విలక్షణ వాణిజ్య మార్గం, ప్రాచీన ఇంజనీరింగ్ వైభవం మహారాష్ట్ర లోని పూనే జిల్లాకు చెందిన నానేఘాట్ కనుమ

నానే ఘాట్ ప్రవేశ మార్గానికి ఒకవైపు కనిపించే రాతి కుండ
బాహుబలి సినిమా చూసిన ఎవరికైనా ప్రభాస్ పడుతూ లేస్తూ చాలా ఎత్తుకు ఎక్కుతూ రావడం తప్పకుండా గుర్తుంటుంది. కానీ అట్లాంటి దారి నిజంగా వుంటే ఎలా వుంటుంది. బాహుబలులే కాకుండా పిల్లలూ ముసలి వాళ్లు సైతం అలాంటి దారిలో ప్రయాణించాల్సిన అవసరం వస్తే ఏంచేయాలి. ఇప్పటిలా టెక్నాలజీ మరీ గొప్పగా అభివృద్ది చెందకపోయినా అందుబాటులో వున్నంత వరకూ అద్భుతంగా వాడుకున్న మొదటి శతాబ్దంలో శాతవాహనుల కాలంలో ఇటువంటి దారిని ఎలా నిర్మించి వుంటారు. అక్టోబర్ 26,27,28 తేదీలలో మహారాష్ట్రలోని పూనె జిల్లాలో పత్రసమర్పణ చేయవలసిన వుండటంతో అక్కడి పరిసరాలను కూడా చూసే అవకాశం దొరికింది. నా పరిశీలనకు దొరికనంతలో గమనించిన కొన్ని అంశాలను మీతో పంచుకుంటాను. 

ఇండో యూరోపియన్ ప్రాచీన మార్గం
దేశానికి ఒక పక్క పెట్టని గోడలాగా అక్కడ వున్న పడమటి కనుమల ప్రాంతం పాశ్చాత్యులతో(పడమటి దేశాల వాళ్లు) వ్యాపార సంభందాలు నిర్వహించాలంటే ఒక దారి కావలసిన ప్రాంతం అది. వేల సంవత్సరాల చరిత్ర వున్న జన్నార్ నగరం కూడా పూనే జిల్లాలోకే వస్తుంది. కొంకణి తీరప్రాంతమైన కళ్యాణి నుంచి జన్నార్ మాత్రమే కాదు మన దక్షిణాపథం

(దక్కన్ ప్రాంతాన్ని) చేరుకోవాలంటే 689 మీటర్లు అంటే దాదాపు 2260 అడుగుల ఎత్తుకు చేరుకోవాలి. పోనీ ఇది కూడా ఎలాగోలా సాధించేద్దాం అనుకుంటే మధ్యలో అంతకంటే ఎత్తుగా మహాకాయంతో నిలబడిన పశ్చిమ కనుమలు వీటిమీదుగా రావాలంటే ఇందాక చెప్పుకున్నట్లు బాహుబలిలా పాక్కుంటూ రావాల్సిందే. ఇంత చేసినా బుజాలమీద శివలింగం మోస్తూ ఎత్తుకు ఎక్కుతూ రావడం కుదరదు కదా. అలాంటి సమయంలోనే ఈ కొండల మధ్య కనుమ(pass) దారికోసం వెతుకులాడి వుంటారు అప్పటి పరిపాలకులు. అలా దొరికిందే నానేఘాట్ కనుమ. 

ఇంజనీరింగ్ అద్భుతం ఈ నానేఘాట్ మార్గం : ఈ కనుమ చాలా వాలుగా వుంటుంది. పైగా చుట్టుతిరిగి వచ్చే అవకాశం లేని వర్షపు నీళ్ళన్నీ ఈ దారిగుండానే వేగంగా ప్రవహించుకుంటూ వెళ్ళే అవకాశం వుంది. ఇటువంటి దారిని ప్రయాణానికి అనువుగా చేసేందుకు వాళ్ళు ఎంచుకున్న పద్దతి భలే అబ్బురంగా అనిపిస్తుంది. అక్కడి కొండల్లోని రాళ్ళను సర్పిలాకారపు మెట్ల మాదిరిగా మార్చుకుంటూ క్రింది ఏర్పాటు చేసారు. నిర్మాణం తర్వాత ఈ మార్గం ఎంత సులభంగా మారిందంటే ఆ దారిలో గుర్రాలు, ఏనుగులు సైతం చిన్న బండ్లను రోడ్డు మీద లాగిన పద్దతిలోనే లాక్కుంటూ కనుమగుండా పైకి వచ్చేయ వచ్చు. అలా విదేశీ వ్యాపారం మెరుగుపడేందుకు అత్యంత పూర్వీకులు చేసిన చక్కటి ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఈరోజు చూడగలగటం భలే ముచ్చటగా అనిపించింది. ఇంకో ముచ్చట కూడా చెప్పాలి. అక్కడి కొండను కూడా ఎలా పడితే అలా అడ్డ దిడ్డంగా తవ్వుకుంటూ రాళ్ళను తీసుకోలేదు. చక్కటి గుహలుగా చెక్కారు. ఆ గుహల్లోనే అప్పటి పరిపాలకుల నిలువెత్తు విగ్రహాలను, ఆ నాటి విశేషాలను తెలియజేసే శాసనాలనూ చెక్కి వుంచడంతో ఈ సమాచారం మనకు మరింత విపులంగా దొరికే అవకాశం లభించింది (ఈ శాసనాల వివరాలను మరికొన్ని విశేషాలనూ కొత్త తెలంగాణ చరిత్ర గ్రూపులో శ్రీరామోజు హరగోపాల్ గారు వివరించారు). ఇటువంటి వ్యాపార సంభందాలలో కేవలం ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే చూసే బౌద్దం ప్రబావం కూడా చాలా వుంది అనే విషయాన్ని అనేక పరిశోధనలు ఉటంకిస్తున్నాయి. రాతిని వాడటంలో వీరి శ్రద్ద నైపుణ్యాన్ని చూపే మరో ఆధారంగా ఒక పెద్ద శిలాఘటం ఆనవాలై నిలబడివుంది. మరోవైపు ఘటపు అడుగు భాగం మాత్రం అవశేషంగా కనిపిస్తోంది. పైగా ఈ శిలా కుంభం ఏకరాతి నిర్మితం కాక మనం ఇప్పుడు ఇనుప బుంగలను చేస్తున్న పద్దతిలో వేర్వేరు విడిభాగాలుగా తయారు చేసివాటిని చక్కగా కలిపారు. ఇవెంత పెద్దవి అంటే లావుపాటి వ్యక్తి దానిలో సులభంగాకూర్చోవచ్చు. 

నానే ఘాట్ కనుమకు ఆ పేరు వెనకున్న కథలు :  దారికి రెండు వైపులో వుంచిన ఈ
పైన వున్న చిత్రంలోని పూర్తి కుండ కాకుండా
రెండవ వైపు వున్న మరో రాతి కుండ అడుగు భాగం
శిలాఘటాలు టోల్ టాక్స్ లా నాణేల వసూలు పనిలో ఉఫయోగ పడేవని భావిస్తూ వికీలో కనిపిస్తున్న సమాచారం ప్రకారం నానే అంటే నాణెములు అని, ఘట అంటే కుండ కాబట్టి ఈ టోల్ టాక్స్ కుండల వల్లనే నానే ఘాట్ అనే పేరు వచ్చింది అనేది ఒక కథనం. అయితే ఈ ఘటాల నిర్మాణం వాటిని దారికి ఇరువైపులా వుంచిన విధానం బౌద్ధ పూర్ఱకుంభ ఆరాధనలాగా కూడా తోస్తుంది. అదే విధంగా కొన్ని రకాల రసాయన పదార్ధాలను మిశ్రమంగా చేసేందుకు లోహపాత్రలకంటే రసాయనిక చర్యలో పాల్గొననివి, అత్యంత వేడిని తట్టుకోగలిగేవి అయిన శిలా ఘటాలు అనువుగా వుంటాయి. మరి అటువంటి మరేదైనా ప్రత్యేక ప్రయోజనాలను కూడ కోరుకున్నారా అనేది మరింత పరిశీలనలో చూడవలసి వుంటుంది. 

మరో వివరణ ప్రకారం నాన్చా అంగ్తా Nanacha Angtha (Grandfather’s thumb) అంటే తాతగారి బొటనవేలు అనే అర్ధాన్ని తీసుకుంటూ ఇక్కడి జన్నార్ కొండల్లో వున్న అటువంటి ఉర్ధ్వ అంగుళీకపు ప్రతీకలా కనిపిస్తున్న కొండలను ఉదహరిస్తున్నారు మరికొందరు. నావరకు నాకైతే ఈ రెండిటికన్నా మరో వివరణ ఈ పేరురావడం వెనకున్న కారణంగా కనిపిస్తోంది. 



శాతకర్ణి మహారాజు, మహారాణి నాగనిక లేదా నాయనికా దేవి లు పూజించే దేవత పేరు ‘నాన (Nanaa)’ సింహారూఢి అయిన ఈ నానాదేవత ప్రస్తావన శాతవాహన శాసనాల్లో రావడమే కాక వారి రాజముద్రలలోనూ, నాణేలలోనే కనిపిస్తుంది. ఈ దేవత ఆశిస్సులతో నడిచే వాణిజ్యం అన్న ఉద్దేశ్యంతో ఈ కనుమకు నానేఘాట్ అనే పేరువచ్చిందనే వాదన నాకు అత్యంత సమంజసంగా అనిపిస్తోంది దానికి సంభందించిన కొన్న చిత్రాలను కూడా జతచేసాను చూడండి. Νανα, Ναναια, Ναναϸαο అనే పేర్లతో వున్నదేవత కుషానుల ఆరాధనల్లోనూ, గ్రీకు పురాణాల్లోనూ, నానే అనే పేరుతో ఒక ఆర్మేనియన్ దేవత కూడా వుంది. ఆమె జ్ఞానం, యుధ్దం, మాతృత్వాలకు అధిదేవతగా వుంటుంది. సుమేరియన్, అక్కాడియన్ ప్రజలు కూడా నానయా అనే పేరుతో వున్న దేవతను కొలుస్తారు. అలాగే జ్ఞాన మార్గం అనే వుద్దేశ్యంతో కూడా జ్ఞానఘాట్ అనేది అనునాసిక ద్రుతం వల్ల నానే ఘాట్ గా రూపాంతరం చెంది వుండవచ్చనే ఊహకూడా చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడి గుహలు ధ్యానసాధనకు ఉపయోగపడేవిగా వుంటే, కొండపైన సాధనకుఅనువైన చదును ప్రదేశం వున్నట్లు అర్దం అవుతోంది. 

వీర నారి, పరిపాలనా ధురంధరి, రాజనీతిజ్ఞురాలు నాయనిక లేదా నాగనిక

శాతవాహన కాలం అంటే నిజానికి మాతృస్వామ్య వ్యవస్థ పునాదులపై పిత్రుస్వామ్యం నెమ్మదిగా ఎదుగుతున్న రోజులుగానే చెప్పవచ్చు. అమ్మతల్లులను దేవతలుగా ఆరాధించే దశనుంచి, గుంపు అమ్మ యొక్క ఆంత్రొఫోమార్ఫిక్ శిలాఫలకాలను ఖనన సంస్కారం నిర్వహించిన ప్రదేశాలపై వుంచిన ఆనవాళ్ళు ఇప్పుడుమనం అనేక సిస్టులు, డోల్మన్ వంటి అనేక ఆదిమ సమాధులపై గమనిస్తాము. శాతకర్ణి మహారాజు
అయినప్పటికి గౌతమీ మాత పుత్రునిగా ప్రసిద్ధమైన ఆనాటి పరిస్థితులను కూడా గమనిస్తే, చరిత్రకందినంతలో ఆనాటి ప్రముఖమైన తొలితరం మహిళలైన కశ్మీర దేశానికి చెందిన సుగంధ, ప్రధామిక మధ్యయుగపు బెంగాల్ బీహార్ ప్రాంత పరిపాలన వహించిన విజయసేనుడి ధర్మపత్ని విలాసదేవి, ఇంకా దిడ్డ, ప్రభావతి గుప్త వంటి వారిలో తొలిస్థానంలో చెప్పుకోదగిన రాజమాత నాగనికా దేవి. ఈమె మొదటి శాతకర్ణికి భార్యామణి, మరాఠా త్రాణకాయిరో కలాలయకు ప్రియ పుత్రిక, ఇక్కడి గుహ గోడలపై కనిపించే శాసనాన్ని వేయించిన వారు ఈవిడే, దానిలో శాతకర్ణి మహరాజును దక్షిణాపధానికి ప్రభువని పేర్కొన్నది. ఈయన దక్షిణాపథంలో తిరుగులేని చక్రవర్తిగా భాసిల్లటమే కాక తన సార్వభౌమాధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, ఆ విషయం అందరికీ అర్ధం అయ్యేలా ప్రకటించేందుకు ఒక రాజసూయ యాగం, రెండు అశ్వమేధయాగాలను అనేక ఇతర క్రతువులను చేసినట్లుగా కూడా తన భర్త శాతకర్ణి మరణానంతరం ఆస్తన పురోహితుల సహకారంతో వేయించిన శాసన పాఠంలో పేర్కొన్నది. ఇటువంటి క్రతువులకు కర్షఫణాలనే ధనాన్ని ఎంతెంత దానం చేసారు, ఏయే ఇతర వస్తు, వాహనాలను దానం చేసారో పేర్కొన్నారు. 
 
ఇదే శాసనంలో శాతవాహన వంశ ప్రారంభకునికిగా సిముకుడి పేర్కొన్నది. అటువంటి సిముకుడి కుమారుడే శాతకర్ణి మహారాజు. వీరికి ఇద్దరు కొడుకులు ఒకరు వేదశ్రీ అతనినే కందసిరి అని లేదా స్కందశ్రీ అని మరికొన్ని చోట్ల పేర్కొన్నారు. రెండవ వాడు శక్తి శ్రి లేదా సతి సిరిమఠ లేదా హకుసిరి. వీరు తమ తల్లి నాయనిక ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ తమ ఉద్యోగ భాద్యతలా రాజ్యపరిపాలన చేసారు. బ్రహ్మి లిపిలోనూ, ప్రాకృత భాషలో వున్న నానేఘాట్ శాసన పాఠం గురించి మన ఆధునిక చరిత్రకు అందినంతలో తొలిప్రస్తావన 1837లోనే జరిగింది. Sykes తను కంటితో చూసి గీచిన శాసన పాఠంలోని కొంత భాగాన్ని ది రాయల్ ఆసియాటిక్ సొసైటీ వాల్యూమ్ 4 లో (288వ పేజీ) ప్రచురింపచేసారు. బ్యూలర్ సర్వే ఆఫ్ వెస్టర్న్ ఇండియా 5వ సంపుటిలో అచ్చుతీత ప్రతులను ప్రచురించి వాటిగురించి చర్చించారు. పశ్చిమ భారతదేశం అత్యంత ప్రాచీన చారిత్రక డాక్యుమెంటుగా దీన్ని పేర్కొన్నారు. గుహలోపట ఎదురుగా కనిపించే నిలువెత్తు రాతి శిల్పాలు పూర్తిగా శిధిలం అయ్యియి సూచాయగా రూపాలు కనిపిస్తున్నాయి. క్రింద కాళ్ళు భాగం కనిపిస్తోంది. ఎనిమిది బొమ్మలలో వాటి తలలపై కనిపిస్తున్న పేర్లు ఆధారంగా ఆ బొమ్మలను పరిశీలిస్తే

  • 1) సిముక శాతవాహన చక్రవర్తి (శాతవాహన వంశ స్థాపకుడు)
  • 2) మహారాణి నాగనికా దేవి 
  • 3) మహారాజు మొదటి శాతకర్ణుల వారు
  • 4) కుమార భయాలుడు
  • 5) పేరు కనిపించటం లేదు
  • 6) మహారధి త్రాణకాయిరుడు (నాగనిక తండ్రి)
  • 7) కుమార హకు శ్రీ (నాగనిక కుమారుడు)
  • 8) కుమార శాతవాహనుడు ‘(నాగనిక కుమారుడు)

మూడు నాలుగు చిత్రాలలో కనిపిస్తున్న నాగనిక, శాతవాహనుల యుగళ చిత్రలలో నాగనిక చిత్రమే మొదటగా వుంటుంది బహుశా అప్పట్లో ఆమె అధికార ప్రాభవానికి ఒక ఆధారంగా దీన్నిభావించ వచ్చు అంతే కాదు. రాజ్యం నుంచి విడుదల అయిన వెండి నాణేలలో ఆమె పేరు వుండటాన్ని కూడా గమనించ వచ్చు. ఇంక కనుమకు బయట పక్క ఒక గణేశుని ఆలయం కూడా వుంది. ఆ గుడి పక్కనుంచి మొట్ల దారి ఒకటి కొండమీదివరకూ వెళుతోంది. మేకుసందర్శనకు వెళ్ళిన రోజు దగ్గరలోని షోటో కాన్ కరాటే బృంద విద్యార్ధులు దానిపై సాధన చేసి వస్తున్నారు. అంటే పైన చాలా విశాలమైన చదునైన ప్రదేశం వుందని అర్ధం అయ్యింది. అక్కడికి దగ్గరలోని టీ కొట్టులో అడిగితే కూడా అదే విషయం నిర్ధారించారు. చారిత్రక ప్రాధన్యత మాత్రమే కాకుండా ట్రెక్కింగ్ కోసం కూడా ఇది చక్కని ప్రదేశం వీటికి అదనంగా మంచి ఫోటో షూట్ చేసుకునేందు చక్కటి వెలుతురు చిత్రాలనే కాక కొండల అందమైన బ్యాక్ డ్రాప్ ను కూడా అందించే మంచి పర్యాటక ప్రదేశం ఇది. 





కామెంట్‌లు