బేట్రాయి సామి ఎవరు ?

‘‘ బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా ’’ అంటూ పవన్ కళ్యాణ్ ఈ మధ్య పాడిన పాట సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది. లక్షల్లో వీక్షకులు యూ ట్యూబ్ ని చూసారు. ఎక్కడ చూసినా హమ్ చేస్తున్నారు. వింటుంటే ఈ బేట్రాయి ఏంటబ్బా అనిపించి కొంచెం రిఫరెన్స్ చూస్తే తెలిసిన విషయాలు మీతో పంచుకుంటాను.

కదిరి పట్టణం అనంతపురం జిల్లాలోనిది. ఇక్కడ కదిరి నరసింహ స్వామి దేవాలయంలో ప్రముఖంగా వినిపించే పాటను రీ మిక్స్ చేసి ‘‘ అత్తారింటికి దారేది’’ చిత్రంలో పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజుకు దారేదని కూడా చూస్తున్నారు.




ఖాద్రీ అనే పేరు కాల క్రమంలో కదిరిగా మారిందని స్థలపురాణం. ఖాద్రి, ఖధిర (మడుగు దామర/ చండ్ర చెట్టు Canary wood or Indian mulberry /Morinda citrifolia ) అనేది ఒక చెట్టు ఆ చెట్టుక్రింద వున్న చీమల పుట్టలో నరసింహ స్వామి స్వయంభూవై(self emenating) వెలిశాడని చెపుతారు. వేదారణ్యంగా పిలువబడే ఈ ప్రాంతంలో ఖదిర చెట్లు ఎక్కువగా ఉన్నందున దీనికి కదిరి అని పేరు వచ్చిందని కూడా చెపుతారు.‘ఖ’ అంటే విష్ణుపాదము. ‘అద్రి’ అనగా కొండ. అందుకే ఈ పట్టణానికి ‘ఖద్రి’ అనే పేరు వచ్చి కాలక్రమేణా కదిరిగా రూపాంతరం చెందిందని కూడా చెబుతారు. కదిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కనిపించే పాదాల గుర్తులను విష్ణుపాదాలుగా విశ్వసిస్తారు.   భక్త ప్రహ్లాదుని మొర ఆలకించి హిరణ్యకశిపుడిని వధించేందుకు ఎనిమిది చేతులతో ఉగ్రరూపం తో ఇక్కడే వెలిశాడని కథ. ఈ దేవాలయం 13 శతాభ్దం నుంచే వున్నదని అక్కడి ఆధారాలతో చెపుతున్నారు. ఈ ఆలయంలోని రంగమండపంలోని వర్ణ చిత్రాలు కొంత వెలిసినట్లు వున్నా ఇప్పటికీ ఆకర్షణీయంగా వున్నాయి. పునాదిలో కాకుండా కేవలం బండపైనే నిలబెట్టిన ద్వజస్థంభం ఇక్కడి మరో ఆకర్షణ. ఆరొందల సంవత్సరాల పైచిలుకు వయసు పదకొండువందలకు పైగా ఊడలతో ప్రపంప ప్రసిద్ధి గాంచి గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన తిమ్మమ్మ మర్రిమాను ఈ దేవాలయానికి సమారు 25 కి.మీ దూరంలోనే వుంటుంది. కదిరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కటారు పల్లె లో యోగి వేమన సమాధి కూడ వున్నది.ఎక్కడా లేని విధంగా ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామి ని కొలుస్తుంటారు. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడ వస్తుంటారు. ఖాద్రీ అనే పేరు ముస్లింల పేర్లలో వినిపిస్తుంది.

"బేట్రాయి సామి దేవుడా, నన్నేలినోడ…"ఇందులో బేట్రాయి – బేట రాయడు అంటే వేటకు రాజు – నరసింహ స్వామి.తెలుగులో వ కన్నడలో బ, తెలుగు "ప", కన్నడ "హ" గా పలకటం మనకు తెలిసిందే. వేట రాయుడు కాస్తా కన్నడ పలుకు బడిలో బేట రాయుడు బేట్రాయుడు గా మారి బేట్రాయి స్వామి గా కొలుపులందుకున్నాడు. దీన్నే పాటలో బేట్రాయి సామి దేవుడా నన్ను ఏలిన వాడా అని స్తుతిస్తున్నాడు. 

బెట్ట- అంటే కన్నడంలో కొండ, పర్వతము (తమిళంలో విట్ట/వెట్ట, తెలుగులో మెట్ట దీని సజాతి పదాలు కావచ్చు). బెట్టహళ్ళి, బెట్టదహళ్ళి, బెట్టదపుర, బెట్టదతుంగ, బెట్టగెరె, బెట్టకోటె వంటి ఊర్ల పేర్లు కర్నాటకాలో కోకొల్లలు. తమిళనాడులో డెంకణికోట (தேன்கனிகோட்டை) అన్న గ్రామంలోని దేవాలయంలో ప్రధాన దేవుడు వెట్టరాయన్ స్వామి లేదా బెట్టరాయ స్వామి. ఈ ఊరు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది కాబట్టి ఈ బేట్రాయ సామి దేవుడా పాటలోని మూలవిరాట్టు ఈ స్వామిగురించేనని కూడా
సురేశ్ కొలిచర్ల గారు విశ్లేషించారు. కానీ వేటతో కూడా ఇక్క సంభందం వుండటంతో వేట పదాన్ని సులభంగా తీసేయలేక పోతున్నాం ఇంతకీ ఈ వేట రాయుడు ఏంటి ఏమి వేటాడుతాడు. దానికీ కొంత ఆధారం దొరికింది.

ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేట కు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనగా మృగాలు పరుగెత్తుతుండగా వాటిని వెంబడించి వేటాడటం. అడవిలో విచ్చల విడిగా తిరుగుతూ భీభత్సాన్ని కలిగిస్తున్న క్రూర మృగాలను వేటాడి చంపి ప్రశాంతతను చేకూర్చే ప్రధాన లక్ష్యంతో పూర్వం రాజులు వేటకు వెళ్ళేవారు. అది ఆనందం కోసమే కాకుండా ప్రజలకు మృగాలనుంచి రక్షణ కల్పించేదుకు ప్రధాన విధిగా కూడా వుండేది. అయితే ఇప్పుడు దానిని ఆద్యాత్మికంగా మనసుపై అదుపుకు చేయాల్సిన వేటగా చెపుతూ అరిషడ్వర్గాల ప్రభావానికి లోనైన ఇంద్రియాల ప్రేరణతో నిలకడలేక పోరాడుతూ, ఉండే చంచలమైన మనస్సే ఒక మృగం. అలాంటి స్థిరత్వం లేని భక్తుని మనస్సును పంచాయుధాలతో స్వామి వేటాడి పట్టుకొని ఏకాగ్రతను ప్రసాదించడమే. ఈ ‘పారువేట’ ఉత్సవ నిర్వహణలోని అంతరార్ధంగా కూడా చెపుతారు. నిఘంటువులలో ఈ పారువేటకు అర్ధం ఏముందా అని చూస్తే మరికొంత సమాచారం అదనంగా లభించింది.

తిరునాళ్ల చివరనాడు, దేవుడు గుఱ్ఱపు వాహనము మీద, ఊరిమంద బయటికి పోయి, వేటాడినట్లు ఆడుట.The chase, game that is hunted. ఇది మనం పైన చెప్పుకున్న అర్ధంలాగానే
నెల్లూరు; కర్నూలు; అనంతపురం లోని పల్లె ప్రాంతాలలో వయసులో వున్న మగపిల్లలు బయటకువెళ్ళేప్పుడు వ్యంగ్యంగా అయ్య పారువేట (పార్వేట)కు బయలుదేరినాడే అంటుంటారు. అంటే వ్యభిచరించేదుకు తిరగటం అనే అర్ధం కూడా దీనికి వుంది.
పందెపు వేట అని మరొక అర్ధంలో కూడా వాడతారు దేవుని ఉత్సవ సమయంలో ఒక గూటానికి పొట్టేలుని కట్టి దూరం నుండి తుపాకులతో గురిచూసి కాల్చటం వుంటుంది. సరిగా గురి చూసి కాల్చిన వాడికి పొట్టేలు స్వంతం అవుతుంది. దీన్ని కూడా పారువేట అనే పిలుస్తారు.

దసరా పండుగ చివరలో జమ్మి కొట్టుటకు వెళ్ళటాన్ని కూడా పార్వేట అనే పిలుస్తారు.

పవన్ కళ్యాణ్ సినిమాలో పాడిన పాటలోని టెక్ట్స్ ఇది.

హేయ్…

కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…

కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…

కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…

మేటైన ఏటకాడ నిన్నే నమ్మీతిరా…

మేటైన ఏటకాడ నిన్నే నమ్మీతిరా…




బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…

సేపకడుపు సీరి బుట్టితి రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టితీ…

హెయ్… హెయ్… హెయ్…

బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…

కొటిమన్ను నీళ్ళలోన యెలసి యేగమై తిరిగి.. కొటిమన్ను నీళ్ళలోన...

హొయ్… హొయ్… హొయ్…





బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మ దెవరకిచ్చినోడ…



బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మ దెవరకిచ్చినోడ…





బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…

సేపకడుపు సీరి బుట్టితి రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టితీ…

బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…

హో... య్య...




ఈ పాట జానపద గీతం గానే కాకుండా భజన గీతంగా కూడా రాయల సీమలో ప్రసిద్ధి పొందిదని ఆ వివరాలను సుమంగళి చిత్రంలోని పాటనూ నా మిత్రుడు Mohan Ravipati గారు వారి ప్రెండ్ కమలాకర్ గారి సౌజన్యంతో అందజేసారు. వారిద్దరికీ ధన్యవాదాలతో ఆ పాటకూడ ఇక్క ఇస్తున్నాను వినండి.


అన్నమయ్య కీర్తనలో కూడా నవ విద నరసింహ స్తోత్రం కనిపిస్తుంది.తొమ్మిది రూపాలు ఇవి : 1.జ్వాల,2. వీర, 3.యోగానంద,4. కానుగుమాని, 5.మట్టెమళ్ల ,6. భార్గోటి, 7.ప్రహ్లాద, 8.లక్ష్మీ, 9.వరాహ నరసింహులు. వీరిని అన్నమయ్య ఈ కీర్తనలో వర్ణించాడు.

డా. తాడేపల్లి పతంజలి గారు గో తెలుగు డాట్ కామ్ లో రాసిన ప్రతి పదార్ధ వివరణలు ఇక్కడ చూడండి.


నృసింహ మంత్రం

ఉగ్రం వీరం మహా విష్ణుం 

జ్వలంతం సర్వతో ముఖం,

నృసింహ బీషణం భద్రం,

మృత్యు మృత్యుం నమామ్యహం.



1940 లో వచ్చిన సుమంగళి చిత్రం(ఈ పేరుతోనే 1965, 1989 లో కూడా సినిమాలు వున్నాయి) లో కూడా ఈ పాటను వాడారు. చిత్తూరు నాగయ్య గారు పాడారు. దీనికి ప్రొడక్షన్ మేనేజన్ మనకు కె.వి. రెడ్డి గా తెలిసిన కదిరి వెంకట రెడ్డి(1912 - 1972) గారు వారి కదిరి అభిమానాన్ని వివరాలనూ ఇలా అందజేసినట్లున్నారు. ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి లో జన్మించారు. 





 





జన పదాలలో దశావతార వర్ణన ఇది భజన పాటగా పడుకునే వారు. అచ్చమైన రాయలసీమ వాసన పక్క రాష్ట్రాల అక్షర ప్రభావం కొంత వుంటుంది. దీన్ని పలకల భజన అంటారు.


బేట్రాయి సామి దేవుడా - నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా
కాటేమి రాయుడా - కదిరినరసిమ్మడా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా

బేట్రాయి...

శాప కడుపు సేరి పుట్టగా - రాకాసిగాని
కోపామునేసి కొట్టగా
ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ

బేట్రాయి...

తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ
దేవాసురులెల్లకూడగా
దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు
సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ

బేట్రాయి...

అందగాడనవుదులేవయా - గోపాల గో
విందా రచ్చించా బేగరావయా
పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి
కిందు మిందు సేసినోడ సందమామ నీవె కాద

బేట్రాయి...

నారసిమ్మ నిన్నె నమ్మితి - నానాటికైన
కోరితి నీ పాదమే గతీ
ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి
కోరమీస వైరిగాని గుండె దొర్లసేసినోడ

బేట్రాయి...

బుడుత బాపనయ్యవైతివి
ఆ శక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివీ
నిడువు కాళ్ళోడివై అడుగు నెత్తిపైన బెట్టి
తడవు లేక లోకమెల్ల మెడిమతోటి తొక్కినోడ

బేట్రాయి...

రెండుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల
సెండాడినావు పరశుతో
సెండకోల బట్టి కోదండరామసామికాడ (సెండకోల = గండ్రగొడ్దలి)
బెండు కోల సేసికొనీ కొండకాడకేగినోడ (బెండు కోల = శక్తి తగ్గించుకుని, సముద్రం దగ్గర

గొడ్డలి విసిరేసి అంత మేరా సముద్రాన్ని వెనక్కి జరిపినాడు కదా, ఆ ఘట్టం)

బేట్రాయి...
రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి
శ్యామసుందర నిన్ను మెచ్చగా
సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి

ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ

బేట్రాయి...

దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన
దేవుడై నిలిచినావురా
ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగూడుకొనీ
తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ (తక్కిడి బిక్కిడి = మోసం)

బేట్రాయి...

ఏదాలూ నమ్మరాదనీ ఆ శాస్త్రాలా
వాదాలూ బాగ లేవనీ
బోధనలూ సేసికొనీ బుద్ధూలు సెప్పుకొనీ
నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద

బేట్రాయి...

కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన
పలికినావు బాలశిశువుడా
చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర
పిల్లంగోవి సేతబట్టి పేట పేట తిరిగినోడ..

బేట్రాయి...


( ఇందులో భజన చెయ్యడానికి వాడే చెక్కలు పొడవుగా ఉండే పలకలను పోలి ఉండడం వల్ల చెక్కభజననే పలకల భజన అని కూడా అంటారు. చేతుల్లో మూరెడు పొడవుండే తాళపు చెక్కలతో, కాళ్ళకు గజ్జెలతో వలయాకారంలో తిరుగుతూ తాళపు చెక్కలు వాయిస్తూ తాళానికి అనుగుణంగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు. ఒకే చేతిలో రెండు చెక్కలను ఆడిస్తూ వాయించడం చెక్కభజనలోని సొగసు. వలయాకారంలో తిరిగే కళాకారులు కొన్ని సార్లు ఉద్దులు-వెలుద్దులుగా (జతలు జతలుగా) మారి ఎదురెదురుగా అడుగుమార్చి అడుగువేస్తూ ఉద్ది మార్చి ఉద్ది (ఒక అడుగులో ఒకవైపు-ఇంకొక అడుగులో రెండవవైపు) తిరుగుతూ నృత్యం చేస్తారు. పెన్నుద్దికాడైన గురువు పాటలోని ఒక్కొక్క చరణం అందిస్తే మిగిలిన వాళ్ళు అందుకుని పాడుతూ నృత్యం చేస్తారు. పలకల భజనలో జడకోపు తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం చెక్కభజనలో భక్తి, పౌరాణిక, శృంగార, హాస్య సంబంధమైన పాటలు వ్యాప్తిలో ఉన్నాయి. ప్రాచీనకాలంలో తిత్తి, మద్దెల, కంజీర వాయిద్యాలుగా ఉండేవి. ఇప్పుడు హార్మోనియం, డోలు, కంజీర, తబలా వాడుతున్నారు.)






దేవ దేవం భజే 
రామజోగయ్య శాస్త్రిగారు రాసిన రెండు వెర్షన్లతో పాటు
అన్నమాచార్య విరచిత గీతం దాని తాలూకూ ప్రతి పదానికీ అర్ధం కొసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కామెంట్‌లు

  1. క్రింది వీడియో చూడండి.

    http://www.youtube.com/watch?v=rbEiLmhlzxc&feature=youtu.be

    రిప్లయితొలగించండి
  2. ఈ పాట ఒరిజినల్ ఉంది. కాకపోతే శాస్త్రీయంగా పాడారు.

    http://www.youtube.com/watch?v=rbEiLmhlzxc&feature=youtu.be

    రిప్లయితొలగించండి
  3. కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వాడని కొన్ని వీరగాథలలోని వంశవృక్షాల వల్ల తెలుస్తోంది.
    కాటమరాజు కథాచక్రాన్ని యాదవభారతం అంటారు. ఈ కథలు రాయబడిన తాటాకు పుస్తకాలని “సుద్దులగొల్లలు, కొమ్ములవారు” అనే గాథాకారులు ఎద్దులపై వేసికొని ఊరూరా ప్రయాణం చేసి ఈ వీరగాథలను పాడటం చేత “యాదవభారతం ఎద్దుమోత బరువు” అనే సామెత పుట్టింది.

    http://antharlochana.blogspot.in/2013/08/8-1985.html?showComment=1375722823822#c6488372482110468739

    రిప్లయితొలగించండి
  4. చేప గురించి ప్రస్తావన.....మత్స్యావతారంకి సంబందించిన ఘట్టాలు అయి ఉంటాయా...?

    రిప్లయితొలగించండి
  5. శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఐదవ అధ్యాయం

    శ్రీశుక చే చెప్పబడిన ప్రద్యుమ్న జన్మ వృత్తాంతంలో అతను చేపకడుపు చీల్చుకుని పుట్టటం వుంటుంది. మరో రకంగా ఇతడు రుక్మిణీ కృష్ణుల కుమారుడు కూడా కావటంతో యాదవ రాజుల కాలంలో ఈ కథ ప్రాచుర్యంలోకి రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

    రుక్మిణీ కృష్ణులకు ఒక కుమారుడు కలిగాడు. పూర్వకాలం తను బాణం వేసిన శంకరుని చేత దగ్ధమైన మన్మధుడు శరీరాన్ని కోల్పోయాడు. మన్మధుడు వాసుదేవుడి అంశ కాబట్టి వాసుదేవున్నే ఆశ్రయించాడు. ఆ మన్మధుడే కొడుకుగా పుట్టాడు రుక్మిణీ కృష్ణులకు అతని పేరు ప్రద్యుమ్నుడు. ఇతను ద్వారకకు దగ్గరలో ఉన్న రాజ్యములో శంబద్రుడు అన్న ఒక్ రాక్షసుడు ఉన్నాడు.
    నారదుడు శంబరుని వద్దకు వెళ్ళి రుక్మిణీ కృష్ణులకు పుట్టబోయేవాడే నిన్ను చంపుతాడు అని చెప్పాడు
    వీరికి ఎపుడు కొడుకు పుడతాడా అని ఎదురు చూస్తూ, పుట్టగానే తన మాయ చేత సముద్రములో పడేస్తే అందులో ఒక పెద్ద చేప మింగింది. మత్స్య కారులు ఆ చేపను పట్టుకున్నారు. అంత పెద్ద చేపను శంబరాసురునికి కానుకగా ఇచ్చారు
    మన్మధుని భార్య ఐన మాయా దేవి నారదుని ఉపదేశముతో అప్పటికే అక్కడ వంటామెగా చేరింది. ఆ చేపను ఆమెకిచ్చి వండమన్నారు. ఆమె ఆ చేపను కోయగా పిల్లవాడు కనపడ్డాడు.
    మళ్ళీ నారదుడే వచ్చి ఆ పిల్లవాడు నీ భర్త, జాగ్రత్తగా పెంచు అని చెప్పగా, చాలా శ్రద్ధగా ప్రేమగా భక్తిగా పెంచింది.
    ఎక్కువ కాలం కాకుండానే ఈ పిల్లవాడు నవ యవ్వనుడయ్యాడు. అతనిలో అన్ని కళ్యాణ గుణాలూ వచ్చిన తరువాత అప్పటిదాకా పెంచిన మాయా దేవి సిగ్గు పడుతూ ఓరచూపు చూస్తూ ఉండగా
    అమ్మా ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నావు. మాతృ భావాన్ని విడిచిపెట్టి కామినిలా ప్రవర్తిస్తున్నావు. అంటే
    నాయనా నీవు నారాయణుని పుత్రుడివి, నిన్ను శంబరుడు సముద్రములో పడవేశాడు, నేను నీకు పత్నిని, నా పేరు రతి, నీవు కాముడవు. పురిటిలోనే నిన్ను ఈ రాక్షసుడు అపహరించి సముద్రములో పడేస్తే, నిన్ను చేపను మింగితే ఆ చేప కడుపులోఉ ఉన్న నీవు చేపతో బాటుగా ఇక్కడకు వచ్చావు. నారదుడు నాతో నిన్ను జాగ్రత్తగా పెంచమని చెప్పాడు
    ఈ రాక్షసున్ని నీవు చంపాలి, ఇతను మహా మాయావి. అతని మాయను జయించే మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రముతో నీవు సిద్ధిని పొంది ఆ రాక్షసుని మీదకు యుద్ధానికి వెళ్ళు అని చెప్పి ఆ మహా విద్యను తాను బోధించింది.
    ఆ విద్యలో సిద్ధి పొంది శంబరుని మీదకు దండేత్తి వెళ్ళి యుద్ధానికి ఆహ్వానించాడు
    ఆ రాక్షసుడు కూడా అసహనముతో ఎర్రబారిన కళ్ళతో గదను తీసుకుని అతని మీదకు వచ్చాడు
    పరస్పరం యుద్ధం చేసుకున్నారు. ప్రద్యుమ్నుడు వశం కాకపోవడం గమనినంచి శంబరుడు తన మాయను ప్రయోగించాడు
    తన మాయతో రక రకాల వర్షాలు కురిపించాడు. అపుడు రతి బోధించిన మహా విద్యను ప్రయోగించాడు. అపుడు ఆ మాయలన్నీ మాయమైపోయాయి. అపుడు ఖడ్గముతో శంబరాసురుని శిరస్సుని హరించాడు
    దేవతలు శంబరాసుర సంహారాన్ని చూచి అతని మీద పుష్ప వర్షం కురిపించారు.
    శతృ విజయాన్ని సాధించి భార్యను తీఎసుకుని విమానములో బయలు దేరి ద్వారకా నగరానికి వచ్చారు
    ద్వారకా నగర పుర వీధులలో భార్యా భర్తలు వస్తోంటే అతనిని చూచిన స్త్రీలు కృష్ణుడే అనుకుని సిగ్గుతో కాస్త లోకపలకు దాక్కున్నారు. మళ్ళీ జాగ్రత్తగా చూచి కృష్ణుడి లాంటి వాడు కానీ కృష్ణుడు కాదు అని తెలుసుకున్నారు.
    ఆయన కాదని తెలుసుకుని ముందుకు వచ్చారు
    అచ్చం కృష్ణునిలాగే ఉన్నారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటే ఆ మాట విని రుక్మిణి కూడా బయటకు వచ్చింది. తన కొడుకు బ్రతికి ఉంటే ఈపాటికి ఇలాగే ఉండి ఉండేవాడు
    ఈ పుండరీకాక్షుడు ఎవరు, ఏ తల్లి ఇతనిని తొమ్మిది నెలలు మోసింది. నా కొడుకు బతికి ఉంటే ఇంతటి వాడే అయి ఉండేవాడు
    ఆకారములో గానీ అవయవాలతో గానీ గమనముతో గానీ మాటా నవ్వు చూపూ ఇలా కృష్ణ పరమాత్మతో సామ్యం పొంది ఉన్నాడు. తను అతనే ఐ ఉంటాడా
    ఇతనిని చూస్తే నా హృదయములో ప్రేమ పెల్లుబికుతోంది. ఇలా అనుకుంటూ ఉంటే ఆ మాట కృష్ణుడిదాకా వెళ్ళింది. ఆయన తల్లి తండ్రుల వద్ద ఉన్నాడు.
    అన్నీ తెలిసిన్ స్వామి కూడా నాలాగే ఉన్నాడన్న ఆశ్చర్యాన్ని ప్రకటించి చూస్తూ కూర్చున్నాడు. అపుడు నారదుడు వచ్చి మొత్తం విషయాన్ని చెప్పాడు
    ఈ విషయాన్ని విని అంతః పుర స్త్రీలంతా మహాశ్చర్యం పొంది రుక్మిణీ కృష్ణులనూ ప్రద్యుమ్నుడినీ భార్యనూ కూడా అభినందించారు . ఎపుడో వెళ్ళి ఇన్నేళ్ళకు వచ్చాడు, చనిపోయిన వాడు బతికి వచ్చినంత ఆనందముగా ఉంది
    పిల్లవాడిని దగ్గర తీసుకుని దంపతులను ఆలింగనం చేసుకుని తన పుత్రున్ని దగ్గరకు తీసుకుని అమితానందాన్ని పొందింది.
    రుక్మిణీ కృష్ణుల అదృష్టమే అదృష్టం.కొడుకు పుట్టాడనుకున్నారు. కానీ వెంటనే పోయాడు. పోయిన కొడుకు మళ్ళీ దొరికాడు.

    http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81%E0%B0%A1%E0%B1%81

    రిప్లయితొలగించండి
  6. ఇది దశావతారాలను గ్రామీణుడు వర్ణించిన ఒక జానపదం. స్వచ్చమైన రాయలసీమ వాసన. భజనల్లో పాడుకునే వాళ్ళు.

    ‘‘పలకల భజన ’’ అని పిలిచేవారు, భజనల కాంపిటీషన్ నడిచేది అందులో ఈ పాట హోరుకు అంతేలేదు.

    సమాచారానికి పెనుగొండ డాక్టరు Ismail Suhail Penukonda గారికి ధన్యవాదాలు


    బేట్రాయి సామి దేవుడా - నన్నేలినోడ
    బేట్రాయి సామి దేవుడా
    కాటేమి రాయుడా - కదిరినరసిమ్మడా
    మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా

    బేట్రాయి...

    శాప కడుపు సేరి పుట్టగా - రాకాసిగాని
    కోపామునేసి కొట్టగా
    ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి
    బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ

    బేట్రాయి...

    తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ
    దేవాసురులెల్లకూడగా
    దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు
    సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ

    బేట్రాయి...

    అందగాడనవుదులేవయా - గోపాల గో
    విందా రచ్చించా బేగరావయా
    పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి
    కిందు మిందు సేసినోడ సందమామ నీవె కాద

    బేట్రాయి...

    నారసిమ్మ నిన్నె నమ్మితి - నానాటికైన
    కోరితి నీ పాదమే గతీ
    ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి
    కోరమీస వైరిగాని గుండె దొర్లసేసినోడ

    బేట్రాయి...

    బుడుత బాపనయ్యవైతివి
    ఆ శక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివీ
    నిడువు కాళ్ళోడివై అడుగు నెత్తిపైన బెట్టి
    తడవు లేక లోకమెల్ల మెడిమతోటి తొక్కినోడ

    బేట్రాయి...

    రెండుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల
    సెండాడినావు పరశుతో
    సెండకోల బట్టి కోదండరామసామికాడ (సెండకోల = గండ్రగొడ్దలి)
    బెండు కోల సేసికొనీ కొండకాడకేగినోడ (బెండు కోల = శక్తి తగ్గించుకుని, సముద్రం దగ్గర

    గొడ్డలి విసిరేసి అంత మేరా సముద్రాన్ని వెనక్కి జరిపినాడు కదా, ఆ ఘట్టం)

    బేట్రాయి...
    రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి
    శ్యామసుందర నిన్ను మెచ్చగా
    సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి

    ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ

    బేట్రాయి...

    దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన
    దేవుడై నిలిచినావురా
    ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగూడుకొనీ
    తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ (తక్కిడి బిక్కిడి = మోసం)

    బేట్రాయి...

    ఏదాలూ నమ్మరాదనీ ఆ శాస్త్రాలా
    వాదాలూ బాగ లేవనీ
    బోధనలూ సేసికొనీ బుద్ధూలు సెప్పుకొనీ
    నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద

    బేట్రాయి...

    కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన
    పలికినావు బాలశిశువుడా
    చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర
    పిల్లంగోవి సేతబట్టి పేట పేట తిరిగినోడ..

    బేట్రాయి...

    రిప్లయితొలగించండి
  7. సోమకాసురుడు అనే రాక్షసుడు నాలుగు వేదాలను సముద్రం లొ దాచేస్తే బ్రహ్మ్మ దేవుడు విష్ణువుని ఆశ్రయిస్తాడు. అపుడు విష్ణువు మస్త్స్యావతారం ఎత్తి సముద్రం నుంచి ఆ వేదలను తెచ్చి బ్రహ్మ్మ కి ఇస్తాడు.
    బెపనోల్ల చదువు అంటే నలుగు వేదాలు.

    రిప్లయితొలగించండి
  8. Thanks a lot for the very informative post.
    ఇన్ని వివరాలు అందించినందుకు ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  9. వేటూరి శర్మ గారూ ధన్యవాదాలండీ.. మీ వివరణక విషయానికి బాగా పొసుగుతోంది. దానికి అదనపు చేర్పులో ‘‘వేదాద్రి నరసింహ స్వామి కధ’’లో తెలుస్తోంది. వేదాద్రి కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలానికి చెందిన గ్రామము. ఇది విజయవాడ-హైదరాబాదు జాతీయ రహదారి నెం.9లో చిలకల్లుకు 10 కి.మీ. దూరంలో వుంది

    'సోమకాసురుడు' అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు.నాలుగు తలలతో నాలుగు వేదాలను చదివే బ్రహ్మదేవునికి తిరిగి వాటిని అప్పగిస్తాడట. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో, నరసింహవతారంలో హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్పాడు. తనని అభిషేకించాలని 'కృష్ణవేణి' కూడా ఆరాట పడుతుందనీ, అందువలన తాను వచ్చేంత వరకూ ఆ నదిలో సాలగ్రామ శిలలుగా వుండమంటూ అనుగ్రహించాడు. ఆ తరువాత హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.

    'జ్వాలా నరసింహ స్వామి' ... 'సాలగ్రామ నరసింహ స్వామి' ... 'వీర నరసింహ స్వామి' ... ' యోగానంద నరసింహ స్వామి' ... లక్ష్మీ నరసింహ స్వామి' అనే అయిదు అంశలట. కదిరి నరసింహుడిని స్తుతించే సందర్భంలో వేదాల ప్రస్తావన సమంజసమేనేమో నండీ ఇలాచూస్తే.


    రిప్లయితొలగించండి
  10. బాగుంది పాట.. నాకు పాట సినిమా నచ్చింది. ఇలంటే ట్యూన్ మా గురువు గారు కొన్ని పద్యాలూ రాసారు .

    రిప్లయితొలగించండి
  11. can we get the classical version of this song somewhere to download ....heard all 2 songs from movies but the classical one is outstanding

    రిప్లయితొలగించండి
  12. చాలా బాగుంది పోస్టు శ్రీనివాస్ గారు!

    రిప్లయితొలగించండి
  13. బాలమురళికృష్ణ గారు ఈ పాట పాడారు...

    రిప్లయితొలగించండి
  14. బాలమురళికృష్ణ గారు ఈ పాట పాడారు...

    రిప్లయితొలగించండి
  15. బాలూ గారూ బాల మురళీ కృష్ణ గారు పాడిన పాట మీ దగ్గర వుంటే పోస్టు చెయ్యండి

    రిప్లయితొలగించండి
  16. పామర జన రంజకముగా దశావతారములు వర్ణించిన ఆ కవికి జోహార్లు. "బాపనోల్ల సదువు లెల్ల బెమ్మ దేవర కిచ్సినోడ" అనేది మత్స్యావతార వర్ణన. సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మ కు అందించిన ఘట్టము. "మ్రుచ్చు సోమకుని మునుజంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షమే వుండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు" అని రామదాసు పాడినా "నీట గలసినట్టి నిండిన చదువులు తేట పరచినట్టి దేవుడు" అని అన్నమయ్య పాడినా మనకు తెలిపేది ఒక్కటే "కలౌ కీర్తయ కేశవం" కలియుగంలో కేశవుని భజించమని (పాడమని).

    రిప్లయితొలగించండి
  17. Thanks for posting this! I was searching for the meaning and lyrics of this song.

    రిప్లయితొలగించండి
  18. తొలిసారిగ తెలుగు బ్లగు చూసను మంచి విషాలు తెలుసుకున్నను చారిత్మక వివరణ చల బాగుంది

    రిప్లయితొలగించండి
  19. తొలిసారిగ తెలుగు బ్లగు చూసను మంచి విషాలు తెలుసుకున్నను చారిత్మక వివరణ చల బాగుంది

    రిప్లయితొలగించండి
  20. Would like to know who composed the tune for this song/ bhajan Betrayi sami devuda sung by the children at Perla? Very nice tune.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి