అల్లూరి సీతారామరాజు చనిపోతాడా ?


రామరాజు జీవితంలో ముఖ్య ఘట్టాలు

మనకి సీతారామరాజంటే ఒక మన్యం ఉద్యమం, ఉవ్వెత్తున ఎగిసిపడే దేశభక్తి జ్వాల. నిజానికి అది మన జ్ఞాపకాలలో ఈ రూపం పదిలంగా వున్నంత కాలం నిలచే వుంటుంది. అతని అలవాటు ఎప్పుడూ కాషాయం కట్టడం కాకపోవచ్చు. బహుశా నిజానికి నిరంతరం గడ్డంపెంచుకునే వుండక పోవచ్చు. ఆ పేరు స్పురించగానే మన మనసులో కట్టే శిల్పరూపమైన సుధృఢ మూర్తే నిజానికి ఇప్పుడు బతికున్న సీతారామరాజు. అవును వీరులు చనిపోతారా? అభిమానుల మనసుల్లోని భావనా రూపాలతోనే కాదు. తమంతట తామే కాపాడుకున్న రెండో జీవితాల లోపటా పునరుధ్ధానం చెందే అవకాశంవుంది. అల్లూరి జీవితంలో అట్లాంటి ఘట్టాలేమైనా వున్నాయా అనే విషయాన్ని తన సంక్షిప్త కాలరేఖ వెంబడే ప్రయాణిస్తూ చివర్లో పరిశీలిద్దాం..


ప్రారంభం
పాండ్రంగిలో సీతారామరాజు జన్మించిన ఇల్లు
(వాళ్ళ అమ్మమ్మ గారిది)
జులై నాలుగు 1897 విశాఖ జిల్లా పాండ్రంగిలో వెంకటరాజు, సూర్యనారాయణమ్మల తొలిసంతానంగా వాళ్ళ అమ్మమ్మ గారింట పుట్టాడు. మనం సీతారామరాజుగా పిలుచుకునే  శ్రీరామరాజు’. నిజానికి గారాల పట్టిగా పుట్టిన తొలిసంతానం కాబట్టి ఇంట్లో అందరూ చిట్టిబాబుఅని పిలిచే వారు.

శ్రీరామరాజు జన్మస్థలంపై కూడా వివాదం చెలరేగింది. ఆయన జన్మించింది విశాఖజిల్లా పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామమైతే పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు గ్రామమని క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి ప్రభుత్వం కూడా తలొగ్గి పాఠ్యపుస్తకాల్లో శ్రీరామరాజు మోగల్లు గ్రామంలో జన్మించినట్లు ముద్రించేశారు. మోగల్లు పూర్వీకుల స్వస్థలం మాత్రమే. దీనిపై శాసనసభలో వివాదం చెలరేగింది. చివరకు శాసనసభా కమిటీ వేసి శ్రీరామరాజు పాండ్రంగి గ్రామంలోనే జన్మించినట్లు నిగ్గు తేల్చవలసి వచ్చింది.


ఆ తర్వాత అప్పట్లో కృష్ణాజిల్లాలో వుండి ఇప్పుడు పశ్చిమగోదావరిలో భాగమైన మోగల్లుకు వచ్చారు అక్కడినుంచి అదే జిల్లాలోని తణుకుఆ తర్వాత రాజమహేంద్రవరం తరలిపోయారు.  రామరాజు తండ్రి ఫోటో గ్రాఫర్ కాబట్టి వారు భృతిని వెతుక్కుంటూ వెళ్ళటమే కాకుండా ఉద్యమ చిత్రాలను తీయటంలో తన భాద్యతను తెలుసుకుని మరీ వెంకట రామరాజు గారు ఇలా ప్రయాణాలు చేస్తుండే వారు. భారతీయులలో తొలిసారి సమష్టి రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చిన ఘనత కూడా వందేమాతరం ఉద్యమానిది. ఈ చారిత్రక దృశ్య మాలికను కొడుకు కళ్లకు కట్టినట్లు తన చిత్రాలలో చూపించారు ఆ ఫోటోగ్రాఫర్ తండ్రి. కానీ కాలం 1908లో హఠాత్తుగా ఆయనను తనతో తీసుకుపోయింది. అటు తర్వాత  శ్రీరామరాజుకు జీవితం బరువయ్యింది.. రామచంద్రపురం, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం టైలర్ హైస్కూలు, విశాఖపట్నం వంటి చోట ఆయన  చదువు కొనసాగించారు.  సీతారామరాజుకు చదువుపై అంత ఇష్టం లేకపోవడంతో చదువును మధ్యలోనే స్వస్తి పలికాడు. ఆ తర్వాత వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. కొద్ది రోజులు తునిలో కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ నిత్యం దైవ పూజ చేస్తూ గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తర్వాత ఈ చదువులూ, ఉద్యోగాల వ్యాపకం అస్సలు నచ్చలేదు ప్రపంచాన్ని పర్యటలతో తెలుసుకోవాలనుకున్నాడు. ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరి బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. ఆధ్యాత్మిక వేత్తలను కలిసాడు. శరీరధర్మ రహస్యాలనూ మూలికా వైధ్యాన్నీ, ప్రాణాయామం, యోగ లాంటి విద్యలను సాధన చేసారు.  బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. ఆ తర్వాత రెందవ యాత్ర బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు మొదలగు ప్రాంతాలలో సంచరించాడు.
    అక్కడ నుంచి నేరుగా విశాఖ మన్యంలో ఉన్న కృష్ణదేవిపేటకు వచ్చాడు. ఆ యాత్రలో ఆయన భారతదేశంలో చూసిన వాతావరణం, వందేమాతరం ఉద్యమం అతని మనసు పై చెరగని ముద్ర వేసాయి. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు పట్టణాలలోనే కాకుండా ఏజన్సీ ప్రాంతాలలో వారి దురాగాతలకు అంతు అడ్డు ఉండేది కాదు. వారి చేతిలో అమాయకమైన గిరిజనులు దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణంగా గురి అయ్యేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటినే “పితూరీ” అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరీ. దీనికి నాయకుడైన వీరయ్యదొరను, ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీసు స్టేషనులో బంధించింది.ఇదంత చూసిన రాజు మాన్యం ప్రజలో తిరుగుబాటు తీసుకురావాలని గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

హైదరాబాదు ట్యాంకుబండుపై అల్లూరి విగ్రహం
స్వాతంత్రోద్యమంవైపు తొలి అడుగులు

మన్యంలో భిటీష్ వారి పాలన పుణ్యమా అని అరాచకం కొనసాగుతున్న రోజులవి. ఆకలి చావుల నుంచి జనాన్ని తప్పించడానికి అన్నిచోట్ల పనికి ఆహారం పథకం రీతిలో పనులు చేపట్టారు. విశాఖ మన్యానికి సింహద్వారం లాంటి నర్సీపట్నం నుంచి లంబసింగి (చింతపల్లి కొండ మార్గంలో) వరకు ఒక రోడ్డు నిర్మాణాన్ని అదే ఉద్దేశంతో ప్రారంభించారు.


 కానీ ఈ పనినే గూడెం డిప్యూటీ తహశీల్దార్ బాస్టియన్ బినామీ పేరుతో తీసుకుని, నామమాత్రపు కూలితో మన్యవాసులతో పనిచేయిస్తూ, వేధించడం మొదలుపెట్టాడు. అటవీ చట్టాలను అడ్డం పెట్టుకుని కొన్ని దశాబ్దాలుగా నిత్యం సాగుతున్న హింసకు ఇది అదనం. తగులబడిపోతున్న అడవులను ప్రాణాలకు తెగించి, ఎలాంటి ప్రతిఫలం లేకుండా చల్లార్చడం, పోలీసులు, అటవీ సిబ్బంది దోపిడీని మౌనంగా చూడడం గిరిజనుడికి అలవాటైపోయిన హింస. చట్టాల పేర అడవుల నుంచి దూరంగా ఉంచడం వల్ల ఆకలి బాధ మరొకటి. ఈ బాధల నుంచి విముక్తం కావాలని మన్యవాసులు కోరుకుంటున్నకాలమది. పైగా కొద్దినెలల క్రితమే ఒక తాటాకు మంటలా భగ్గుమని చల్లారిపోయిన గరిమల్ల మంగడి తిరుగుబాటు రేపిన కల్లోలం ఇంకా చల్లారలేదు.
1.    కృష్ణదేవిపేటలో తాండవ నది ఒడ్డున అల్లూరి అర్చించిన నీలకంఠేశ్వరుడు.
 2.    కృష్ణదేవిపేటలో అల్లూరిని దహనం చేసిన చోట నిర్మించిన స్మారక మందిరం.
 3.    అల్లూరి పట్టుపడిన మంపలో నిర్మించిన స్మారక స్థూపం.

 నిజానికి మన్యానికి తిరుగుబాట్లు కొత్తకాదు. 1879-80లో జరిగిన తిరుగుబాటు మొదటి రంప తిరుగుబాటుగా ప్రసిద్ధి గాంచింది. తరువాత పది వరకు అలాంటి తిరుగుబాట్లు జరిగాయని చెబుతారు. చివరిది, రెండవ రంప ఉద్యమంగా పేరు పొందినది రామరాజు నాయకత్వంలో నడిచినదే. అంటే మన్యవాసులకు పోరాటమంటే ఏమిటో బోధించనక్కరలేదు. వ్యూహాల గురించి పాఠాలు అవసరం లేదు. కావలసినది నాయకత్వం. ఉత్తర భారత యాత్రను ముగించుకుని జూలై 24, 1917 న మన్యానికి వచ్చిన సీతారామరాజు ఈ ప్రాంతానికి తనవంతు సాయం చేయాలనుకున్నాడు.
ఒక్కసారిగా ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకోవడం కాకుండా ప్రజలలో తనపై నమ్మకం పెంచుకోవడంతో పాటు, అక్కడి స్థితిగతులపై ఒక అవగాహనను పెంచుకోవాలనుకున్నాడు. తనకు తెలిసిన మూలిగా వైద్యంతో ప్రజలకు వున్న ఆరోగ్య సంభంధమైన బాధలను తగ్గించడంతోపాటు, వారి కుటుంబ వ్యవహారాలూ, ఊరిలోని తగాదాలు మొదలైన వాటికి కోర్టు వరకూ వెళ్ళకుండా వాళ్ళలో వాళ్ళే పరిష్కరించుకునే పద్దతులను నేర్పించాడు. ఇకదానితో పంచాయితీలతో వారికి అవసరం పడలేదు. అలాగే వివిధ వ్యసనాలకు బానిసలై, పగలూ రాత్రీ తేడా లేకుండా  జీలుగు కల్లు తాగుతూ వృధాగా తిరిగే వారిని సంస్కరించాడు. ప్రజల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఇదంతా ప్రభుత్వానికి నచ్చలేదు. తమ వ్యవస్థకు సహాయనిరాకరణ చేసేలా ప్రజలను ప్రొత్సహిస్తున్నాడన్న నెపంతో ‘‘ నాన్ కో ఆపరేటర్’’ ముద్ర వేసి, నర్సీపట్నం జైలులో రెండో నెంబర్ సెల్‌లో నిర్బంధించింది. అడ్డతీగల దగ్గర పైడిపుట్టలోనే ఉండాలని ఆదేశించింది. కానీ వీటన్నింటినీ అధిగమించి తన ప్రత్యక్షఉద్యమ కార్యాచరణలోకి రామరాజు దిగాడు.

తొలిపోరాటం
భారత ప్రభుత్వం నుంచి విడుదలయిన
రామరాజు స్మారక తపాలా బిళ్ళ
ఆగస్టు 22, 1922న శ్రీరామరాజు చింతపల్లి పోలీసు స్టేషన్ మీద దాడి చేసి, ఆయుధాలు తీసుకుని వెళ్లాడు. నిజానికి ఆయన 1917లోనే మన్యానికి వచ్చినా తొందరపడక ఐదేళ్ళ కాలం తనపై గురికుదుర్చుకుని తన సేనావాహిని తయారు చేసుకున్నాడు. అక్కడే ఊరి చివర తాండవ నది ఒడ్డున శ్రీవిజయరామ నగరం అనే చిన్న వాడను స్థాపించారు గ్రామస్థులు. అక్కడే గాం గంటం దొర, మల్లుదొర, ఇతర గిరిజన నేతలు ఆయనను కలిసేవారు. వీరంతా మునసబులు, ముఠాదారులు. అంటే మన్యం గ్రామాల, గ్రామాల సమూహాల అధికారులు. మొత్తంగా అటవీ చట్టాల బాధితులు. చింతపల్లి పోలీసు స్టేషన్ మీద దాడి చేసిన మరునాడే కృష్ణదేవిపేట మీద  శ్రీరామరాజు దళం దాడి చేసింది. ఆ వెంటనే రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ మీద దాడి  చేసింది. 1922 నుంచి 24 వరకు జరిగిన ఈ ఉద్యమం భారతీయ గిరిజనోద్యమాలలో సుదీర్ఘమైనది. కానీ 1923కు ఉద్యమం కొంచెం బలహీనపడి, రకరకాల వదంతులు వ్యాపించాయి. రాజు దళం రంగూన్ పారిపోతోందన్నది అందులో ఒకటి. వెంటనే కొండదళం సభ్యుల తలలకు వెలలు ప్రకటించింది ప్రభుత్వం. అయితే హఠాత్తుగా రామరాజు ఏప్రిల్ 12, 1923న అన్నవరం కొండ మీద కనిపించి పోలీసులను నివ్వెరపరిచాడు.
రామరాజు పేరు ముందున్న సీత ఎవరు?
నిజానికి సీత ఉన్నారా లేరా వుంటే ఎవరన్నదీ నిర్ధారిత అంశం కాదు భద్రాచలంలో వున్న సీతారాముల ఆలయం ప్రాచుర్యం చెందడంతో బ్రిటీషు వారి నాలుకల్లో ఆ పేరే ఎక్కువగా వుండడం వల్ల, ఉచ్ఛరించడం లోపం వల్ల శ్రీరామరాజుకు బదులు సీతారామరాజు అనేవారని ఒక వాదన. శ్రీరామరాజుకి చెల్లెలు సీత అంటే ఎంతో ప్రేమానురాగాలు వుండడం, శ్రీరామరాజు పోరాటంలో వుండగా చిన్న వయస్సులోనే భర్తను కోల్పోవడం ఆయన్ను కలచివేసింది. దానితో 'శ్రీ'కి బదులు చెల్లెలు సీత పేరును శ్రీరామరాజు చేర్చుకొన్నాడని మరో వాదన కూడా వుంది.  కానీ అనేక ప్రచారాలు మాత్రం సీత అతని ప్రియురాలని నిర్ధారించేశాయి. విశాఖపట్నంలో చదువుకొనే రోజుల్లో రామరాజు వయస్సు 16 సంవత్సరాలు. యవ్వనంలో అడుగుపెట్టే దశ అది. ఆ దశలోనే అతని హృదయంలో ఒక యువతి రూపం చోటుచేసికొందని, ఆమె "వెలను" కులమునకు చెందిన శ్రీమంతుని కుమార్తె అని, ఆర్ధికస్థితిగతుల బేధంవల్ల వారి వివాహం జరుగలేదని, ఆమెను మరచిపోలేని రామరాజు ఆ సుందరి పేరు "సీత" ను తన పేరు "రామరాజు" కు ముందుకు చేర్చుకొని " సీతారామరాజు"గా నిలచిపోయాడని అంటారు. ఆమె కోసం రామరాజు భగ్న ప్రేమతో బాధపడ్డాడని అంటారు. తుదిక్షణం వరకూ రామరాజు కఠోర బ్రహ్మచర్యం అవలంబిస్తూ వుండిపోయాడు అని చెప్తుంటారు.

 శ్రీరామరాజు పేరు మీద కూడా ఉమ్మడి రాష్ట్రం వున్న సమయంలో మద్రాసు శాసనసభలో చర్చకు వచ్చింది. దివాన్ బహదూర్ కృష్ణ నాయర్ చర్చలో పాల్గొని కొన్నిసార్లు శ్రీరామరాజు అని, కొన్నిసార్లు సీతారామరాజు అని ప్రస్తావించడం జరుగుతున్నదని అసలు పేరు ఏమిటని ప్రశ్నించారు. దానిపై అసలు పేరు అల్లూరి శ్రీరామరాజుగా ప్రకటించారు. 

కెరటం విరిగిపడింది

గుండెల్లో దిగిన బుల్లెట్లతో మరిణించాడని చూపిన
రామరాజు చివరి ఫోటో
ప్రజలలోని అసంతృప్తిని బాణంలా ఎక్కుపెట్టి తెల్లవాడి అధికార దాష్టికాన్ని గడగడ లాడించాడు. ప్రత్యక్షంగా గెరిల్లా యుద్ధ పద్దతిలో రామరాజు తలపడింది. 1922 నుంచి 1924 వరకూ మూడు సంవత్సరాలు నిజానికి మధ్యలో ఒక సంవత్సరం ఉద్యమం బలహీన పడినా మరోసారి దాన్ని తన ప్రత్యేక వ్యూహాల ద్వారా పోరాట బాటలోకి తీసుకువచ్చాడు రామరాజు. నిజానికి అప్పుడు కూడా 27 సంవత్సరాల యువ వయస్సు. 

దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఆందోళన, పోలీసులూ, సైనికుల కవాతులు మన్యాన్ని అతలాకుతలం చేశాయి. పంటలు లేవు. అంతా నిర్బంధం. ఈ పరిస్థితులలో కొందరు నాయకులను స్థానికులే పట్టి ఇచ్చేశారు. అయినా భారతీయులను ఎవరినీ చంపరాదంటూ ఉద్యమ కారులకు తను విధించిన షరతును సడలించడానికి రామరాజు అంగీకరించలేదు. రామరాజు వెంట నడిచిన వారంతా గిరిజనులే. గాం గంటం దొర(బట్టిపనుకుల), అతడి తమ్ముడు మల్లు, కంకిపాటి ఎండు పడాలు(పదల), గోకిరి ఎర్రేసు(గసర్లపాలెం), బొంకుల మోదిగాడు(చింతలపూడి)మొట్టడం బుడ్డయ్యదొర (కొయ్యూరు), సంకోజు ముక్కడు (సింగన పల్లి) వంటివారు సేనానులుగా వ్యవహరించారు. మొత్తం 276 మందిని విశాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రిబ్యునల్‌లో విచారించారు. ఇందులో ఎర్రేసు గొప్పవిలుకాడు. అగ్గిరాజు అనే పేరిచర్ల సూర్యనారాయణరాజు కూడా రామరాజు వెంట నడిచినా ఆయన గిరిజనుడు కాదు.
మల్లుదొర
శ్రీరామరాజుకు స్వాతంత్య్ర పోరాటంలో తొలుత సంబంధాలు ఏర్పడింది మల్లుదొరతోనే. శ్రీరామరాజు యుద్ధానికి ప్రధాన కేంద్రం మల్లుదొర గ్రామం కొయ్యూరు మండలం నడింపాలెం. మల్లుదొర 1923 సెప్టెంబర్ 17న కీరన్స్ అనే సేనాని, అతని బలగంతో హోరాహోరీ పోరాడి పట్టుబడిపోయాడు. బ్రిటీష్ ప్రభుత్వం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించి అండమాన్ జైలులో బంధించింది. 1923 ఏప్రిల్ 17న శ్రీరామరాజు అన్నవరం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసినప్పుడు మల్లుదొర కీలక పాత్ర వహించాడు.

 1924 మే మాసంలో రేవుల కంఠారం అనేచోట జరిగిన ఉద్యమకారుల సమావేశంలో ఈ విషయమే చర్చనీయాంశమైంది. ఆ షరతును పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఉద్యమకారులు కోరినా రామరాజు అంగీకరించలేదు. ఉద్యమకారులు జరిపిన ఆఖరి సమావేశం అదే. ప్రజలకు మేలు చేద్దామని ప్రారంభించిన ఉద్యమంలో వాళ్లే ఇబ్బందులకు గురికావడం. తను తయారు చేసుకున్న సైన్యంనుంచే తనకు కొన్ని వ్యతిరేఖతలు ఎదురవడం ఖచ్చితంగా సీతారామరాజును ఉద్యమం నడపాల్సిన తీరుతెన్నుల మీద పున: సమీక్ష చేసుకోవలసిన అవసరాన్ని కలిగించే వుంటుంది.


రామరాజు ముగింపు గురించి ఇదొక కథనం

రామరాజు సమాధి
మే6, 1924 రాత్రికి రామరాజు ఒక్కడే కొత్త రేవళ్ల గ్రామం మీదుగా మంప అనే కుగ్రామం చేరుకున్నాడు. అక్కడే జొన్న చేలో మంచె మీద పడుకున్నాడు. వేకువనే స్నానం కోసం అక్కడే ఉన్న చిన్న కుంటలో స్నానం చేస్తుండగా పట్టుబడ్డాడు. ఆ నీటి కుంటకు కొంత దూరంలోనే దట్టమైన చింతలతోపు ఉంది. అక్కడే ఈస్ట్‌ కోస్ట్ దళానికి చెందిన జమేదార్ కంచుమేనన్, ఇంటిలిజెన్స్ పెట్రోలింగ్ సబిన్స్‌ పెక్టర్ ఆళ్వారునాయుడు వచ్చి బంధించారు. ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు.

 రూధర్‌ఫర్డ్ ఆదేశం మేరకు, కృష్ణదేవిపేటకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఒక నులక మంచం తెప్పించి దానికి రామరాజును బంధించి కొయ్యూరు మీదుగా కృష్ణదేవిపేటకు తీసుకుపోతుండగా మధ్యలో అస్సాం రైఫిల్స్ అధిపతి గూడాల్ ఆపి విచారణ పేరుతో తీసుకుపోయి కాల్చి చంపాడు. తరువాత శవాన్ని కృష్ణదేవిపేటకు తీసుకువెళ్లి తాండవ ఒడ్డున దహనం చేశారు. నిజానికి ఈ విషయాన్ని వెంటనే గూడెం ప్రజలకూ ప్రపంచానికీ తెలియనీయ లేదు. రామరాజు అజ్ఞాతంలోనే వున్నాడనో లేక ఉద్యమాన్ని నడిపిస్తూనే వుండివుంటాడనో అనుకునేవారు. ఉద్యమం కూడా అక్కడితో వెంటనే ఆగలేదు. రామరాజు మరణించిన తరువాత కూడా కొద్దికాలం ఉద్యమం సాగింది. ఒక్కొక్కరుగా దొరికిపోయారు. జూన్ 7, 1924న పెద్దవలస సమీపంలో ఎద్దుమామిడి-శింగధారల దగ్గర ఆరేడుగురు సహచరులతో కనిపించిన గాం గంటం దొరను కాల్చి చంపారు. దీనితో ఉద్యమానికి తెర పడినట్టయింది. విప్లవ కారుల్ని చంపేసినా వెంటనే చెప్పక పోవటం అనేది వారి యుద్ధ నీతిలో భాగంగానే చేస్తుండే వారు.  దీనికి మరో ఉదాహరణ పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం సమీపంలోని కుముదవల్లికి చెందిన అగ్గిరాజు పేరుతో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పేరిచర్ల సూర్యనారాయణ రాజు రామరాజు లాగానే  గిరిజనుడు కాడు కానీ తన సర్వస్వాన్నీ ఈ పోరాటంలో దారపోసాడు.  ఆయనను చాలా రోజులు ప్రభుత్వ గూఢచారి కావచ్చు ననుకున్నారు. కానీ ఈయన నిర్భందం ఎక్కువైన సంధర్భంలో మాయమయ్యాడు. తర్వాత ఎటువంటి సమాచారం తెలియలేదు. ఇదేవిషయమై అప్పటి ఉమ్మడి మద్రాసు శాసన సభలో ఆచార్య యన్ జి రంగా గారు ప్రశ్నను లేవనెత్తితే కానీ అతడ్ని పోలీసులు పట్టుకుని అండమాన్ కి తరలించారని అక్కడతను విషజ్వరంతో చనిపోయాడనీ సమాధానంగా చెప్పారు. ( అగ్గిరాజు నూతిలో దూకి ప్రాణం తీసుకున్నట్లు అల్లూరి సీతారామరాజు సినిమాలో చూపించారు. పౌరుష ప్రతాపాలకు ప్రతీకగా నిలిచిన అగ్గిరాజును అలా నూతిలో దూకి చనిపోయినట్లు చూపించడం దారుణం.) ఇంతేనో వాళ్లే చంపేశారో కానీ ఈ విషయం కూడా శాసన సభలో ప్రశ్న అడిగేంత వరకూ నిగూఢంగానే దాచివుంచారు. అట్లాంటిది ఉద్యమాన్ని ముందుండి నడిపించిన రామరాజు మరణం విషయం స్పష్టంగా చెపుతారా?
రామరాజును పట్టి ఇస్తే అప్పట్లోనో పదివేల రూపాయిలు
అంటూ భారీ నజరానా ప్రకటించిన కలెక్టర్ రూధర్ ఫర్డ్

ఇక్కడ మరో చిన్న విశేషముంది. సీతారామరాజు ఉద్యమం నడిపినప్పుడు, తన చేతికి చిక్కిన దొరలనాతడు బ్రతకనీయలేదు. బ్రిటీషు వారి తరపున పోరాడే భారతీయులు  చేజిక్కినప్పుడు కొంత మందలించి విడిచిపెట్టేవాడు. అందువలన తాము అరెస్ట్ చేసిన వ్యక్తి సీతారామరాజు అవునోకాదో ఆ తెల్లదొరలకు తెలియదు. అందుబాటులోని వ్యక్తుల మాటల మీదే ఆధారపడి వ్యవహరించేరు. పట్టుబడిన వ్యక్తిని చూచిన హిందూ ఆఫీసరెవరో ఒకాయన అతడు  సీతారామరాజు కాదు అన్నాడట. వెంటనే ప్రభుత్వంలో కలకలం రేగింది. ఇదివరలో సీతారామరాజు చేత పట్టుబడి వదిలి వేయబడిన ఇద్దరు ఆఫీసర్లను పిలిపించి పరీక్షించమన్నారట. వారు కూడా విషాయాన్ని ఇథిమిద్దంగా తేల్చలేకపోయారట. త్రోవలో ఒక దగ్గర ఆగి, ' ఆనాడు అడవిలో సీతారామరాజు గారిని కాల్చి చంపి , తిరగవేసిన నులక మంచము మీద ఆయన భౌతిక దేహాన్ని తీసుకువచ్చి ఒకచోట దించారట. ఆ సమయములో అక్కడ చేరినవారిని అందరినీ , ఇతనేనా సీతారామరాజు ? అని అడిగారు. చుట్టూ చేరినవారు యెవ్వరూ మాట్లాడకపోవడంతో. విగత జీవుడై మంచము మీద పడివున్న తమ ప్రియతమ నాయకుడిని చూస్తూ ఇది నిజమా కాదా అని నిశ్చేష్టులైన వారేం మాట్లాడలేకపోయారట. యెవరిని అడిగినా మాట్లాడకపోవడముతో ఆయనను తీసుకువచ్చినవాళ్ళు రామరాజుదనుకుంటున్న పార్ధివదేహాన్ని కాళ్ళతో తన్నారు. అది చూసి తట్టుకోలేక చుట్టూ వున్న గొల్లున రోదిస్తూ ఆ పాదాలమీద పడిపోయారు. దీనితో అతనే సీతారామరాజు అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నాట్లు పైవారికి నివేదించారట.



గతంలోనూ ఒకేసారి రెండు స్టేషన్లలో దాడిచేయటం లాంటి పనుల్లో రామరాజ తనకు మారువేషంలో మరో రామరాజును ఉపయోగించి శత్రువులను ఆందోళన పరచే వ్యూహాన్ని అనేక మార్లు అమలు చేసేవాడట. రామరాజు వస్త్రదారణ విషయంలోనూ తను స్టేషన్లపై దాడిచేసినపుడూ, పోరాటాలలోనూ ప్రత్యేకంగా వస్త్రదారణ చేసుకోవడం వుండేది సాధారణ సమయాల్లో ఏనాడూ కాషాయ వస్త్రాలతో కనిపించలేదని. ఖద్దరు ఖాకీ నిక్కరు, తెల్లటి ఖద్దరు చొక్కా ధరించి ఉండేవాడని రామరాజును దగ్గరగా చూసిన వారు చెప్పిన మాటలు. ఆహారంగా కూడా భోజనాన్ని కాక మునిపుంగవుడిలా కేవలం పాలు పళ్ళు మాత్రమే తీసుకునే వారని చెప్తారు.  అసలు రామరాజు మీద ఎన్నిఆశలు ఎన్ని నమ్మకాలు ఎన్ని మహిమలనూ ఆపాదించుకునే వారో, గురిపెట్టిన తుపాకీ ఆయనమీద పేలదనీ, ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతారనీ, చేతితో తాకినంతే స్వస్థతను కలిగిస్తారానీ ఇలా స్వాతంత్ర పోరాటయోధునిపైనా లేనన్ని బరువైన నమ్మకాలు రాజు పై వుండేవి.

అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు మరణించలేదనీ
, మరణించినది ఆయన పోలికలు ఉన్న 'వీర వెంకటాచారి ' అనీ , సీతారామరాజుకు కుడి కణతమీద పుట్టుమచ్చ ఉందనీ , సీతారామరాజు చనిపోయినట్టుగా ప్రభుత్వము ప్రకటించిన శవముపై ఆ పుట్టుమచ్చలేదనీ అన్నారు.

రామరాజు చేతిరాత



తధనంతర కథనాలు

రామబ్రహ్మానంద మహర్షి లేదా చిద్వెంకట మహర్షి లేదా బెండపూడి సాదువు
 1941 లో తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి మధ్య వున్న బెండపూడి గ్రామం ప్రాంతానికి ఒక సాధువు వచ్చి ఆశ్రమాన్ని స్థాపించి సాధుజీవనం గడిపేవారు.  రామబ్రహ్మానంద మహర్షి ఉరఫ్ చిద్వెంకట మహర్షి ఉరఫ్ బెండపూడి సాదువుగా పేరు పొందిన ఒకనొక సాధువు తన శిష్యబృంద బెండపూడి సాధువే రామరాజని ప్రచారం చేసుకున్నారు.  అంతే కాకుండా 8 మంది క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకున్నారని. బెండపూడి సాధువు ' గా పిలువబడుచూ 20 సంవత్సరాలు ఉన్నారని , ఆశ్రమములో నిత్యాన్నదానము జరిగేదనీ చెప్పుకుంటుంటారు.  ఈ బెండపూడి సాధువు గారే అల్లూరి సీతారామ రాజని 1924 నుంచి 1941 మధ్య కాలంలో దేశ విదేశ ఆధ్యాత్మిక ప్రాంతాలలో తన సాదనకు మరింత పదును పెంచుకుని మళ్ళీ జనంలో జీవించేందుకే ఇక్కడికి వచ్చారని  ఆ ప్రాంతం వారు ఇప్పటికీ నమ్ముతారు. దీనికి మరిన్ని ఆధారాలుగా రామరాజు తల్లిగారు, మల్లుదొర బెండపూడిసాధువుని దర్శించుకునేందుకు వచ్చేవారనిచెపుతారు, యన్టీరామారావు గారు అల్లూరి సీతారామరాజు జీవితచరిత్రను సినిమాగా తీద్దామనుకున్నప్పటికీ ఈ మల్లుదొర రామరాజు మరణించలేదని సరికాని విషయాలతో చిత్రం తీయోద్దని సూచిస్తూ ఉత్తరం రాయడం వల్లనే ఆగారనీ  ఈ ప్రాంతంలో చెప్పుకునే విషయాలతో గతంలో ఒక ఛానల్ కథనాన్ని కూడా చేసింది. ఇక మరింత అతిశయోక్తులనిపించే మరికొన్ని విషయాలను కూడా బెండపూడిలో చెప్పుకుంటారు. ఊరిచివరలో  వున్న ఒక శివలింగం దగ్గరకు రామరాజు గారి తల్లిగారు వచ్చేవారని ఆవిడ వచ్చినపుడు రామరాజు పులిపై స్వారీ చేసుకుంటూ వచ్చే వారని ఆ పాలతో శివలింగానికి అర్చనాభిషేకాలు చేసి తల్లి చేతితో తీసుకువచ్చిన పదార్ధాలను ఆహారంగా తీసుకుని అడవుల్లోకి మళ్ళీ వెళ్లిపోయేవారని జానపదకథలాగా వర్ణనలతో చెప్పుకుంటారు.

దీన్ని వ్యతరేఖించే వారు. బెండపూడి సాధువు గారి దేహదారుఢ్యం, ఎత్తు, కవళికలూ, ఆహార్యం అస్సలు రామరాజును పోలి వుండేవి కావని, ప్రధానంగా యోగసాదన లాంటి విద్యలో ప్రవేశంవుండి సీతను తన మనసులో నిలుపుకున్న దేశ భక్తుడైన రామరాజు ఖచ్చితంగా అన్నేసి వివాహాలు చేసుకునే అవకాశం లేదనీ వాదిస్తారు.   అస్సలు మళ్ళీ మారువేషంలో రామరాజు అజ్ఞాతంగా తలదాచుకున్నాడని వాదించడమే అతని ఔన్నత్యాన్ని అవమానించడమే అని ఖండిస్తారు. అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు, రచయిత, కమ్యూనిస్టు నేత, జర్నలిస్టు పడాల రామారావు తన 'చౌచౌ' పత్రికలో బెండపూడీ సాధూ ఆయన శిష్య బృందం సాగిస్తున్న చిద్విలాసాలను ఎండగట్టారు. అంతే కాకుండా, కమ్యూనిస్టు పార్టీ సారధ్యంలో అతని ఆశ్రమాన్ని చుట్టుముట్టి, పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు. దానితో బెండపూడి సాధూ లొంగిపోయి తాను సీతారామరాజును కాదని పడాల రామారావుకు 3 డిసెంబర్ 1962న స్వదస్తూరితో లేఖ ను కూడా రాసారట.

బాలానందబాబా


బాలానందస్వామి ఒరిజినల్ ఫోటో
ఆయన కొన్ని పుస్తకాల ముందు
పేజీల్లో అచ్చేసిన ఫోటో ఇది

బి. మదుసూదనరాజు గారి సహకారంతో

ఖమ్మంజిల్లా, పాపికొండల్లోని ఫేరంట పల్లి లో తన ధ్యానం తనలోకం తనదిగా జీవిస్తూ వుండే ఒక స్వామీజీని స్థానికలు గమనించి అతని సాత్విక జీవినం ఆధారంగా స్వామీజీగా భావించారు. తనపేరు వివరాలూ చెప్పని అతడిని ఆ ఊరి పేరు మీదుగా పేరంటాల పల్లి స్వామి అని బాలానందస్వామి అని పిలిచేవారు. ఇక్కడ స్వామీజీగా రావడానికి ముందటి విషయాలేమీ ఈయన చెప్పలేదు. కానీ జ్యొతిష్యం,మూలికావైద్యం,యోగసాధన వంటి గుప్త శాస్త్రాలను అవసరం మేరకు ఉపయోగిస్తూ వుండేవారు. ధృఢమైన శరీరం ధ్యానం వల్ల కలిగిన వచ్ఛస్సు ప్రతిఫలిస్తుండేవి. ఆంగ్లభాషలో ప్రవేశంతో పాటు తను స్వయంగా అనేక గ్రంధాలను ఆంగ్లభాషలోసైతం రాసారు. అంతేకాకుండా కేవలం తాత్విక ధ్యాన మార్గమే కాకుండా దేశభక్తి యుతమైన రచనలు కూడా చేయటం అల్లురి లక్షణాలున్నాయేమో లేదా ఈయనే అల్లూరి కావచ్చేమో అనే అనుమానాలకు దారితీసేలా చేసింది.
బాలానందకు దేవి సాక్షాత్కారం 
జరిగిందని చెప్పేసంవత్సరం 1925
అల్లూరి మరణించిన తర్వాతి సంవత్సరం
1935 కు ముందు బాలానంద ఎవరో, ఎక్కడినుండి 
వచ్చాడో ఎవరికీ తెలియదు, నిజానికీ ఆయనా 
తను రాసిన అన్నిపుస్తకాల్లోనూ, ఉపన్యాసాల్లోనూ
ఎక్కడా ప్రస్తావించలేదు

శిరీషగారికి ప్రత్యేక ధన్యవాదాలతో
బాలానంద కు తపస్సిద్ది జరిగింది
అని చెప్పే సంవత్సరం 1937
ఒంటరిగా వుండాలనో,
లేదా ప్రాణత్యాగం చేయాలనో
అనుకున్న ఆలోచనలనుంచి
గిరిజనులకు ఏదో చేయాల్సిన భాద్యత
తనపై వుందని పనులు మొదలేసే దిశగా

శిరీషగారికి ప్రత్యేక ధన్యవాదాలతో



నైజాం ప్రభుత్వం కొసం కొండరెడ్లమీద
పరిశోధనకు పూనుకున్న
హైమండార్ఫ్
'
ద రెడ్డీస్ ఆఫ్ బైసన్ హిల్స్ ' రాసే క్రమంలో
బాలానందనుంచి చాలా
తెలుసుకున్నాడు. నేర్చుకున్నాడు.
అదిలాబాదుజిల్లాలో గిరిజనులకోసం హైమండార్ఫ్
రూపొందించి నిజాంతో ఆమోదింపచేసిన
కార్యక్రమప్రణాళిక గాంధీజీ నిర్మాణాత్మకకార్యక్రమాన్ని
అనుసరించిందేనని హైమండార్ఫ్ కీ తెలీదు,
నిజాం కీ తెలీదు.
కానీ ఆ ప్రణాళికమీద గాంధేయ ఆలోచన ప్రభావం
ఉండటానికి కారణం బాలానంద.
ఆయనే హైమండార్ఫ్ కి ఆ దారిచూపించాడు.
అంతేకాదు, ఆంధ్ర-తెలంగాణా ప్రాంతంలో గిరిజనుల్తో
మొదటి సహకారోద్యమ ప్రయోగం

చేపట్టించింది కూడా బాలానందనే.
ఆయన గోదావరినదిమీద కలపస్మగ్లింగ్ చేసే అడవి దొంగల్ని,
ఫారెష్టు అధికారుల్ని ప్రభావితం చేసి కొయిడా లో
మొదటి గిరిజన వెదురుపనివారల
సహకారసంఘం
స్థాపించాడు.
పేరంటపల్లి కేంద్రంగా స్వామి బాలానంద చేసిన
గిరిజనవికాస కార్య్క్రమాలు
థక్కర్ బాపా కార్యక్రమాలకు
ఏ విధంగానూ తీసిపోనివి.
ఇంకా చెప్పాలంటే మరింత సమగ్రమైనవి కూడా.
కాని ఆ కృషిని ఎవ్వరూ స్మరించుకోకపోవడం నిజంగా శోచనీయం
.
-వాడ్రెవు చినవీరభద్రుడు గారి  స్పందనకు ధన్యవాదాలు.
అల్లూరి మరణ సమయంలో తిరిగిన రంప ప్రాంతం ఇక్కడికి పెద్ద దూరం కాదు. రోడ్డుమీది చెక్ పోస్టుల ఇబ్బంది లేకుండా హాయిగా నీటి మార్గంద్వారా గోదావరి పాయ వెంబడి ఇక్కడికి సులభంగా వచ్చే అవకాశంవుంది. నిజాముల ఆధీనానికి ధగ్గరలో వున్న ప్రాంతం కావడంతో భ్రిటీషువారి వెతుకులాట తాలూకు గందరగోళం తక్కువగా వుంటుంది. నిర్మలమైన ప్రశాంతమైన జీవితాన్ని కొండరెడ్లు, ఆటవికుల ప్రాంతాలలో గడిపేందుకు అనుకూలమైనది. ఇక వయస్సులోని పోలికలను తీసుకున్నా ఈ బాలానంద స్వామి ఎప్పుడు పుట్టారో తెలియదు కానీ 1955 వరకూ బ్రతికేవున్నారు. 1897లో పుట్టిన అల్లూరి సీతారామరాజు బ్రతికే వుంటే తన జీవన కాలానికి సరిగ్గా సరిపోయేలాంటి వయోపరిమితి. 1955 నాటికి ఆయన 58 సంవత్సరాల వయస్సుకి వస్తారు. బాలానంద స్వామి వయసు బేరీజులో దాదాపు తన నిర్యాణకాలానికి అదే వయసుగల వాడిలాగానే కనిపిస్తారు. అంత మాత్రమే కాకుండా ధృఢమైన శరీర నిర్మాణాన్ని కలిగివుండటం, హావభావాల్లో కనిపించే ఠీవి ఈయన కేవలం యోగిపుంగవునిలా కాక రాజర్షి లక్షణాలను చూపించేది. ఆయనే తన రచనల్లో స్వయంగా తాను క్షత్రియుడినని పేర్కొన్నారు.  తన ఆశ్రమ పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా వుండేలా జాగ్రత్త పడేవారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం ప్రాంతీయ కొండరెడ్లు చూసుకునేవారు. వీరికి ఆశ్రమాన్ని శుచిగా వుంచడం నేర్పడంతో పాటు వారి నివాసాలలో శుభ్రతను పాటించేలా అచ్చం రామరాజు పద్దతిలో ప్రేరేపించే వారట.  London కి చెందిన ఒక Enthusiast or Devotee(British national) స్వామీజి దగ్గరికి వచ్చి కొంత కాలం ఉన్నారు.అతని పేరు Adams. ఈయన బాలానంద స్వామి మౌఖికంగా చెప్పిన అనేక విషయాలను అచ్చులో అందుబాటులో తెచ్చేందుకు తనవంతు కృషిచేసారు. పేరంటాలపల్లిలో బాలానంద స్వామి ఆశ్రమానికి సాహిత్య సృజనలోనూ ప్రత్యేకస్థానం వచ్చింది. 
 

ఇక మరీ మరీ ముఖ్యమైన ఆధారంగా బాలానంద స్వామి తన జీవితకాలంలో తీయించుకున్న ఫోటోలు ఇప్పటికీ లభిస్తున్నాయి వాటిని తూటాలతో మరణించిన అల్లూరి ముఖంతో స్వామీజి తన చివరి కాలంలో తీయించుకున్న ఫోటోలతో పోల్చిచూసుకుంటే అచ్చు అవే పోలికలను మనం గమనంచ వచ్చు.  అల్లూరి పెంచిన గడ్డంలాగానే బాలానంద స్వామి కూడా తన గడ్డం పెంచుకునేవారట.  అదే విధంగా అల్లూరి అనుయాయులలో రామరాజు ని చివరి వరకూ నమ్మి, అందరికీ దూరమైన గోకిరి ఎర్రేసు. .. ఒక సొరకాయ తంబురా చేత బూని కృష్ణదేవి పేట వీధులలో తత్వాలు పాడుతూ, లభించిన భిక్షమాత్రం స్వీకరిస్తూ తనకు తోచిన తత్వాలను చెప్తూ వుండే వారట. ఉద్యమం లో కీలక పాత్ర వహించినా గానీ  వ్యసనాల కారణం గా రామరాజు చేత వెలివేయబడి, పోలీసులకి పట్టుబడిన మల్లుదొర, జైల్ నుండి విడుదలయ్యాక, 1952 లో పార్లమెంట్ కు నామినేట్ అయ్యి హస్తిన లో అడుగుపెట్టి ఆనాటి రాజకీయ చట్రంలో తనవంతు పాత్రపోషించాడు.

నిర్ధారణ కానిదే నమ్మేదెలా?

మరి అప్పట్లో డియన్ ఏ పోలికలను సరిచూసే టెక్నాలజీ వుండి. రామరాజు భంధువుల డిఎన్ ఏ తో బాలానంద బాబాగారి డిఎన్ ఏ ఎంతమేరకు కలుస్తుందో పరిక్షించగలిగినట్లయితే శాస్త్రీయపద్దతిలో ఖచ్చితంగా నిర్ధారణ అయ్యివుండేది. ఇప్పటికైనా ఫోటో కంపేరిజన్ పద్దతిని ఫోరెన్సిక్ విభాగాల సహాయంతో సరిపోల్చి చూడగలిగితే నిజమేమిటో తెలుస్తుంది. కానీ హిమాలయాలకంటే ఉన్నతంగా ఒక పోరాట యోధునిగా జనం మనసుల్లో నిలచిపోయిన అల్లూరి కీర్తిని మళ్ళీ నిజాల అన్వేషణ పేరుతో పలచన చేయడం అవసరమా? అది రామరాజు యుధ్ధశౌర్యాన్ని అవమానించినట్లు కాదా? కేవలం ప్రాణాల కోసం ఉద్యమాన్ని వదిలేస్తాడా? అని కొందరు వాదిస్తుంటే . రామరాజు కేవలం తన ప్రాణరక్షణ కోసం మాత్రమే కాదు. అప్పుడున్న మన్యం లోని అత్యయిక స్థితినుండి ఉద్యమం వల్ల అయ్యే భారాన్ని తగ్గించడం ద్వారా మన్యంపై జరిగే హింసను తగ్గించ వచ్చు అని గెరిల్లా వ్యూహ నిపుణుడిలాగానే ఆలోచించివుండవచ్చు కదా? తన మూడు సంవత్సరాల పోరాటంలోనూ అనేకసార్లు అవసరమైనపుడు తగినంత వెనక్కి తగ్గి తిరిగి అనుకూలత అనిపించగానే పులిలా పంజావిసరి శత్రువులని కకావికలు చేసిన వ్యూహ నైపుణ్యాన్ని ప్రదర్శించే వున్నారు. అప్పటికి ఆ పాత్రను, ఆ అంకాన్ని ముగించి మరో రూపంలో మరోలా మళ్లీ ప్రజలకు సేవచేయాలనే ఇలా వచ్చివుండవచ్చు కదా అనికూడా వాదిస్తున్నారు. అదే విధంగా ఇక్కడున్న బాలానంద స్వామి వారిని కలుసుకునేందుకు కొందరు అపరిచిత ముఖ్యవ్యక్తులెవరో వచ్చివెళ్తుండే వారని కూడా స్వామితో సన్నిహితంగావున్న వారు చెప్తేవారట. బాలానంత స్వామివారి పుస్తకాల డజను పైగా పాఠకులకు అందుబాటులో తెచ్చేందుకు కాకినాడలోని ఒకసంస్థ వాటిని అచ్చులోకి తీసుకువచ్చింది.  వాటిలో కొన్ని పుస్తకాలు ఇప్పటికీ లభిస్తున్నాయట. 

ఏదేమైనా కేవలం హీరోవర్షిప్ కోణంలోనే కాకుండా, అందమైన అసత్యంకంటే జీర్ణించుకోవడం కష్టమైన వాస్తవంలోని నిజానికే ప్రధాన స్థానం ఇవ్వడం అవసరం. భావోద్వేగాల కోణం కంటే చారిత్రక సాక్ష్యాలు మనతో ఏ రహస్యాలను వినిపిద్దామనుకుంటున్నాయో వాటిని యధాతధంగా వినేందుకు అడ్డువస్తున్న గొడల్ని ముందు పక్కకు తప్పించాల్సిదే.



       సూచికలు
  • విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు - ఎం.వి.ఆర్.శాస్త్రి 
  • డా||గోపరాజు నారాయణ రావుగారి సాక్షి వ్యాసం
  • Life History Of Alluri Seetha Rama Raju 
  • Material from Hindu and othe Online sources both in English and Telugu
  • బాలానంద స్వామి పుస్తకాల సేకరణలో తోడ్పడిన బి.మధుసూదన రాజు, స్టేట్ బెస్ట్ టీచర్ గార్కి ప్రత్యేక దన్యవాదాలు
  • బాలానంద స్వామి అరుదైన ఫోటోలు ఖమ్మంజిల్లా, తల్లాడ మండలం MPDO శిరీషగారి అమ్మమ్మ గారు సేకరించినవి. ఆవిడ స్వయంగా అల్లూరినీ, బాలానంద స్వామినీ గమనించారట, మిగిలిన పోలికలు ఒకేలా వున్నప్పటికీ అల్లూరికంటే బాలానందస్వామి ఎత్తుతక్కువగా అనిపించేవారట, పైగా బాలానంద ఎక్కువగా ఆంగ్లంలోనే మాట్లాడతారు, రాస్తారు. అల్లూరికి చక్కటి తెలుగు వచ్చు ఈ భేదాలను గమనించారు.
  • ఉపకరించిన అనేక ఆన్ లైన్ సమాచార స్థావరాలకూ, బ్లాగులకూ ధన్యవాదాలు
  • ప్రసారమయిన కొన్ని విడియోలు

కామెంట్‌లు

  1. alluri charitralo vinipinchina 'padalu' ane veerudu... ii madhya varaku andaman lo port blair lo unnaru. jail siksha anubhavinchaka, akkade undipoyaru. ippudu unnara annadi teliyadu. andaman lo unna telugu variki baga telusunu...

    రిప్లయితొలగించండి
  2. ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి ఫోటోలతో సహా ప్రచురించడం, దానికి మీ విశ్లేషణ కూడా జోడించడంతో ఆర్టికల్‌కు ఆథెంటిసిటీ వచ్చింది. మీ కృషి అభినందనీయం.

    రిప్లయితొలగించండి
  3. ఒక గొప్ప తాత్విక సిద్దాంతాన్ని చదివిన ఫీలింగ్ కలుగుతుంది...ఇంత మంచి సమాచారాన్ని సేకరించి పంచినందుకు ధన్యవాదాలు....

    రిప్లయితొలగించండి
  4. 2005 - మే లో టి . వి . 9 లో శ్రీరామ్ తో కలసి కాకినాడ నుంచి - అల్లూరి శ్రీరామరాజు గారే బెండపూడి సాధువు గారా ! అనే కోణంలో అప్పటివరకు జనావళి లో వున్న అనుమానాల గురించి రిపోర్టింగ్ ఇప్పించింది నేనే . మంచో , చెడో 2005లో మళ్ళా ఈ విషయం చర్చల్లోకి వచ్చింది .
    2005 లో నేను ఈ విషయం నిర్ధారించుకోవటానికి మన్యంలో చాలా మంది కలిసాను. శ్రీ రామరాజు గారితో ప్రత్యక్షంగా సంభంధాలను కలిగి వుండిన ఎన్నో కుటుంబాలను కలవటం జరిగింది . చరిత్రలో ఇంకా బయటకి రాని చాలా విషయాలు నన్ను విస్మయానికి గురిచేశాయి . అవన్నీ అలా వుంచితే ఈ బ్లాగులో ప్రస్తావించిన విషయం - బెండపూడి సాధువు గారికి శ్రీ రామరాజు గారికి ఏ విధంగాను సంబంధం లేదు .
    1) శ్రీ రామరాజు గారి మృత దేహానికి కే. డి. పేటలో అంత్యక్రియలకు పాల్గొనిన రాజు అనుచర కుటుంబాలు మరియు కృష్ణదేవిపేటలో రాజుగారికి తపస్సు చేసుకోవటానికి ప్రధమంగా ఆశ్రయం కల్పించిన శ్రీ చిటికెల భాస్కరనాయుడు గారి కుటుంబము దీనికి ప్రధమ సాక్ష్యం . తాండవ ఒడ్డున శ్రీ రామరాజుగారు వీరి సహకారంతోనే శ్రీరామ విజయనగరమును నిర్మింప జేసుకున్నారు . (ఆ కుటీరం వెనుక ఒక ముషిని చెట్టు వుండేది. ఆ చెట్టు ఆకులే ఆ సమయంలో రాజు ఆహారం. ) వీరే కాదు, మంప, కొయ్యూరు, చుట్టుపక్కల అనేక గ్రామాలలోని వృద్ధులు అదే చెపుతున్నారు .
    2) శ్రీ రామరాజు గారి మృత దేహానికి స్నానం చేయించేటప్పుడు ఫోటో కోసం వారి తలను ఎత్తి పట్టుకున్న వ్యక్తి తామరాపల్లి ఆదినారాయణ. కే. డి. పేట వాస్తవ్యుడు. అతను రాజుగారు కె.డి . పేటలో ఉండేటప్పుడు సన్నిహితంగా మెలగిన వాడే.
    3) కె. డి . పేటలో శ్రీ రామరాజు గారి వద్ద జ్యోతీష్యం నేర్చుకొన్న వారిని కూడా నేను కలవటం జరిగింది 4) గాం గంటం దొర ఇంటి వారు కూడా చనిపోయినది శ్రీ రామరాజుగారేనని నిర్ధారణ చేసారు.
    5) ఇంకొక్క ముఖ్య విషయం ఏమిటంటే - గాం మల్లు దొర ఎన్. టి . ఆర్ . కి వ్రాసిన లెటర్ . అది చాల హాస్యాస్పదం . నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే - మల్లుదొరకి సంతకం చేయటం కూడా రాదు . ఆయన అస్సలు చదువుకోలేదు . మల్లుదొర చేతి వ్రాత లెటర్ అని ఒక లెటర్ మనకి కొన్ని పుస్తకాలలో కనిపిస్తుంది .
    6) 1945- 1965 ఆ సంవత్సరాలలో ఆంద్ర దేశంలో తీవ్రమైన కరువు తాండవించింది . బెండపూడి సాధువు గారు అంత కరువులోనూ రోజుకి మూడువేల మందికి పైన అన్నదానం చేసేవారు . మన్యం నుంచి ఆశ్రమానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చి అన్నం తిని పోతుండేవారు. వస్తూ మన్యంలో దొరికే అన్ని రకాల కూరగాయలు, పళ్ళు లాంటివి ఏముంటే అవి భక్తితో తెచ్చేవారు. అలాగే పార్లమెంట్ సభ్యునిగా పదవీ కాలం ముగిశాక మల్లుదొర కూడా ఆశ్రమానికి వచ్చి పోతుండేవాడు . అతను తన చివరి దశ వరకూ వ్యసనాలకు బానిసగానే గడిపాడు. తన అవసరాలు తీరటానికి, డబ్బుకి అతను చివరి దశలో చాలా ఇబ్బందులకు గురయ్యాడు. ఆ సమయంలోనే సాధువుగారిని అతను ఆశ్రయించటం జరిగింది.
    7) శ్రీ రామరాజు గారిని వారి తల్లిగారు చివరి చూపు కూడా (మృత దేహాన్ని) చూడలేదు. ఆ తల్లికి ఒక భ్రమ ఉండిపోయింది " తన కొడుకు ఇంకా బతికే వున్నాడని". అందుకని ఎవరెవరో పుట్టించిన పుకార్లను నమ్మి బెండపూడి ఆశ్రమానికి వెళ్లారు. జనాలలో ఆ విధమైన మాట ఎందుకు పుట్టిందో అర్ధం కాక వారు రెండోసారి శ్రీ రామరాజుతో ఎంతో సన్నిహితంగా గడిపిన చిటికెల భాస్కర నాయుడుని వెంట తీసుకొని బెండపూడి వెళ్లారు. సాధువు గారు రాజు కాదని నిర్ధారించుకొని వెళ్ళిపోయారు.
    8) సాధువు గారే శ్రీ రామరాజు అని భ్రమ పడి 8 మంది క్షత్రియ కన్యలను యిచ్చి వివాహం చేసిన క్షత్రియ కుటుంబాల వారు తరువాత తమ తొందరపాటు నిర్ణయానికి చింతించారని తెలిసింది.
    9) శ్రీ రామ విజయనగరంలో శ్రీ రామరాజుగారు ఉండేటప్పుడు వైద్యానికో లేక భర్త తాగొచ్చి వేధిస్తున్నాడనో, తమ ఇబ్బందులను చెప్పుకోవటానికి వారి వద్దకు వచ్చే స్త్రీ మూర్తుల పాదాల వంక కూడా చూసి మాట్లాడే వారు కాదని మన్య ప్రజలు ఇప్పటికీ రాజుగారి వైరాగ్య జ్ఞాన సంపద గురించి చెపుతారు. అలాంటిది సన్యసించి దేశం కోసం ప్రాణాలను బలిపెట్ట నిశ్చయించిన విప్లవాగ్ని పౌరుషం ఎనిమిది మందిని పెళ్ళిచేసుకుని ఒక మామూలు సంసారిగా మారి వుండగలదా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా చాలా విలువైన సమాచారం ఇచ్చారు.. దయచేసి ఒకేసారి నాకు కాల్ చెయగలరా... నేను మంచి వీడియో చేద్దామని అనుకుంటున్నాను మీ సహాయం కావాలి . నా నెంబర్ 9032446230

      తొలగించండి
  5. బెండపూడి సాధువు, పేరంటాలపల్లి లేదా పేరంటపల్లి సాధువు గార్లను అల్లూరి సీతారామరాజుగా చాలా కాలం ప్రజలు పొరబడిన మాట నిజం. శ్రీ సీతారామరాజును బ్రిటిష్ వారు కాల్చి చంపిన మాటే నిజమని నమ్మాలి,ఎందుకంటే క్షమ అనేది వారి నెత్తురులోనే లేని మాట కనక. సీతారామరాజు పైగల ప్రేమతో ప్రజలు ఆయన ఈ నాటికి ఉన్నారని అనుకునేవారే ఇంకా ఉన్నారంటే...... ఇలాటిదే మరో సంఘటన నేతాజీది. అలనాటి కాంగ్ర్స్ ప్రభుత్వాలు ఈ విషయాలలో కూడా రాజకీయం చొప్పించి అసలు చరిత్రకే పాతరఏసింది...
    remove word verification it is much irritating

    రిప్లయితొలగించండి
  6. ఈ బ్లాగు కామెంట్లకు వర్డ్ వెరిఫికేషన్ లేదండీ. అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అయ్యి కామెంట్ చేయవచ్చు అలా వద్దనుకుంటే అనానిమస్ గా కూడా ఇలా కామెంట్ చేసే అవకాశం వుంది.

    రిప్లయితొలగించండి
  7. చరిత్ర కూడా అబధ్ధం చెప్తే యెట్లా?
    అద్దం కూడా మోసం చేస్తే యెట్లా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చరిత్ర నిజాలతో కాక ఎర్ర కళ్ళతో రాసేరు స్వతంత్రం వచ్చాకా, అందుకు నిజాలకి పాతరే వేయబడింది. చరిత్ర అబద్ధమే చెబుతోంది.

      తొలగించండి
    2. అల్లూరి 1924లో చనిపోకపోయి ఉండొచ్చు కానీ ఆంగ్లేయుల నుంచి తప్పించుకున్న ఏడాదికే ఆయన మళ్ళీ ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు, అల్లూరి అంత అజాగ్రత్తగా ఉండేవారనుకోను.

      తొలగించండి
  8. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని క్షత్రియులని తూర్పు రాజులు అంటారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని క్షత్రియులతో పోలిస్తే వీళ్ళు ఆర్థికంగా వెనుకబడినవాళ్ళు. అల్లూరు తూర్పు రాజు అనే నిజం ఒప్పుకోలేక అతను మోగల్లులో పుట్టాడని ఖస్త్రియులు ప్రచారం చేసారు.

    అశోక్ గజపతిరాజు కుటుంబంవాళ్ళు తాము సూర్యవంశ క్షత్రియులమని చెప్పుకుంటారు. వీళ్ళని తూర్పు రాజుల్ని చూసినట్టు చూడరు, అది వేరే విషయం.

    రిప్లయితొలగించండి
  9. రామరాజు 1924లోనే చనిపోయాడు. అతను సాధువు వేషంలో తిరిగేంత పిరికివాడు కాదనే అతన్ని చూసినవాళ్ళు అన్నారు. బెండపూడి సాధువు ప్రవర్తన రామరాజు ప్రవర్తనని సరిపోలలేదని రామరాజు తల్లే చెప్పింది. కనుక బెండపూడి సాధువు రామరాజు అయ్యే అవకాశం లేదు.

    రిప్లయితొలగించండి
  10. 1961-62 సం॥ లో ఒక సారి మేము ఉంటున్న గెద్దనాపల్లె ఊరికి బెందపూడి సాధువుగారు వచ్చి రెండు మూడు రోజులున్నారు. మా స్నేహితుకు ముగ్గురు సీతారామరాజు బుఱ్ఱకథ కూడా చెప్పటమూ దాన్ని చాలా సేపు సాధువుగారు తిలకించటమూ జరిగింది. అప్పటికి నేను పదేళ్ళవాడిని. అయన కూడా ఇద్దరు మగపిల్లలు విల్లంబులు పట్టుకొని తమాషాగా తిరిగారు. అదంతా వింతగా అనిపించింది. అన్నట్లు మేము ఆ బుఱ్ఱకథ రిహార్సలు చేసుకుందుకు పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఒక త్రాచుపాము కనిపించి వెనక్కు వచ్చేసాము. అది కూడా గుర్తుంది. ఇంకొక సంగతి ఏమిటంటే ఆ బుఱ్ఱకథ చెప్పిన ఇంటి వసారా గోడ తడిగా ఉండి చిన్నచిన్న షాక్‍లు ఇచ్చింది. పిల్లలు అదేదో ఆటగా తీసుకుంటుంటే పెద్దవాళ్ళు గమనించి అందర్నీ తరిమేసారు అక్కడినుండి.

    రిప్లయితొలగించండి
  11. Ramaraju had no need to hide in the garb of a sadhu even after independence.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి