గిరిజన కుంభమేళా : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

విషయం ఏమిటి?
తెలంగాణా లో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర, ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి వరంగల్ జిల్లా, తాడ్వాయిమండలానికి చెందిన మేడారం గ్రామంలో జరుగుతుంది. విగ్రహాలు లేని జాతర.సమ్మక-సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర ను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమె జరుపుకునే వారు, కాని 1940 తర్వాత  ప్రజలంతా విస్తృతంగా జరుపుకుంటున్నారు,ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు, అమ్మవార్ల చిహ్నం గా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి, ఈ గద్దేలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుకుమ భారినేలను తీసుకు వస్తారు, పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతర కు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చెత్తిస్ ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. 

ఎప్పుడు జరుగుతుంది?


రెండు సంవత్సరాలకొకసారి మాఘమాసంలో శుద్ద పౌర్ణమి

రెండు సంవత్సరాలకొకసారి మాఘమాసంలో శుద్ద పౌర్ణమి నాటినుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది.

ఎక్కడ ?
వరంగల్లు జిల్లా కేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములో తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ జాతర వేదిక వుంటుంది.. పేరుకి అతిపెద్ద గిరిజన జాతరే కానీ గిరిజనేతరులూ, రాష్ట్రేతరులతో ఉత్సవం పొంగి పొర్లుతుంది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్,ఒరిస్సా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాస్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1996 లో ఈ జాతరను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది .

చారిత్రక నేపధ్యం ఏమిటి?



జాతరకు సంభందించి అనేక చారిత్రక కథనాలు వాడుకలో వున్నాయి ప్రధానంగా వీటిలో సాధారణంగా కనిపించేది కాకతీయరాజులకీ, గిరిజనులకూ మధ్యజరిగిన యుద్దం. అందులో సారలమ్మ, జంపన్న, నాగులమ్మ గోవిందరాజు తదితరులు మరణించటం ప్రధానంగా కనిపిస్తుంది. ఇది గ్రంధాలద్వారాలో, శిలాశాసనాల ద్వారా లభించిందో కాక తరాల వారీగా చెప్పుకునే కథలలాగా, పాటలలాగానే నిలచింది.


ఇంతకీ ఈ సమ్మక్క-సారక్కలు ఎవరనే కథ విన్నారా?





12వ శతాబ్ధములో 

నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతములోని 'పొలవాస' ను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజు కిచ్చి వివాహము చేసారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసము గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణముగా కప్పము కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణముతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ద పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.

సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటము చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది.

ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అద్రుశ్యమవుతుంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించినది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

మరో కథనం




చంద్ర వంశానికి చెందిన శిలాధరాజుకు ఇద్ధరు భార్యలు పెద్ద భార్య చంద్రవదన, రెండవ భార్య కనకమహాలక్ష్మీ. వీరికి సంతానం కలగకపోవడంతో పెద్ద భార్య ఆది పరాశక్తిని నమ్ముకుని ఆమెను పూజిస్తుంది. ఆఫలితంగా ఒకనాడు అడవికి వెళ్ళి సన్నేరు గడ్డ కుదుళ్ళు తవ్వుతుంటే ఒక పెట్టె కనపడుతుంది. ( ఊరు కథల్లో పాయస పాత్రలూ, మామిడి పండ్లూ వున్నట్లు గిరిజన సంప్రదాయంలో రాణీ కూడా అడవి గడ్డలు తవ్వుతుంటే బిడ్డ దొరకటం నేటివిటీ) పెట్టెలో పసిపాప వుంటుంది ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకుంటారు. కొంతకాలానికి చిన్న భార్య కనకమహాలక్ష్మికి నాగులమ్మ పుడుతుంది.

సమ్మక్కకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత సబ్బిసాయ మండల సామంతుడు మేరాజు మేనల్లుడు పగిడిద్దరాజు సరైన వరుడని భావించి సంప్రదింపులు జరుపుతారు. నాగులమ్మ వచ్చి పగిడిద్దరాజును చూసి మోహిస్తుంది. అందుకే అక్కకి కాకుండా వరుడిని తనకి దక్కేలా చేసుకోవాలని అతడు వీరుడూ పరాక్రమవంతుడే కానీ అందగాడు కాదని చెపుతుంది. పగిడిద్దరాజును వివాహం చేసుకోనని నాగులమ్మకు ఇచ్చి వివాహం చేయమని సమ్మక్క చెప్తుంది. చివరకు పగిడిద్ద రాజు సమ్మక్క, నాగులమ్మ ఇద్దరినీ వివాహం చేసుకుంటాడు. నాగులమ్మకు, జంపన్న మాయన్నలు జన్మిస్తారు. సమ్మక్కకు సారలమ్మ జన్మిస్తుంది.


లేకలేక పుట్టిన బిడ్డ సమ్మక్కపై చిన్న నాటి నుండే గొప్పదానిగా భావిస్తుంటారు ప్రజలు. ఆమె గొప్పతనం తెలిసి వింధ్య అడవి ప్రాంతాల నుండి గిరిజనులు వచ్చి మేడారంలో నివాసం ఏర్పరచుకుని అడవిని నరకడం వలన వర్షాలు తగ్గి కరువు వచ్చి పగిడిద్దరాజు కప్పం కట్టలేకపోతాడు. పన్ను కట్టలేకపోతున్నామని కరువు ఏర్పడిందనీ వివరిస్తూ జంపన్న ద్వారా మంత్రి యుగంధరునికి లేఖలు పంపుతాడు. అధికారులు ఆ లేఖలు మంత్రికి చేరకుండా మధ్యలోనే దీపంమంటలో కాల్చేస్తారు. మంత్రి యుగంధరుని నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో పగిడిద్ద రాజు ప్రజల బాధలు అర్ధంచేసుకోలేని, తీర్చలేని రాజుతో ఏం పని మనకు అనుకుని స్వతంత్రం ప్రకటించుకుంటాడు. దీనిని సహించలేని ప్రతాపరుద్ర మహారాజు మంత్రియుగంధరుని నాయకత్వంలో సైన్యాలను పంపుతాడు. 
యుద్దంలో వీరి వీరమరణాన్ని కూడా ప్రత్యేక కథనాలుగా ఇక్కడి జానపదులు చెప్పుకుంటారు.


మరో కథనం ఇలా వుంది





క్రీ.శ 1115 నుండి క్రీ.శ. 1323 మధ్యకాలంలో ఓరుగల్లు రాజధానిగా చేసుకుని ప్రతాపరుధ్రుడు పాలించే కాలంలో మేడారం రాజ్యాన్ని జంపన్న సామంతరాజుగా పాలిస్తుంటాడు. ఇతని భార్యపేరు సమ్మక్క మేడారంలో కరువు కాటకాలు వచ్చి ప్రతాపరుద్ర మహారాజుకు కప్పం కట్టలేకపోతాడు. ఈ కారణంగా యుద్ధం జరుగుతుంది. ఇంతలో కాకతీయరాయబారి జంపన్న వద్దకు వచ్చి యుద్ధం జరగటినికి మనమే కారణం కాబట్టి మనిద్ధరమే తలపడదాం మని ఒప్పందం చేసుకుంటారు. ఆ సమయంలో సమ్మక్క రాయబారి దగ్గరకు వెళ్ళిజయాపజయాలు దైవాధీనాలు కనుక తన పసుపు కుంకుమలు నిలుపు భారము నీదే అని వేడుకొనగా రాయబారి సరేనంటాడు. రాయబారి తానే సైన్యాధిపతియైన మంత్రి యుగంధరుడినని కూడా చెప్తాడు. కానీ యుద్దం చాలా భయంకరంగా జరుగుతుంది. గెలిచేందుకు తప్పనిసరిపరిస్థితిలో జంపన్న తలను తెగనరకాల్సివస్తుంది యుగందరునికి.
యుద్దం పూర్తవుతుంది. అప్పుడు సమ్మక్కతో తల్లీ సందేహించకు నిన్ను దేవతగా నిలుపడానికి ఈ స్థలంలో గద్దెను ఏర్పాటు చేసి నీకు జాతరచేసి పసుపు కుంకుమలతో పూజించే ఏర్పాటు చేస్తాను. అని చెప్తాడు. నీ భర్త జంపన్న పేరుతో ఈ వాగును జంపన్న వాగుగా మారుస్తున్నాను. ఈ జాతర ఏడు దప్పి ఏడు జరుగుతుంది. అని మాటిస్తాడు. సమ్మక్క సహగమనం చేయడానికి మంచిగంధం చెక్కలు తెప్పించి చితి ఏర్పాటు చేస్తారు. చితిలో సమ్మక్క సహగమనం చేస్తూ ఓ యుగంధర మహాశయా నీ మరణానంతరం కాకతీయుల పాలన పతనమవుతుంది అని శపిస్తుంది. తల్లిదండ్రులు సమ్మక్క,జంపన్నల మరణవార్త తెలిసి విలపించిన సారలమ్మ వారి చితివద్దనే ప్రాణాలు కోల్పోతుంది.
మాఘ శుధ్ద పౌర్ణమి రోజు సాయంత్రం సారక్కను అడవినుంచి కన్నె బోయిన పల్లెకు చేర్చి చెట్టుక్రింది గద్దెపై చేర్చటంతో ప్రారంభం అవుతుంది. తరువాతి సూర్యాస్తమయాన సమ్మక్కను చిలుకల గట్టు నుంచి తీసుకువచ్చి సారక్క గద్దె పక్కనే మరో ప్రత్యేకమైన గద్దెపై చేర్చుతారు. వెదురు గడలకు పసుపు, కుంకుమలతో అలంకరించి గద్దెపక్కనున్న పెద్ద వృక్షంతో కలిపి కట్టి వారి ప్రతిరూపాలుగా భక్తులు భావిస్తారు. గద్దె చుట్టూ మేళ తాళాలతో కోలాహలంగా చేస్తారు. కొబ్బరికాయలూ, బెల్లం, పసుపు కుంకుమలను అమ్మవార్లకు సమర్పిస్తారు.


గట్టమ్మ తల్లి


 మేడారం సమ్మక్క- సారలమ్మల జాతరకు తరలివచ్చే భక్తులు ముందుగా వరంగల్-ములుగు ప్రధాన రహదారిపై ములుగుకు రెండు కిలోమీటర్ల దూరంలో గట్టమ్మ ను దర్శించుకుంటారు.  గట్టమ్మ చాలా సంవత్సరాల క్రితం గట్టంపల్లె గ్రామంలో వెలిసింది నేడు ఆ ప్రాంతాన్ని ‘ప్రేమనగర్’ గా పిలుస్తున్నారు.







మేడారం జాతరకు సుమారు ప ది రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమా లు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతపూ జారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువస్తారు. ఈ సం దర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకు వస్తా రు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు.

పూజలూ మొక్కుబడులూ

వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు. మొక్కుబడులలో బంగారము(బెల్లం) తో పాటు వడిబాలు, బియ్యం, తొట్లెలు, కొబ్బరికాయలు, పసుపుకుంకుమలుచ చర, బట్టలు, పట్నాలు, చిలుకలు, బోనాలు మొదలైన వాటిని కూడా సమర్పించుకుంటారు.  భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు.


మధ్యం వినియోగం
ఈ పండుగను సూలాల పండుగ, కోలు కడిగే పండుగ అని అంటారు. గిరిజనులు వర్షాధారిత పంటలు పండిస్తారు కాబట్టి వర్షాలు పడుతాయా లేదా అని చాలా ఆసక్తిగా గమనిస్తారు. ఇందుకోసం చేసే పండుగను సుంకు పండుగ అంటారు. ఉగాది పండుగరోజు జరిగే సామూహిక పంచాంగ్ర శ్రవణాన్ని పోలిన విధానం దీనిలో కనిపిస్తుంది. ఈ పండుగకు కొద్దిరోజుల ముందునుంచి ఇప్పపువ్వులు రాలడం మొదలవుతుంది. ఈ ఇప్పపువ్వులను కిందపడకుండా  రెండు కొమ్మలకు మధ్య ఒక కొత్త గుడ్డను కడతారు. ఈ రకంగా కట్టడాన్ని కోలు కట్టడం అంటారు. ఈ గుడ్డలో పడిన ఇప్పపువ్వులను సేకరించి కొన్ని పువ్వులను దాచి, మిగిలిన పువ్వులను పులియబెట్టి ఇప్పసారా చేస్తారు. ఈ పండుగరోజున అందరు తమ వేల్పులను ఉండే చోటుకు వస్తారు. ఒక చెంబులో కొత్తగా కాచిన ఇప్పసారాని తీసుకుని గ్రామపెద్ద లేదా వడ్డె కూర్చుంటారు. అతడు మిగిలిన సభ్యులకు ఈ సారాయిని పంచమని ఆదేశిస్తాడు. మద్య, మాంసాలను ఉల్లాసంకోసమే కాకుండా సంప్రదాయంలో నైవేద్యంలా భావిస్తారు కాబట్టే కావచ్చు ఈ ఉత్సవంలో ఎక్కువగా వీటి వినియోగం కూడా వుంటుంది.

భక్తుల నమ్మకాలూ, విశ్వాసాలూ

సమ్మక్క గద్దెపైన లభించే కుంకుమ పొందితే మోక్షం వస్తుందని, ఇక్కడ గద్దెమీద బెల్లం స్వీకరిస్తే చాలాకాలంగా వున్న వ్యాధులు కూడా తగ్గుతాయనీ నమ్ముతారు. పూజతర్వాత పసుపు కుంకుమలు ప్రసాదంలాగా తీసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని విశ్వసిస్తారు. సమ్మక్క చిలుకలగట్టునుండి బయలుదేరి గద్దెలమీదకు వస్తున్నపుడు ఎదురుగా వెళ్ళి మొక్కితే సంతానం కలుగుతుందని భావిస్తారు. మరికొందరు సమ్మక్కను తీసుకుని వడ్డెలు వస్తున్న దారికి అడ్డంగా పడుకుంటారు. వారిపైనుండి పూజారులు నడుచుకుంటూ వెళితే జన్మసార్ధకమయినట్లుగా భక్తులు భావిస్తారు. 







మహా భారతాన్ని మరిపించే మహా సంగ్రామం.. పగిడిదరాజు యుద్ధం.. గిరిజనుల పై ప్రతాపం చూపిని ప్రతాపరుద్రుడి చరిత్రకు మరక. తెలంగాణలో తిరుగుబాటుకు పునాడులు పడ్డ కరువు కాలం (ఐతగాని జనార్థన్ గారి యూట్యూబ్ విడియో)

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి