తెలంగాణా యాది మరవని రోజు

నీ బాంచన్ కాల్మొక్త అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణం. భూస్వాముల అరాచకత్వం... నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ తెలంగాణా జనం ఏకమై కదం తొక్కారు. నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయినా మడమ తిప్పకుండా తెగువ చూపారు. రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ప్రజల ఆకాంక్షకు ఆయుధాలుగా నిలిచాయి.

నిజామనగ ఎంతరా ... వాడి తహతెంతరా...
అంతగలసి తంతె మల్ల వాడి అంతులేదురా.......

నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......
హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు. (కాళోజి)



రజాకారుల దుశ్చర్యలకు ఎదురొడ్డి సాగించిన ఆనాటి సాయుధ పోరాటానికి నిజాం నవాబు తలవంచక తప్పలేదు. హైదరాబాదు రాజ్యము యొక్క పాలకుల పట్టము నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశము వారు1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు. నైజాం ప్రాంతం అనటం ఇప్పటికీ పరిపాటే.

వందల ఎకరాలను తన ఆధీనంలో ఉంచుకుని జనాన్ని నరకయాతన పెడుతున్న భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన నాటి ఉద్యమం... చివరికి సాయుధ పోరాటంగా మారింది. ఇత్తెహాదుల్‌ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి ద్వారా దీన్ని అణగదొక్కాలని నిజాము ప్రయత్నించాడు.. దీంతో సాయుద పోరాటం చిలికిచిలికి గాలివానగా మారింది. 1946లో రజాకార్లకు వ్యతిరేకంగా ఆరంభమైన నాటి ఉద్యమం... హైదరాబాద్ విమోచనమే లక్ష్యంతో ముందుకు సాగింది.రెండేళ్ల పాటు సాగిన ఈ ఉద్యమంలో రజాకార్ల చేతిలో నాలుగున్నర వేల మంది పోరాట యోధులు నేలకొరిగారు. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలూ కీలక పాత్ర పోషించారు. 1947 సెప్టెంబర్ 11 న ఈ ఉద్యమం సాయుద పోరాటంగా మారింది. భారత ప్రభుత్వానికి, నిజాముకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాము అంగీకరించలేదు. 1948 సెప్టెంబర్ 13 న భారత సైన్యం రంగంలోకి దిగింది. ఓ వైపు సాయుధ పోరాటం... మరో వైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో (ఆపరేషన్ పోలో) చేసేదేమీ లేక అప్పటి నిజాం ప్రభువు చేతులెత్తేశాడు. అప్పటివరకు నిజాం పాలనలో ఉన్న తెలంగాణా ప్రాంతం... నాలుగంటే నాలుగు రోజుల్లోనే భారతదేశంలో విలీనం అయిపోయింది.

ఇలా హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి.


►1930: మెదక్ జిల్లా జోగిపేటలో మొదటి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ జరిగింది.
►1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావం. (జూలై)
►1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం (సెప్టెంబర్).
►1938: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం గీతాలాపన.
►1944: దొడ్డి కొమరయ్య హత్యతో సాయుధ పోరాటం ప్రారంభం.
►1946: నల్గొండ జిల్లాలో నిజాం మిలటరీ దాడి ప్రారంభం.
►1947, డిసెంబరు 4: నిజాంపై నారాయణరావు పవార్ బాంబుదాడి.
►1946 ఆగష్టు 11: వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో బత్తిని మొగులయ్య గౌడ్ హత్య.
►1948 ఆగష్టు 21: పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు దారుణంగా కాల్చిచంపారు.
►1948 సెప్టెంబర్ 13 భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది.
►1948 సెప్టెంబర్ 17: నిజాం లొంగుబాటు.
....................................................................................................
►1948 సెప్టెంబర్ 18: నిజాం సంస్థానం అధికారికంగా భారత యూనియన్‌లో విలీనం.
....................................................................................................

కామెంట్‌లు