నరకాలు నానారకాలు

దీపావళి గురించి తలచుకున్నపðడే నరకుడు గుర్తొస్తాడు. వీడు నరకానికి సంకేతమని పెద్దలు చెబుతారు. ఇంతకీ నరకుడి వధ జరిగినందుకు దీపావళి పండగ జరుపుకోవాలా నరకబాధ వదిలినందుకు పండగ జరుపుకోవాలా అని అడిగితే చాలా మంది రెండోదానికే ఓటేస్తారు. నరకుడు ఎవడో తెలియదు..వాడి వల్ల బాధపడ్డ తరాలేవో తెలియవు. అవి ఎటూ కాలగర్భంలో కలిసిపోయాయి..కానీ భరించరాని నరకబాధలు మాత్రం ఉండిపోయాయి. అవి తొలగితేనే మన ప్రాణాలు సుఖపడతాయి. కనుక నరకబాధలు వదలాలని కోరుకోవడంలోనే న్యాయం ఉందనిపిస్తుంది. ఎవడైనా ఏదైనా చెయ్యకూడని పనిచేస్తే రౌరవాది నరకాలలో పడిపోతావు రా అంటూ శాపనార్థాలు పెట్టడం చూస్తూనే ఉన్నాం. పుత్రసంతానం లేకపోతే పున్నామనరకాలలో కూలిపోతామని ఇప్పటికీ ఎందరో భయపడడాన్నీ చూస్తున్నాం. ఎపðడు నరకం ప్రస్తావన వచ్చినా అందరికీ గుర్తొచ్చేది యమలోకం.


ఇంకా కాస్త లోతుకు దిగితే దాని యజమాని యముడు..!
మరి ఈ పున్నామ నరకాలు, రౌరవాది నరకాలేమిటి
అసలు మనకు ఎన్ని నరకాలున్నాయి
పురాణాలు చెప్పిన దాని ప్రకారం 28 రకాల నరకాలున్నాయి.
పాప స్వరూపాలను బట్టి యముడు ఆయా నరకాలకు పాపులను పంపుతుంటాడు.
1.తమిశ్రం: ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్ళను యమదూతలు కాలపాశంతో కట్టేసి ఇదో చిమ్మచీకటి నరక కూపం. అక్కడ పాపిని సొమ్మసిల్లిపడిపోయేదాకా కర్రతోకాని, కడ్డీతోకాని, మొరకు తాళ్ళతో కానీ చావబాదుతారు. దెబ్బలకు తట్టుకోలేక గావుకేకలు పెట్టినా, చావుకేకలు పెట్టినా పట్టించుకోరు. తాగడానికి నీళ్ళు, తినడానికి తిండి కూడా ఇవ్వకుండా చితకబాదుతారు. పాపి ఒకవేళ కళ్ళుతిరిగి పడిపోయినా వదలరు. స్పృహలోకి వచ్చాక ఈ శిక్షను తిరిగి అమలుచేస్తారు. ఇలా శిక్షాకాలం పూర్తయ్యేవరకు చావబాదుతునే ఉంటారు.
2. అంధతమిశ్రం: ఒకరినొకరు వెూసపుచ్చుకుని చిన్ని నా పొట్ట నిండితే చాలుననుకుంటూ స్వార్థ చింతనతో ముక్కుమునగ తినే వారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వెంట్రుకముక్కలా వదిలిపారేసే భార్యా భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. నిష్కారణంగా విడాకులిచ్చే భార్యకు, భర్తకు కూడా ఇక్కడే శిక్షపడుతుంది. ఇదో భయంకరమైన చీకటి నరకం. ఇక్కడ కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనబడవు. ఇక్కడకు వచ్చేలోపే పాపిని చితక్కొట్టేస్తారు. ఆ దెబ్బలకు దిమ్మదిరిగి పోయి ఉండగా పడరెక్కలు విరిచి కట్టి తెచ్చి ఇందులో పారేస్తారు. స్పృహతప్పిపోయే దాకా హింసిస్తారు.
3. రౌరవం: రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు. వీళ్ళ చేతిలో వెూసపోయిన వాళ్ళు విన్నాగులుగా మారి విషం కక్కుతూ మొర్రోమని మొత్తుకున్నా, ఇంతకన్నా చావే సుఖం మమ్మల్ని చంపేయండి అని ప్రాథేయపడినా వినకుండా ఘోరంగా హింసిస్తారు.
4. మహారౌరవం: న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు. వీళ్ళను భయంకరమైన విషనాగులు చుట్టచుట్టుకుని మెలిబెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వీటినే క్రవ్యాదులు అంటారు. ఆ బాధ భరించలేక విలవిలలాడిపోతుంటే పాపిని చప్పరించుకుంటూ మింగుతాయి.
5. కుంభిపాకం: వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హత మార్చి కడుపునింపుకునే వారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఎపðడూ సలసలకాగే నూనె ఉంటుంది. అందులో పడేసి వేపుతారు.
6.కాలసూత్రం: ఈ నరకం కణకణలాడే రాగిపాత్రగా ఉంటుంది. పై నుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించి వయసు ఉడిగి పోయిన పెద్దవారిని గౌరవించి ఆదరించని వాళ్ళు ఇక్కడకు వస్తారు. కూచోడానికి ఉండదు. నించోడానికి ఉండదు. తప్పించుకునే మార్గంలేని ఈ నరకంలో చచ్చేదాకా పరి గెత్తించి ఆ తరువాత ఈడ్చిపారేస్తారు.
7. అసితపత్రవనం: విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు. అలాగే పెద్దలు చెప్పిన మార్గాన్ని కాదని సొంత కవిత్వం ప్రదర్శించి ఇదే గొప్ప జీవితం అని వాదించే వాళ్ళు కూడా ఈ నరకానికే వస్తారు. కత్తులలాగా మహా పదునుగా ఉండే ముళ్ళ చెట్లు, రాళ్ళూ ఉండే నరకం ఇది. ఇక్కడ పాపిని కత్తు లతో పొడుస్తూ, కర్ర లతో కొడుతూ పరుగు లెత్తిస్తారు. ఒళ్ళంతా కోసుకుపోయి, చీరుకు పోయి పాపి హాహా కారాలు చేస్తున్నా వదలకుండా వెంట పడి హింసిస్తారు. పాపి స్పృహతప్పి పడిపోతే ఆగి, తెలివి వచ్చాక మళ్ళీ కొడ తారు.యముడు విధిం చిన శిక్ష పూర్తయ్యే దాకా ఈ శిక్ష అమలు జరుగుతుంది.
8.సుకరముఖం: అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. ఇక్కడ వాళ్ళను చితక్కొట్టి పచ్చడి పచ్చడి చేస్తారు. చెరకుగడను పిండి పిప్పిచేసినట్టే పాపిని భయంకరంగా శిక్షిస్తారు. తెలివితప్పి పడిపోయినా ఉపేక్షించరు. తెలివి రాగానే ఈ శిక్ష మళ్ళీ అమలు జరుగుతుంది.
9. అంధకూపం: చిట్టి చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాథేయపడే
వారిని అవకాశం ఉండి కూడా కాపా డని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. అలాగే ఉత్తిపుణ్యానికి సాటి జీవులను చంపిపారేసే వాళ్ళు కూడా ఇక్కడకు చేరతారు. వాళ్ళను పులులు, సింహాలు, గద్దలు, తేళ్ళూ, పాములు నిండి ఉండే లోయలో పారేస్తారు. చేసిన పాపం పరిహారమయ్యే వరకు ఇవి అదే పనిగా దాడి చేస్తూ చంపుకు తింటాయి. ఎదుటి ప్రాణిని హింసిస్తే అవి ఎంతగా బాధపడ తాయో తెలియడానికే యముడు ఈ నరకంలోకి పాపులను నెడతాడు.
10. తప్తమూర్తి: ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు.
11: క్రిమిభోజనం: ఇది క్రిమికీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదిల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమి కీటకాలకు ఆహారంగా పడేస్తారు. అవి ప్రాణాలుండగానే ఆవురావురంటూ కండలు పీక్కుతింటాయి. ఇదో రకం చిత్రహింస. పాపి శరీరాన్ని పీక్కుతినడం పూర్తయిపోయి నంత మాత్రాన వాడి పాపం తీరిపోయినట్టుకాదు. వాడికి మరో శరీరం ఇచ్చి శిక్షను తిరిగి అమలుచేస్తారు. ఇలా పాపి చేసిన పాపానికి శిక్షాకాలం పూర్తయ్యే వరకు శరీరాలు ఇస్తూ ఈ శిక్ష విధిస్తూనే ఉంటారు.
12. శాల్మలి: దీన్నే తప్తశాల్మలి అని కూడా పిలుస్తారు. వావీ వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగ వాళ్ళను ఈ నరకానికి తెస్తారు. ఇక్కడ కణకణమండే ఒక ఇనప లోహమూర్తి ఉంటుంది. ఒంటికి పట్టిన మదం ఒదిలిపోయేదాక ఆ బొమ్మను కౌగిలించుకోవాలి. మగవాళ్ళు ఆడబొమ్మను, ఆడవాళ్ళు మగబొమ్మను కౌగలించుకోవాలి. ఒళ్ళంతా భగ్గున మండిపోతున్నా వదలకుండా పాపిని ఈ బొమ్మను కౌగలించుకునేలా చేస్తారు. పారిపోడానికి ప్రయత్నిస్తే చితకబాది మరీ తీసుకువస్తారు.
13. వజ్రకంటకశాలి: జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది. అలాంటి వారిని పదునుదేరిన వజ్రాలతో తయారుచేసిన బొమ్మ ఉంటుంది. ఇలాంటి వాళ్ళంతా దాన్ని కౌగలించుకు తీరాలి. అలా కౌగలించుకోగానే ఆ మొనదేరిన వజ్రాలు శరీరంలోకి దిగబడి ఒంటిని జల్లెడ చేస్తాయి. అంతేకాదు అక్కడ కత్తుల్లాంటి ముళ్ళున్న చెట్టు ఉంటుంది. ఆ చెట్టెక్కమని అక్కణ్ణుంచి కిందికి బరబరా ఈడ్చేస్తారు. దాంతో ఒళ్ళంతా ఎక్కడికక్కడ తెగిపోతుంది.
14. వైతరణి: అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే ఇక్కడికి వస్తారు. మరణం పొందిన వ్యక్తి పైలోకాలకు చేరాలంటే ఈ వైతరణి అడ్డంగా ఉంటుంది. దీన్ని దాటి వెళ్ళాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. దీంట్లో పడకుండా బైటపడాలని చాలా మంది కోరుకుంటారు. ఇదొక భయంకరమైన నది. మలమూత్రాలు, చీము, నెత్తురు, ఉమ్మి, వెంట్రుకలు, ఎముకలు, మాంసఖండాల వంటివి మురిగి ముక్కిపోయి గబ్బుకంపు కొట్టే మహానది ఇది. చూడడానికే రోతగా, పరమ అసహ్యంగా ఉండే ఈ నదిలోకి అక్రమాలకు పాల్పడే వారిని పడేస్తారు. ఈ కాలుష్య నదిలో క్రిమికీటకాల్లా బతుకుతూ ఆ నీరే తాగుతూ అక్కడ దొరికేవే తిని శిక్షా కాలం గడపాల్సి ఉంటుంది.
15. పూయోదకం: వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుషపశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. ఆడపిల్ల శీలాన్ని పాయసంలా జుర్రుకునే నిత్యపెళ్ళికొడకులకు కూడా ఇదే శిక్ష పడుతుంది. ఇక్కడా పాపి ఆ బావిలో నీటినే తాగి బతకాల్సి ఉంటుంది.
16. ప్రాణరోధం: కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి. పాపి ఇతర జంతువుల ప్రాణాలను తీసేందుకు ఇతర జంతువులను ఎలా ఉసిగొల్పుతాడో అలాగే ఇక్కడ క్రూర జంతువులను వేటాడమని పాపి మీదికి వదులుతారు. అవి కండకొక ముక్కగా కొరుక్కుతింటుంటే పాపి భయంకరమైన మరణవేదన పడతాడు.
17. వైశాసనం: పేదలు ఆకలి దపðలతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. మింగమెతుకు ఇవ్వకుండా, తాగడానికి నీళ్ళ చుక్క కూడా ఇవ్వకుండా యమబటులు మాత్రం పెద్దయెత్తున ఘుమఘుమలాడే వంటకాలు తింటూ పాపిని శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. ఇక్కడ ఉన్నంత కాలం పాపి ఆకలి దపðలతో మలమలమాడిపోతాడు.
18. లాలభక్షణం: అతి కాముకులు, భార్యను కట్టుబానిసంగా కన్నా నీచంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగిస్తారు. ఇలాంటి వార్తలు తరుచు వినబడుతుంటాయి. అలాంటి పొగరుబోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది. అలాంటి దుష్టాత్ములను ఇక్కడికి తెచ్చి వాడి వీర్యాన్నే కాదు మంది వీర్యాన్ని కూడా తాగిస్తారు. అలా చేయడం వల్ల వాడి భార్య ఒకనాడు ఎలాంటి బాధపడిందో వాడికి తెలిసి రావాలని ఈ పని చేస్తారు. వీర్యపు సముద్రంలో పడేస్తారు. అందులో మునుగుతూ అదే తాగుతూ శిక్షాకాలం పూర్తిచేయాలి.
19. సారమేయాదానం: ఆహారంలో విషం కలిపే వాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసే వాడు ఈ నరకానికి వస్తాడు. సామాజిక జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరు చేసే వారికి ఈ నరకంలో తినడానికి కుక్కమాంసం తప్ప మరేదీ దొరకదు. దాన్ని తిన్న వెంటనే ఆ లోకంలో ఉండే కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి పడి పాపి మాంసాన్ని పీక్కుతింటాయి.
20. అవీచి: నీటిబొట్టులేని నరకం ఇది. అక్కడ రాతిపలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రమేదో ఉందేవెూ అనిపిస్తుంది. తపðడు సాక్ష్యం చెప్పేవాళ్ళను, తపðడు ప్రమాణాలు చేసే వాళ్ళను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి వెూసం చేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకు వస్తారు. అందులో ఎంతో ఎత్తయిన కొండ ఉంటుంది. దాని మీది నుంచి కిందికి పడదోస్తారు. పాపి సముద్రంలోకి పడిపోతున్నానేవెూనని కంగారు పడతాడు. కానీ కొండకింద సముద్రం ఉండదు. రాతిపలక ఉంటుంది. దాని మీద పడి ముక్కలుముక్కలవుతాడు. కానీ చావడు. ఈ శిక్షను అదే పనిగా అమలుచేస్తారు.
21. అయోపానం: ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడా, మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనపద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి. యజ్ఞయాగాదులు చేసేటపðడు సోమపానం చేయడం ఆనవాయితీ! ఆ ముసుగులో మద్యం పుచ్చుకునేవారికి కూడా ఇక్కడే శిక్షపడుతుంది. యముడు స్వయంగా పాపి గుండెపై నించుని ఈ శిక్షను అమలుచేస్తాడు.
22. రక్షోభక్ష: జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారి కోసం ఈ నరకం ఉంది. బలిపశువు ఎంత బాధపడుతూ ప్రాణాలు వదులుతుందో అలాగే పాపి కూడా హింసపడుతూ మరణించే విధంగా ఇక్కడ వాడిచేతిలో బలైన జీవులు, మనుషులు వచ్చి వాణ్ణి కొరికి, తొక్కి, పొడిచి, చీల్చి చెండాడి కసి తీర్చుకుంటాయి.
23. శూలప్రోతం: ఎదుటి వాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్ళను, నమ్మకద్రోహం చేసే వాళ్ళను ఈ నరకంలోకి పంపుతాడు యముడు. అక్కడ వాళ్ళను శూలానికి గుచ్చి వేలాడదీస్తారు. భరించరాని ఆ బాధకు తోడు అన్నం పెట్టరు, తాగడానికి నీళ్ళూ ఇవ్వరు. దీనికి తోడు దెబ్బలతో హింసిస్తారు.
24. క్షరకర్దమం: మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకువస్తారు. వాళ్ళను తలకిందులుగా వేలాడదీసి అనేక రకాలుగా హింసిస్తారు.
25. దందశూకం: తనతోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవహక్కులను హరించి వేయడంలాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు. అతడు ఏయే జంతువులను హీనంగా భావింవి ఆ జంతువుల్లా సాటి మనిషిని పరిగణించి కిరాతకంగా వేధిస్తాడో వాణ్ణి ఆ జంతువులు అత్యంత దారుణంగా చీల్చి చెండాడతాయి.
26. వాతరోదం: అడవులలో, చెట్లమీద, కొండకొమ్ములలో ఉంటూ ఎవ్వరి జోలికీ రాని జంతువులను పట్టి పల్లార్చే వారి కోసం ఈ నరకం ఉంది. అలాంటి వాళ్ళను నిపðతో కాల్చి, విషమిచ్చి, వివిధ ఆయుధాలతో హింసిస్తారు. పాపి ఎంత బాధపడుతుంటే అంతగా హింస ఉంటుంది.
27. పర్యావర్తనకం: ఆకలితో అలమటించిపోయే వాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని ఈ నరకంలో పడేస్తారు. ఇక్కడకు రాగానే పాపిని కాకులు, గద్దలు కళ్లు పొడిచి ఎక్కడికీ పారిపోడానికి వీలులేకుండా చేస్తాయి. ఆ తరువాత రోజూ పాపిని రక్తవెూడేలా పొడుస్తూ ముక్కలుగా ముక్కలుగా కండలూడదీస్తాయి.
28. సూచీముఖం: గర్వం, పిసినారితనం ఉన్న వారిని, రోజు వారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోభులు ఇక్కడికి వస్తారు. వీళ్ళు తమ కడుపు కోసం తినరు. ఇంకొకరికి పెట్టరు. అపð చేసి ఎగనామం పెట్టే వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడకు వచ్చే వారిని నిరంతరం సూదులతో పొడుస్తుంటారు.
ఇవికాక అర్బుదం, నిరర్బుదం, యెయెయె, హహవ, ఉత్పల, పద్మ, మహాపద్మలని చల్లటి నరకాలున్నాయి. ఈ నరకాలలో పడిన వాళ్ళు చలికి బిగుసుకుపోయి గడ్డకట్టుకుపోతారు.
-సామాజిక జీవితాన్ని సవరించడానికి, వ్యక్తిగత జీవితాన్ని సంస్కరించడానికి ఈ నరకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఒక విషయాన్ని నయానకానీ, భయానకానీ చెప్పవచ్చునంటారు పెద్దలు. ఆశలు ఆకర్షణలు రేకెత్తిస్తూ చెప్పే ఉపదేశాలు నయాన చెప్పేవైతే నరకాలు, నరకబాధలు వగైరాలు భయాన చెప్పేవి. ఎటుదిరిగీ ప్రజల ప్రవర్తన బాగా ఉండాలని, వాళ్ళ వల్ల సాటి మనుషులే కాదు ఇతర జీవజాలం కూడా ప్రశాంతంగా బతకాలని బలంగా కోరుకుని పెద్దలు ఏర్పరచినవి ఈ నరకాలు. పైన చెప్పిన వివరాలో వ్యష్టినిష్ఠను, సామాజికనిష్ఠను పెంపొందింపజేసే అంశాలే చాలా కనబడతాయి. రాముడిని నమ్మినా, యముడిని నమ్మినా ఫలితం సామాజిక సంక్షేమమే! పెద్దల ఆకాంక్షలు నెరవేరాలంటే మనమంతా క్రమశిక్షణ కలిగి కట్టుబాటుతో జీవించాలి.
ఇన్ని రకాల నరకాలు లేకుండా పోతే అంతకన్నా పండగ మరొకటి ఉంటుందాబాధల బాదరాబందీలేకుండా బతకడం కన్నా జీవితానికి వేరే ఆనందమేముంటుంది బాధలు లేనపుడే కదా జీవితంలో కళాకాంతీ సమకూరేవి. కాంతే ముఖంలో ప్రతిబింబించే వెలుగు. బాధలున్న ముఖం అమావాస్యకు సంకేతమైతే కళకళలాడే ముఖం దీపావళికి సంకేతం. ఆనందం తాండవించే ముఖంలో కళ్ళు ఒక్కటే కాదు మొహంలోని ప్రతీ అణువూ వెలిగిపోతూ ఉంటుంది.ఇదే దీపాల వరస..! ఇదే దీపావళి పండగ వరస!!

ఆధారం : ఆంధ్రప్రభ , సూర్య  దినపత్రికలలోని వ్యాసాలు

కామెంట్‌లు