కవి సంగమం..కవితోత్సవం..




ప్రపంచం ఒక పద్మవ్యూహం కవిత్వం తీరని దాహం అని అన్నారు మహాకవి శ్రీశ్రీ.. ఇవాళ కవిత్వాన్ని తీరని దాహంగా భావించి సీనియర్ కవులతో పాటు కొత్తగా కలం పట్టి యువకవులు కూడా కవిత్యం రాయడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. అలాంటి వారికి చేయూతనిస్తూ కవిత్వాన్ని ఒక ఉద్యమంగా కవి సంగమం ముందుకు తీసుకెళుతోంది. కవిత్వం కావాలి కవిత్వం అన్న నినాదంతో రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ లో ప్రారంభమైన కవి సంగమం ఎంతోమంది యువ కవులను, కవయిత్రులను వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్ లోని గోల్డెన్ త్రిశూల్ లో కవి సంగమం కవితోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన ఈ సభకు ప్రముఖ కవి కె.శివారెడ్డి అధ్యక్షతన వహించారు. ప్రసిద్ధ గుజరాత్ కవి ప్రొ.శీతయశ్చంద్ర ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఆంధ్ర భూమి సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి, 10టివి సి.ఇ.ఓ, ప్రముఖ కవి అరుణ్ సాగర్, యాకూబ్, రాజేశ్వర్ రెడ్డి, కట్టా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి సంగమం కవులు, రచయిత్రులు రాసిన కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ కవి కె.శివారెడ్డి మాట్లాడుతూ కొత్తగా కవిత్వం రాస్తున్న కవులను వారి కవిత్వాన్ని మనం తక్కువ ఏమన్నా చూస్తున్నామా ? బహుశ వారు సాధించిన ఎక్స్ టెన్షన్ పాతకవులు అందుకోలేకపోతున్నారా ? ఆత్మ విమర్శ చేసుకోవాల్సినవసరం ఉందన్నారు.

స్థాయి పెరిగిన కవులు ఫేస్ బుక్ లో చొరబడి నాయకత్వం వహించే ప్రయత్నం చేయరాదని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు.
నేటి కవిత్వంలో లోపం కనిపిస్తోందని, వస్తువు, శిల్పం, అభివ్యక్తి భాగానే ఉన్నా డ్రైవింగ్ ఫోర్స్ గా కవిత్వంలో ఒక ఫైర్ కనిపించడం లేదని ఆంధ్రబూమి ఎడిటర్ ఎం.ఆర్.శాస్త్రి ఆధునిక కవిత్వ స్వరూప భావాలను విశ్లేషించారు.
గత 30-40 ఏళ్లుగా పొయెట్రి ఒకే తరహాలో వస్తోందని, ఒక కొత్త ఎడిషన్ ను కొత్త పదజాలాన్ని ఎన్ వి రాన్ మెంట్ నుండి స్వీకరించి పోయెట్రీలను పెట్టడమనే విషయంలో కొంత మిస్సవతున్నామేమో అంటూ ప్రముఖ కవి 10టివి సిఇఓ అరుణ్ సాగర్ అభిప్రాయపడ్డారు.
ఉద్యమాల సాహిత్యం కన్నా సినీ సాహిత్యం ఎక్కువగా వస్తోందని విద్యావేత్త రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న గుజరాత్ కవి ప్రొ.శీతాంశు యశస్ శ్చంద్ర మాట్లాడుతూ పాత రోజుల్లో కవులు గుర్తింపులేని శాసనకర్తలనే వారని..అయితే ఇవాళ ఎలా ఉన్నా పొయెట్స్ ప్రజల రీప్రెస్ మెంట్ అన్నారు. కవి సంగమంలోని కవులను అందరూ ప్రోత్సాహించాలని రాబోయే తరాల ప్రతినిధులైన కవులకు చేయూతనివ్వాలని కవి సంగమం క్రియేటర్, ప్రముఖ కవి యాకూబ్ సూచించారు. ఇంకా ఈ సమావేశంలో నగ్నముని తదితరులు ప్రసంగించారు..
కవిత్వపఠనం...
అక్షరం లక్ష మెదళ్ల కదలిక అన్నారు ప్రజా కవి కాళోజి. కవిసంగమం ఆధ్వర్యంలో పాతకొత్త కవుల మేలు కలయికతో కవి సమ్మేళనం జరిగింది. మధ్యాహ్నాం 2గంటలకు ప్రారంభమైన ఈ కవి సమ్మేళనంలో ఫేస్ బుక్ లోని కవులతో పాటు ప్రముఖ కవులు పాల్గొని తమ కవితలు వినిపించి శ్రోతలను అలరించారు.

తొలుత రాళ్లబండి కవితాప్రసాద్ 'అగ్నిహింస' కవితా సంపుటి నుండి ఒక కవితను వినిపిస్తూ చెట్లన్నీ విరామ చిహ్నంలా మనుషులంతా మాట్లాడుతున్న కవిత్వంలో ఉండేవారని చమత్కరించారు.

మొదటిసారి అన్ని మిగిలాయి. రెండోసారి ప్రాణాలు మిగిలాయి మూడోసారి ఊరుపేరు లేకుండా చెరిపివేస్తాం అంటూ గుజరాత్ గోడ మీది వ్యాక్యాల కవిత్వాన్ని ప్రముఖ కవి స్కైబాబా వినిపించారు.

నిజం నిపై కాల్చింది..నీరై ముంచింది..కాషాయమై మదింపు గుళ్లు లేకుండా చేసిందంటూ బలమైన అభివ్యక్తితో కవితను వినిపించారు షాజహాన.

అతడొక భక్త..అతడొక కొడుకు..అతడొక మనిషి..నడిరోడ్డు పక్కలో తెగిపడ్డ చెట్టులా కూలిపోయి ఉంటాడు.. అతడు మాత్రం సంసారాలను తెగనరికిన గొడ్డలిలా పడి ఉంటాడు. అంటూ తాగుబోతు గురించి ఓ అద్భుత కవితను వినిపించారు రేణుకా అయోలా.

కవి నిద్ర పోతాడా నిద్రను కలలకు కాపలా పెడుతాడు.. రెప్పల మీది బరువును అక్షరాల్లో దింపి అలసిపోతాడు.. అయినా విశ్రమిస్తాడా అంటూ ప్రముఖ కవి డా.ప్రసాదమూర్తి. కవితో పెట్టుకోకు అన్న కవితను వినిపించారు బి.ప్రసాదమూర్తి.

ఇళ్లను అద్దాలు చేసి తడిచిందే తుడిచి మసిబారిన గిన్నెల్ని మెరిపించేసి మురికి కొడుతున్న దుస్తులను తళతళలాడి చిన్నా చితక పనులెక్కెట్టు కోకుండా చేసిన పనిమనిషి కష్టాల్ని ఆర్ధ్రతతో వర్ణిస్తూ శిలాలోలిత ఓ మంచి కవితను వినిపించారు.

నా జీవన సంద్రంలో అటుపోటుల వలయం..నాలో ఎన్నో సునామీలంటూ కటుకోజ్వల రమేష్ తన స్వీయ కవితను వినిపించారు.

రేకులు విప్పాల్సిన బాల్యం రెక్కలు రాల్చుకుంటున్నది. విశాల విధ్వంస గీతాలు నిర్విఘ్నంగా హోరెత్తిస్తుంటే...అంటూ రఘువీర ప్రతాప్ బాలకార్మికులపై ఓ కవితను వినిపించారు.

ఆమె ప్రతిరోజు ఒంటిరిగా వంటగదిలో దుఖం పొయ్యి మీద ఎసరులా మరుగుతుంటుందని...మౌనశ్రీ మల్లిక్ సింబాలిక్ పొయెట్రీ వినిపించారు.

అడవిలో నిదురించిన వారికి తెలుస్తుంది వృక్షం కూలుతున్న చప్పుడు.. అంటూ విమల అద్భుత భావ చిత్రాలు రమణీయ దృశ్యాలు బొమ్మ కట్టిన పోయేట్రి వినిపించారు.

అక్షరాలను వెలుగుపూలతో అందంగా గుది అపురూపమై కవితా మాలికలల్లే సాదాసీదా కవి మిత్ర గురించి సాహిత్య ప్రకాశ్ పోయెట్రీ వినిపించారు.

నమ్మకం కాదిక్కడ అమ్మకం ప్రధానం అంటూ....జీవన వ్యాపారాన్ని సెటైరికల్ ఎక్స్ ప్రెస్ పైడి తెరేష్ బాబు ఓ కవితని ఆవిష్కరించారు.

బాసింగం గట్టుకున్నంత మాత్రానా మల్లన్నకు బాంబు అని అంటూ జూపాక సుభద్ర తన కవిత వినిపించారు.

అందరి అమ్మల్లాగే మా అమ్మ కూడా నన్ను కన్నది పురిటి నొప్పులు పడుతూ కాకపోతే నా కుడి చేతి మీద ముద్దు పెట్టుకుని లాలనగా నిమిరిందే మో అందుకనే ఈ కవిత్వం... అంటూ ప్రముఖ కవి యాకూబ్ కూడా అద్భుత కవితను వినిపించారు.

 ఇంకా ఈ కవి సమ్మేళనంలో గోరెంటి వెంకన్న కవులను వినిపించారు. ఎందరో కవయిత్రులు, యువకవులు తమ కవితలు వినిపిస్తూ అలరించారు.

కర్టెసీ : 10టివీ

కామెంట్‌లు