ఉండబట్టనివ్వని వ్యాసం :రోజుకి రెండువేలకు పైగా అంతరించి పోతున్న అన్నదాతలు

భారతదేశ జనాభా 121 కోట్లను దాటింది. అందులో 60 కోట్లకు పైగా (53 శాతం) రైతులే వున్నారు. మనది రైతు రాజ్యం అని కళ్ళు మూసుకుని వల్లె వేసుకుంటూ వస్తున్నాం కానీ లెక్కలు చెబుతున్న నిజం అది కాదు.

వ్యవసాయమే ప్రధానంగా వున్నవారు తొమ్మిదిన్నర కోట్ల మందే (9.58 కోట్లు) అంటే కేవలం జనాభాలో 8 శాతం మంది పండిస్తుంటే మిగిలిన వారందరికీ సరిపోవలసిన పరిస్థితి. 1991 జనాభా లెక్కలలో వీరు 11 కోట్ల వుంటే 2001 కి వచ్చే సరికి 10.3 కోట్లకు తగ్గింది. ఇది వ్యవసాయ రంగ దుస్థితికి దర్పణం.
పిజ్జాలు బర్గర్లు తినేసి బతుకుదాం అనుకున్నా వాటికి పిండి పండించేవాళ్లు కావాలికదా. మనం రోజూ తినేందుకు వాడే వాటిల్లో 99 శాతం వ్యవసాయ ఆధారితాలే అనే నిజం మనకి తెలుసు కానీ పండించేవారి సంఖ్య తగ్గటం, ఇప్పటికే వృత్తిలో వున్న వారు ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అనే ఆలోచనలతోనే వుండటం మాత్రం జీర్ణించుకోలేని నిజం

1995 తర్వాత కాలంలో లెక్కేసినా వ్యవసాయం చెయ్యలేక ఆత్మహత్యలకు పాల్పడ్డరైతుల సంఖ్య రెండు లక్షల డెబ్బైవేల పైగా ( 2,70,940) మనం దారుణమని బావించే భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య ఇరవై వేల మంది.

ఇలా వ్యవసాయం నుంచి బయటికి వచ్చిన వారేమైన ఇతర రంగాలలో మంచి స్థానంలోకి వెళుతున్నారా అంటే అదీ లేదు. చాలా సాధారణ మైన పనులు చేసుకుంటూ మరింత దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారు. Institute of Applied Manpower Research (IAMR) డిసెంబర్ 2012 లో ఇచ్చిన రిపోర్టులో వ్యవసాయేతర రంగాలలోనూ ఏమాత్రం సరైన పెరుగుదల లేదని తేల్చింది, పారిశ్రామిక, సేవల రంగాలలోనికి మారిన ఒక కోటి యాభై లక్షల మంది మొరుగైన జీవనం లోకి మారక పోయిన మరింత మంది బయటకు వచ్చేందుకు సిద్దం అయ్యారు.

ఒక ప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలోకి మానవ వనరులను తరలించేందుకు జీవన భద్రతను ఆశగా చూపి ఆ రంగాన్ని బలం కాపాడుకున్నాం. ఇప్పుడు చేస్తే ప్రభుత్వోద్యోగం చెయ్యాలి అనే ఆలోచనను గత దశాబ్దం వరకూ కూడా చాలా బలం గా నిలబెట్టారు.

ఇప్పుడు ఒక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ఏ రంగానికి ఆరంగం తగు మోతాదులో పనిచేయాల్సిందే. ఈ త్రాసు ఏదో ఒకవైపే పూర్తిగా మొగ్గటం సరైనది ఎప్పటికీ కాదు.

ఆధునికి పద్దతులు, వ్యక్తిగత స్ధాయిలో గౌరవం, గిట్టుబాటుధర, మార్కెట్ అందుబాటు, మొదలైన సంస్కరణలు మరింత ముమ్మరంగా చేపట్టాలి.

నేటి వస్తుసంస్క్రతి భూమిని నమ్ముకున్న జీవితాలను పేలవమైనవని తేల్చేస్తూ, వాణిజ్యపు వలలోనికి పొలాలను సైతం లాగేస్తున్నది.

పెద్ద పెద్ద వ్యాపారాలకు పరుగెత్తుకెళ్ళి సాయం చెయ్యాలని ఉవ్విళ్ళూరే ప్రభుత్వాలు వ్యవసాయం దగ్గరకు వచ్చేసరికి వెనుకంజ వేస్తున్నాయి.

ఈ రోజు (02-05-2013) హిందులో పి.సాయినాధ్ గారి వ్యాసం 2011 జనాభా లెక్కల ఆధారంగా రైతుల దుస్థితి కళ్లకు కట్టారు. వ్యాసానికి తోడు స్వంత ఆలోచనలను కలగా పులగం చేస్తూ రాసింది ఇది
http://www.thehindu.com/opinion/columns/sainath/over-2000-fewer-farmers-every-day/article4674190.ece?homepage=true

కామెంట్‌లు