అంతర్జాలంలో తెలుగు పత్రికలు - కె.ఎక్స్‌.రాజు

ఇప్పుడు అంతర్జాలంలో తెలుగు వెలుగులు దశదిశలా పరిఢవిల్లుతున్నాయి. మొన్నమొన్నటి వరకూ అంతర్జాలంలో తెలుగు చదవాలంటే ఇమేజ్‌ ల రూపంలోనో, పిడిఎఫ్‌ ల రూపంలోనో మాత్రమే అందుబాటులో వుండేవి. ఈనాడు దినపత్రికవంటి సైట్లు సొంత ఖతులను (ఫాంట్స్‌) అభివృద్ధి చేసుకొన్నాయి. దీనికి ఖర్చు అధికంగా వుండడంతో ఎక్కువమంది ఆ దిశగా మొగ్గు చూపలేదు. ఇటీవల యూనికోడ్‌ అభివృద్ధి చెందడంతో అంతర్జాలంలో తెలుగు భాష వెలుగుతోంది. దీనివెనుక ఎందరో సాంకేతిక నిపుణుల అవిరళ కృషి దాగుంది. ఏదేమైనా అంతర్జాలంలో నేడు అనేక తెలుగు దిన, మాస పత్రికలు వెలుగు చూస్తున్నాయి. వీటన్నిటితోపాటు వేలసంఖ్యలో తెలుగు బ్లాగులు కూడా విజయవంతంగా నడుస్తున్నాయి. అంతర్జాలంలో ఇప్పటికే కొన్ని పత్రికలున్నాయి. ఒక్కోదానికీ ఒక్కో ఒరవడి ఉంది. సాహిత్య ప్రధానమైనవీ.. సమకాలీన అంశాలతో నిండినవీ.. ఇలా రకరకాలుగా ఉన్నాయి. చాలా పత్రికలు ఏదో ఒక వాదానికి చెందినవి. తొలినాళ్ళలో అంతర్జాల పత్రికలు సాహిత్య ప్రధానంగా ఉండేవి. సాహిత్య వ్యాసాలు, కథలు, పాత గ్రంథాల సమీక్షలు, పద్యాలు మొదలైనవి ప్రధానంగా వుండేవి. ప్రస్తుతం సినీసాహిత్యం, పుస్తక సమీక్షలు, వ్యక్తిగత విషయాల నుంచి వంటల వరకూ అనేక విషయాలపై తెలుగు సైట్లు అభివృద్ధి చెందాయి. కంప్యూటర్లో తెలుగు అమలు చెయ్యడం సాంకేతికంగా చాలా సులభమైంది. ఇంకా సులభమౌతూ ఉంది.



ఇంగ్లీషు తప్ప గత్యంతరం లేని అంతర్జాలంలో తెలుగులో రాయగలిగే సౌకర్యం రావడంతో తెలుగువారికి తమ ఆలోచనలను తమ భాషలోనే రాతలోపెట్టే అవకాశం దొరికింది. ఇప్పటి నెటిజనుల్లో ఎక్కువమంది ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నవాళ్ళే అయినప్పటికీ తెలుగులో రాయగల ప్రావీణ్యత లేనప్పటికీ రాయాలన్న తృష్ణ ఎక్కువగా ఉంది. వెబ్‌2.0 వచ్చాక, బ్లాగులూ, వికీలూ వెల్లువెత్తాక, అంతర్జాల పత్రికల ధోరణి మారిపోయింది. ముఖ్యంగా, కంటెంటు మేనేజిమెంటు విషయంలో జరిగిన సాంకేతిక పురోగతి కారణంగా అంతర్జాల ప్రచురణ క్షణాలమీద అయిపోతోంది. అచ్చు పత్రికలకు అలవాటు పడిన పాత తరం రచయితలు కూడా ఈ మధ్యకాలంలో అంతర్జాలంలో రాయడానికి అలవాటుపడ్డారు. ఇప్పుడు అంతర్జాలంలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన అనేక సైట్లు, బ్లాగులు దర్శనమివ్వడానికదే కారణం. ఇప్పుడు అంతర్జాలంలో తెలుగు వెలుగులను విరజిమ్ముతూ.. సాహిత్య గుబాళింపులతో విభిన్న రంగాలకు చెందిన వెబ్‌ సైట్లు, బ్లాగులు అనేకం వున్నాయి. వాటిలో కొన్ని...


పుస్తకం (http://pustakam.net)


ప్రపంచ సాహిత్యంపై పుస్తకప్రియుల వ్యాఖ్యానాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో అందించే అంతర్జాల పత్రిక. పుస్తకాలపై సమీక్ష, విమర్శ, పరిచయ వ్యాసాలే కాక రచయితలతో ఇష్టాగోష్టి, ప్రచురణకర్తలతో, పుస్తకవిక్రేతలతో మాటా-మంతీ, పుస్తకప్రియత్వాన్ని చాటి చెప్పే వ్యాసాలెన్నో ఇక్కడ చోటు చేసుకుంటాయి. దీని ముఖ్యోద్దేశం పాఠకులు తమ మాటల్లో తాము చదివిన పుస్తకాల గురించి అందరితో పంచుకోవడం. పుస్తకాలను ఇష్టంగా చదువుకోవడమనేదే ఇక్కడ ప్రాథమిక అర్హత. ఈ సైట్‌ జనవరి ఒకటి, 2009న ప్రారంభమయ్యింది.


ప్రస్థానం(www.prasthanam.com)


సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాహిత్యపత్రిక ఇది. తెలుగు సాహిత్యంతో పాటు భారతీయ భాషలలో వెలువడుతున్న సమకాలీన సాహిత్యాన్ని, దాంతో పాటే అంతర్జాతీయ సాహిత్య ధోరణులను కూడా ఎప్పటికప్పుడు పరిచయం చేయడానికీ, పరామర్శించడానికీ ప్రస్థానం ప్రయత్నిస్తుంది. జిల్లాల్లో జరిగే సాహిత్య కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని అందిస్తుంది. నూతనత్వానికి ప్రాధాన్యతనిస్తూనే గతంలో వెలువడిన విలువైన అధ్యయనాలను, రచనలను పాఠకులకు అందించడానికి కృషి చేస్తుంది. కవిత్వంతో పాటు ప్రజా గీతాలకూ చోటుంటుంది. స్థానికంగా జరిగే సాహిత్యసభలలో వక్తలు చేసే మంచి ప్రసంగాలను, ప్రముఖుల ఇంటర్వ్యూలను జాగ్రత్తగా రాసి పంపితే ప్రచురించే అవకాశముంటుంది. వివిధ విషయాలపై కవులు, రచయితలు, పాఠకులు తమ రచనలు, అభిప్రాయాలను పంపితే తగు శీర్షికలో ప్రచురిస్తుంది.


ఈమాట (www.eemata.com)


వెబ్‌ పత్రికలు అచ్చు పత్రికలకు ఏమాత్రం తీసిపోవు. కొండొకచో వెబ్‌ పత్రికలే ముందంజలో ఉన్నాయి. అలాంటి పత్రికల్లో పేరెన్నికగన్నది ఈమాట. తెలుగు వెబ్‌ పత్రికల్లో వయసు రీత్యానూ, పరిణతి రీత్యానూ పెద్దది ఈమాట. ఎప్పుడో యూనికోడు ప్రాచుర్యంలోకి రాకముందే పుట్టిన ఈ పత్రిక కాలంతో పాటు రూపునూ, సాంకేతికతనూ మార్చుకుంటూ, మెరుగుపరచుకుంటూ, అదే సమయంలో తన రచనల స్థాయిని కాపాడుకుంటూ వస్తోంది. తెలుగు సాహిత్యానికి నెట్లో ఉన్న ప్రధాన వనరుల్లో ఈమాట ఒకటి. ఈమాట కూడబెట్టినంత సాహితీ సంపద అంతర్జాలంలో మరో తెలుగు పత్రిక చెయ్యలేదు. ఈమాట గ్రంథాలయంలో తెలుగు పుస్తకాలు డౌనులోడు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వచ్చినన్ని పరిశోధనాత్మక వ్యాసాలు ఇంకెక్కడా రాలేదేమో. ఆంగ్లంలో ఎకడెమిక్‌ జర్నల్‌ తరహాలో ఈ పత్రికని నడుపుతున్నారు. ప్రతి రచనను ముందుగా ముగ్గురు సమీక్షకులు పరిశీలిస్తారు. అవసరమైన చోట్ల మార్పులుచేర్పులకు సూచనలు ఇస్తారు.


సుజనరంజని (www.sujanaranjani.org)


కాలిఫోర్నియా బే ఏరియా తెలుగువారి సాంస్కృతిక సంస్థ సిలికానాంధ్ర వారి పత్రిక ఇది. మాసపత్రిక. 2004 జనవరి నుండి ప్రచురితమౌతోంది. ప్రతి నెలా ఒక ముఖచిత్రాన్ని ప్రచురిస్తారు. మామూలు అచ్చు పత్రిక భావన కలుగజేస్తుంది. తెలుగు సాహిత్యమే ప్రధానంగా నడిచే పత్రిక ఇది. సుజనరంజని యూనికోడులోనే కాక, పి.డి.ఎఫ్‌గా కూడా లభిస్తుంది. తాము స్వయంగా తయారుచేసుకున్న సాఫ్టువేర్‌ వాడుతున్నారు. బొమ్మలు ఎక్కువగా వుండడంతో ఈ సైటు మిగతా పత్రికలతో పోలిస్తే నిదానంగా లోడవుతుంది.


ప్రజాకళ (www.prajakala.org)


ప్రజాకళ అక్టోబరు 2006 లో మొదలైంది. కథ, నవల, సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శ తదితర రచనలను పరిచయం చేస్తారు. ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు పరిచయం చేస్తుంటారు. ప్రజాస్వామిక సాహిత్యం పట్ల ఆసక్తీ, ప్రేమా వున్న కొంతమందిమి మేము ఈ వెబ్‌ సైటు ప్రారంభించాలనుకున్నాము అని ఈ సైట్‌లో రాసారు. ప్రజాకళ వర్డ్‌ప్రెస్‌ సాఫ్టువేరును వాడుతున్నది. పి.డి.ఎఫ్‌ రూపంలో కూడా దొరుకుతుంది.


ప్రాణహిత(www.pranahita.org)


ప్రాణహిత 2007 జూలైలో మొదలైంది. ప్రధానంగా, విభిన్న గొంతుకల సమ్మేళనమై వినబడే ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యానికి క్రియాశీల వేదిక కావడమే ప్రాణహిత లక్ష్యం అని చెబుతూ.. ప్రపంచవ్యాప్తంగా, దేశ దేశాల్లో ప్రజల పక్షం నిలబడ్డ సాహిత్యాన్ని తెలుగు చేసి మీకందించే ప్రయత్నం చేస్తాం అని ఈ సైట్‌లో చెప్పుకున్నారు. ప్రాణహితది ఆహ్లాదకరమైన రూపం. పత్రిక పి.డి.ఎఫ్‌ రూపంలో కూడా దొరుకుతుంది పాఠకులకు ప్రజాకళ, ప్రాణహిత పత్రికలలో దగ్గరి పోలికలు కనిపిస్తాయి.


కౌముది (www.koumudi.net)


వెబ్‌లో ప్రచురితమౌతున్న మరో మాసపత్రిక కౌముది. గతంలో సుజనరంజని పత్రికను నిర్వహించిన కిరణ్‌ ప్రభ 2007 జనవరిలో కౌముదిని ప్రారంభించారు. యూనికోడ్‌ యుగంలో మొదలైనప్పటికీ, కౌముదిని పి.డి.ఎఫ్‌, బొమ్మల రూపాల్లోనే ప్రచురిస్తున్నారు. పాఠకుల స్పందన వెంటనే కనిపించదు.


భూమిక (www.bhumika.org)


భూమిక స్త్రీవాద పత్రిక. అచ్చు పత్రికగా మొదలై, 2006 నవంబరులో అంతర్జాలానికెక్కింది. తెలుగులోనే కాక యావత్‌ దక్షిణ భారతంలోనే వస్తున్న ఏకైక స్త్రీవాద పత్రికగా భూమిక గురించిన పేజీలో రాసారు. కొండవీటి సత్యవతి ఈ పత్రిక సంపాదకురాలు. ఇందులో పనిచేసే వారంతా స్త్రీలే కావడం విశేషం. భూమికలో రచనలు ఎక్కువగా స్త్రీకి సంబంధించినవే. కాల్పనిక రచనలు తక్కువగానూ, వాస్తవ విషయాలకు సంబంధించిన రచనలు ఎక్కువగాను ఉంటాయి. కేవలం రచనలతోటి సరిపెట్టడమే కాకుండా, స్త్రీలకు మాటసాయం చేసే ఉద్దేశ్యంతో భూమిక ఒక హెల్ప్‌లైన్‌ ను కూడా నిర్వహిస్తోంది.


నవతరంగం (www.navatarangam.com)


తెలుగు పత్రికలలో పసి కూన ఇది. పొద్దు లాగానే ఒక వేళాపాళా లేకుండా వచ్చే పత్రిక. సినిమా కోసమే ప్రత్యేకించిన పత్రిక. సినిమా విమర్శకుడిగా పేరొందిన వెంకట్‌ సిద్ధారెడ్డి మరి కొందరు ఔత్సాహికులతో కలిసి స్థాపించిన పత్రిక. నిష్పాక్షిక సినిమా సమీక్షలకు నెలవుగా నవతరంగం పేరు పొందుతోంది. నవతరంగం అనే పేరుతో తమ సైటు కొత్త ఆలోచనలను, కొత్త భావాలను తెస్తుంది అని చెప్పదలచినట్టున్నారు. ఇది వర్డ్‌ప్రెస్‌ సాఫ్టువేరు ఆధారంగా నడిచే పత్రిక. సైటు చాలా త్వరగా లోడవుతుంది. ఇటీవలి వ్యాసాల సంక్షిప్త పరిచయం మొదటి పేజీలో కనిపిస్తాయి. ఫోకస్‌, భారతీయ సినిమా, ప్రపంచ సినిమా, విశ్లేషణ, సమీక్ష మొదలైన వర్గాలున్నాయి. ఇవి వర్గాలు.. శీర్షికలు కావు. ఒక్కో వ్యాసమూ ఒకటి కంటే ఎక్కువ వర్గాల్లోకి చేర్చారు. అది సహజమే. కానీ ఆ వర్గాలనే పైనున్న లింకులుగా పెట్టడంతో ఒకే వ్యాసం ఒకటి కంటే ఎక్కువ లింకుల్లో ఉంటోంది.


చాలా వరకూ వెబ్‌ పత్రికలన్నీ సాహిత్యానికి లేదా ఏవో కొన్ని సామాజిక అంశాలకీ పరిమితమైపోయాయి. ఎంతో మంది తెలుగు వాళ్ళు, ప్రపంచం నలుమూలలా ఎన్నో రంగాలలో నిష్ణాతులుగా పని చేస్తున్నారు. ఇప్పుడు, తెలుగులో రాయటం చాలా తేలికైపోయింది. ఉత్సాహం, రాయాలనే పట్టుదలా, ఏదో ఒక రంగంలో నైపుణ్యం ఉంటే చాలు. ఎకనామిక్సు, పొలిటికల్‌ సైన్సు, సైన్సులు, సోషియాలజీ మొదలైన రంగాలలో నైపుణ్యం ఉన్నవారు ఆయా అంశాలలో తెలుగులో రాస్తే బావుటుంది. ఇప్పటికే, కొంతమంది భాషా శాస్త్రం, కంప్యూటర్‌ సైన్సు, టెక్నాలజీ, సైన్సు మొదలైన విషయాలలో, ఉన్నత స్థాయి రచనలు చేస్తూ ఉన్నారు. ఈ ట్రెండు ఇలాగే కొనసాగితే, తెలుగు అంతర్జాలం, వెబ్‌ పత్రికలు ప్రింటు మాధ్యమాలకి ప్రత్యామ్నాయంగా ఎదగటం ఖాయం.


మరికొన్ని సైట్లు


http://poddu.net/

http://www.rachana.net/


http://scienceintelugu.blogspot.in/


http://www.haasyam.com/---(ఈ న్యూస్‌)


తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌


ఇది ప్రతి తెలుగువాడి ప్రతిభను ప్రపంచవ్యాపితంచేసే మొట్టమొదటి రికార్డుల సంస్థ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (www.telugubookofrecords.com). ఒక రాష్ట్రానికి, ఒక భాషకు సంబంధించి, తెలుగు ఔన్నత్యాన్ని ఈ సంస్థ ద్వారా ప్రపంచానికి తెలియజేసే తొలిప్రక్రియ. ప్రపంచంలోని నివాస, ప్రవాస ఆంధ్రుల ప్రతిభలను వెలికితీసి వారికొక వేదిక, గుర్తింపును కల్పించడం దీని ముఖ్యోద్ధేశం. ఈ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కి ప్రతి తెలుగువాడు దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ రికార్డులతో గౌరవిస్తూ సముచిత రీతిన సత్కరిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ముఖ్యంగా తెలుగువారి తెలివితేటలను రానున్న తరాలకు తెలియజేసేవిధంగా తెలుగు సంప్రదాయం భారతీయ లలితకళలు, తెలుగు కట్టూబొట్టు, తెలుగుతనానికి సంబంధించిన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. దేశ విదేశాలలో వున్న తెలుగువారిని కలుపుకొని ఆయా ప్రాంతాల తెలుగు సమాఖ్యలతో కలిసి ఈ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నడపబడుతుంది. ఏ ప్రాంతంలో జరిగిన రికార్డ్స్‌ కు ఆ ప్రాంతీయంగా వున్న తెలుగు సంస్థల సలహాలు, సహకారంతో సదరు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

Source : http://www.prajasakti.com/tecpage/article-413389

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి