు. వారం రోజుల నుండే కవి సంగమం గ్రూపులో పొయిట్రీ ఫెస్టివల్ హల్‌చల్ మొదలయ్యింది. వెరైటీ వెరైటీ పోస్ట్‌ల ద్వారా ప్రచారం జరిగింది. తర్వాత బ్యానర్లు, బ్యాడ్జ్‌లు.. ఆఖరికి సంగమం రోజు ఒంటి గంటకే నిర్వాహక మిత్రులు రెడీ.

ఒక్కొక్కరు వస్తూ అలాయిబలాయిలతో నవ్వుల ములాఖాత్‌లతో కిక్కిరిసి.. క్లిక్ క్లిక్‌ల మధ్య 3 గంటలకు సభ 'ప్రారంభం', యాకూబ్ తొలి పలుకులతో.. ముఖ్యఅతిథి సుబోత్ సర్కార్ కవిత్వం సాధించలేనిది ఏమీ లేదంటూ ఉద్వేగంగా ప్రసంగించారు.. బి.నరసింగరావు కవిత్వం ఒక మహాసముద్రం- అందులో ఓలలాడడం తనకెంతో ఇష్టమంటూ మీరూ ఈదులాడండంటూ ఆశీర్వదించారు. శివారెడ్డి నెట్ ప్రపంచానికి నేను ౌఠ్ట టజీఛ్ఛీట ని అంటూనే సంగమం మిత్రులకు ఉపయోగకరమైన సలహాలిచ్చారు.

మహాకవులు పుట్టరు, తయారుచేయబడతారు, అట్లా తమను తాము తయారుచేసుకోవాలని కోరారు. ప్రింట్ మీడియాలో కనిపించేవైపుగా ప్రయాణించాలని సూచించారు. మూర్తి, అఫ్సర్, గుడిపాటి తమ ప్రసంగాల్లో ఇదొక గొప్ప కలయికగా అభివర్ణించారు. అనంతరం గురుస్వామి, ఋషి, మెర్సి, నంద, స్కై కవి సమ్మేళనాన్ని అనుసంధానించారు. అక్కడ చదివిన కవితల ఎంపిక విషయంలో కొంత జాగ్రత్త తీసుకొనివుంటే మరింత తృప్తి నిర్వాహకుల సొంతమయ్యేది.

మొత్తంగా కవి సంగమం కొనసాగుతున్న తీరు, ఆ గ్రూపు నిర్వాహకులు చేసిన ఈ కార్యక్రమం తెలుగు సాహిత్యంలో ఒక సరికొత్త ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా తాజా తాజాగా తయారవుతున్న ఈ కవులు మనకు మరింత తాజా కవిత్వాన్ని వాగ్దానం చేస్తున్నారు.
http://www.www.andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2012/aug/20/vividha/20vividha2&more=2012/aug/20/vividha/vividhamain&date=8/20/2012

కామెంట్‌లు