1857 తిరుగుబాటు కాలం నాటి అలంబేగ్ అనే వీరుడిత్యాగాన్ని కథగా చెప్తున్న సగం పుర్రె



1857 తిరుగుబాటు కాలం నాటి అలంబేగ్ అనే వీరుడిత్యాగాన్ని కథగా చెప్తున్న సగం పుర్రె

అలంబేగ్ పుర్రె :  

1857 తిరుగుబాటు దారుని    

జీవన్మరణ వృత్తాంతం
పోయిన సంవత్సరం నవంబర్ లో ఒక పుస్తకం విడుదల అయ్యింది. అదికూడా మన దేశంలో కాదు రచయిత మన దేశం వాడు కూడా కాదు. కానీ విషయం మన దేశానికి సంభందించినదే. అప్పుడెప్పుడో సిపాయిల తిరుగుబాటు 1857 కాలం నాడు భ్రిటీష్ ఇండియాలో పనిచేసిన భారతీయ హవల్దార్ సైనికుడు అలంబేగ్ పుర్రె గురించి చాలా సంగతులు కాదు కాదు నిజాలను వెలికి తీస్తూ ఆ వీరసైనికుడికి కనీస గౌరవం దక్కాలంటే ఆ పుర్రెను ఇప్పటికైనా భారతదేశానికి పంపి అంత్యక్రియలు జరిగేలా చూడమని ఆ పుస్తక రచయిత కిమ్ వాగ్నర్ వాళ్ల దేశాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఎవరీ పరిశోధకుడు ?  కిమ్ వాగ్నర్ లండన్ లోని క్వీన్ మేరీ కళాశాలలో బ్రిటీష్ ఇంపీరియల్ చరిత్ర పాఠ్యాంశాల అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. తన పాఠ్యాంశాలకు అదనంగా బ్రిటీష్ ఇంపిరియల్ భారతదేశంలో చేసిన ప్రస్థానం గురించి అప్పుడు జరిగిన వివిధ చారిత్రక సంఘటనల లోతుపాతులను గురించి అధ్యయనం కూడా చేస్తున్నారు.


పరిశోధన మధ్యలో చేరిన పుర్రె  : వాగ్నర్ పరిశోధనలు జరుగుతున్న నేపద్యంలోనే 2014 సంవత్సరంలో ఒకనాడు ఆయనకు ఒక మెయిల్ వచ్చింది. అది పంపింది ఒక Lord Clyde ( pub in the eastern English coastal town of Walmer in Kent ) అనే ఒక పబ్ ను కొత్తగా కొనుగోలు చేసిన జంట నుంచి వారి మెయిల్ సారాంశం ఏమిటంటే అయ్యా మా హోటల్ స్టోర్ రూం లో ఒక పుర్రె వుంది. మాకు దానిని ఏం చేయాలో తెలియట్లేదు మీరు చరిత్ర పరిశోధకులు కదా మీకు ఏమైనా ఉపయోగపడితే దాన్ని తీసుకెళ్ళండి అని. పైగా మరో విషయం కూడా చెప్పారు ఆ పుర్రె కంటి రంధ్రం లోపట చేతితో రాసిన ఒక కాగితం కూడా వుంది దానిలో ఏవో వివరాలు వున్నాయి అని చెప్పారు. వాగ్నర్ వెంటనే ఆ పుర్రెను పరిశీలించేందుకు వెళ్లాడు. చాలా పాత పుర్రె క్రింది దవడ మొత్తం ఎక్కడో పోయింది. పై దవడలోని కొన్ని పళ్ళు కూడా శిధిలం అయిపోయాయి.  మామూలుగా అయితే దానికేం ప్రత్యేకత ఉండేది కాదు. కానీ దాని కంటి రంధ్రంలో ఆ పుర్రెకు సంభందించిన కొన్ని వివరాలు రాయడం వల్ల అది కూడా చరిత్ర పరిశోధకుడికి దొరకటం వల్ల చరిత్రలో మరుగున పడిపోయిన అనేక నిజాలు హఠాత్తుగా వెలుగులోకి వచ్చాయి. ఆ చేతిరాతతో వున్న కాగితంలో ఇలా వుంది.


















Skull of Havildar "Alum Bheg," 46th Regt. Bengal N. Infantry who was blown away from a gun, amongst several others of his Regt. He was a principal leader in the mutiny of 1857 & of a most ruffianly disposition. He took possession (at the head of a small party) of the road leading to the fort, to which place all the Europeans were hurrying for safety. His party surprised and killed Dr. Graham shooting him in his buggy by the side of his daughter. His next victim was the Rev. Mr. Hunter, a missionary, who was flying with his wife and daughters in the same direction. He murdered Mr Hunter, and his wife and daughters after being brutally treated were butchered by the road side.

అలంబేగ్ అనే ఆయన 46 వ బెంగాల్ రెజిమెంట్ లో హవల్దార్ గా వుంటాడని, ఆయన పిరంగీ గొట్టానికి కట్టి కాల్చేయబడ్డాడని ఆయన చేసిన నేరం 1857 తిరుగుబాటులో ఒక దళానికి నాయకుడని, కోటకు వెళ్లే ఒక ప్రధాన దారిని మొత్తంగా ఈయన స్వాధీనంలోకి తీసుకున్నాడని, దానివల్ల యూరోపియన్లు తమ భద్రతకు అత్యంత ముప్పు ఏర్పడినట్లు ఆందోళన చెందారని, డాక్టర్ గ్రాహం అనే ఆయన అలంబేగ్ ను ఆయన భార్యా కూతురుని కూడా బగ్గీపై వెళుతుండగా భందించి బహిరంగంగా చంపేశారని రాసివుంది.
అధికారులను ఈ అలంబేగ్ ఎంత గడగడ లాడించాడో, ప్రధాన రహదారిని తన స్వాధీనంలోకి తెచ్చుకోవడంద్వారా ఎంత వీరుడో వ్యూహకర్తో మనం అర్ధం చేసుకోవచ్చు. ఆయనకు వాళ్లెంత భయపడ్డారంటే ఒకసీతారామరాజు, ఒక భగత్ సింగ్, మరో సుభాష్ చంద్రబోస్ లాంటి వారు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు వారు రగిలించే స్పూర్తి మరెన్నో వీరసైనిక పటాలాలను తయారు చేస్తాయి. మరెవరూ ఇతనిలా తిరుగుబాటు చేయకుండా కనీసం అటువంటి ఆలోచన వస్తే భయపడేలా వీరసైనికుడు అలంబేగ్ తలను ప్రదర్శనగా వుంచి వుంటారు. ఎవరన్నా ఎదురుతిరిగితే మీకు ఇదే గతి అని చెప్పేందుకు భారతీయ యుద్ధ విధానాలలో కూడా తలను కోటగుమ్మానికి కట్టడం వంటి చర్యలు వుండేవి. ఆ పుర్రెను కూడా అలాగే ప్రదర్సించారు. విప్లవకారుల శిక్షలను వారి గొప్పదనంగా చూపించే ప్రదర్శన శాలనే వుంచారో, ప్రదర్శనా వస్తువుగా కేవలం ఇతని తలనే వుంచారో అలా ఎన్ని తరాలు దాచారో కానీ మనం మ్యూజియంలోని వస్తువుల వివరాలను బోర్డులుగా రాసిపెట్టినట్లు ఒక కాగితంపై ఇతనిగురించి రాసి పెట్టిన ఆ కాగిత చివరికి అలా కంటిరంద్రంలో గుచ్చివుంచడంతో కథ తెలిసింది. పాపం ఈ సైనికుడు ఎన్నాళ్ళు ఎదురుచూసాడో తన వీరత్వం ఇలా దేశద్రోహంగానే మిగిలిపోకుండా తనవాళ్లకోసం చేసిన పోరాటంగా తెలియాలని మధనపడ్డాడో మరి. ఇలా ఆ కాగితం ఒక చరిత్ర కారుని చేతిలో పడింది.














ఈ వీరసైనికుడి పుర్రె ఎక్కడినుంచి ఇక్కడిదాకా చేరింది? 1857లో సిపాయిల తిరుగుబాటు అనంతరం ఒక స్కాటిష్ మతగురువుల కుటుంబం మొత్తాన్ని అలంబేగ్ దారుణంగా చంపేశాడు అన్న ఆరోపణలతో బ్రిటీష్ పాలకులు ఆయనను చంపేశారు(వాళ్ల భాషలో మరణశిక్ష విధించారు) చిత్రంగా ఈ అలంబేగ్ అప్పటికి ఈస్ట్ ఇండియా కంపెనీలో హవల్దార్ సైనికుడిగా వుండేవాడు. ఈ హవల్దార్ అనే హోదాను సూచించే మాటను ఇండియా పాకిస్థాన్ లలో వాడతారు. అంటే కోటకు కాపలాదారుడు లేదా రక్షకుడు అనే అర్ధం వుంది. తమ ఉద్యోగే అయినప్పటికీ నేరాన్ని తీవ్రంగానే పరిగణించారు. కేవలం ఉరి, విషప్రయోగం, ఎలక్ట్రిక్ చైర్ లాంటి సునాయాస మరణ పద్దతులు కాకుండా అప్పట్లో అమల్లో ఉన్న మరోరకమైన మరణ శిక్ష పద్దతి పిరంగి గుండుకు ఎదురుగా కట్టి శరీరం తునాతునకలయ్యేలా పేల్చివేయడం అనే శిక్ష విధించారు. ఇది ప్రత్యేకంగా తిరుగుబాటు దార్లకు వేసే శిక్ష మరెవరన్నా అతని అభిమానులూ, అనుచరులూ వుంటే కనీసం తలెత్తే ధైర్యం చేయకుండా ఇదని హృదయవిదారకమైన చావు వారిలో భయం కలిగించాలనేది శిక్షవెనకున్న ఉద్దేశ్యం కావచ్చు.  వారి రెజిమెంట్ లోనే చేస్తూ దళాన్ని తయారుచేసుకుని వారి ప్రధాన స్థావరాలపై దాడిచేయగల వ్యూహరచన చేసి చివరికి మరణాన్ని స్వీకరించిన ఆ వీరసైనికుడు దేశాన్ని ఏం కోరుకుని వుంటాడు. కనీసం తన త్యాగం తర్వాతి తరాలకు తెలిస్తే చాలని మనస్పూర్తిగా మళ్లీ మళ్లీ ప్రార్ధించి వుంటాడు. అవి ఇలా ఫలించాయి.











బేగ్ ను ఫిరంగితో కాల్చి చంపిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి కెప్టెన్ కాస్టెల్లో [ Captain (AR) Costello (late Capt. 7th Drag. Guards), who was on duty when Alum Bheg was executed]  ఆ పుర్రెను ఇంగ్లాడుకు తీసుకొచ్చాడు. తర్వాత ఎన్ని చేతులు మారిందో ఎక్కడెక్కడ తిరిగిందో కానీ చివరకు ఆ పబ్ కు చేరి కొట్టుగదికి వచ్చింది. 1963లో కెంట్ లోని ఈ పబ్ ను ఒక వ్యక్తి కొనుక్కుని బాగుచేయిస్తుంటే ఈ పుర్రె వెలుగుచూసింది. 160 ఏళ్ల తర్వాత ఆ పుర్రె తన కథనుప్రపంచంతో చెప్పటం మొదలేసింది.  











కిమ్ వాగ్నర్ ఈ కథను ఒక పుస్తకంగా రాసేశాడు : మా దేశ సైనికుడు కాదులే, పైగా మా వాళ్ల చేత శిక్షవిధించబడ్డవాడు అనుకుంటూ చరిత్రకారుడు వాగ్నర్ అలంబేగ్ కథను కేవలం ఒక చాప్టర్ లో పొడిపొడిగా చెప్పి వదిలెయ్యలేదు. అలంబేగ్ గురించి ఆ సంఘటన గురించి ఎన్నో ఎన్నో వివరాలను అనేక ఆధారలను తవ్వుకుంటూ సేకరించాడు. ఆయన పరిశోధనలో తేలిన విషయాల ప్రకారం అలంబేగ్ చనిపోయే నాటికి కేవలం 32 సంవత్సరాల యువకుడు. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తును కలిగివుండేవాడు. ఈ పేరు కూడా అలీం బేగ్ అయ్యివుంటుందని ఉత్తర భారతదేశాని చెందిన సున్ని ముస్లిం అయివుండొచ్చని వాగ్నర్ అభిప్రాయ పడుతున్నారు. ఈ వీర సైనికుడు బెంగాల్ రెజిమెంట్ లో చేసేవాడు. 1858 లో ఈయనను చంపేశారు. చంపిన ప్రాంతం సియాల్ కోట(Sialkot ) ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్థాన్ లోని పంజాబ్ లోవుంది.   దేశద్రోహం అయితే కేవలం ఆ వ్యక్తికే మరణ శిక్ష విధించాలి. మరి అలంబేగ్ అప్పటి పాలకులను ఎంతగా గడగడలాడించాడో, ఆయన చర్యలతో ఎంతగా దడదడలాడించాడో కానీ అలంబేగ్ తోపాటు ఆయన భార్యా కూతురిని కూడా పాలకులు చంపేశారు. అందుకే కనీసం ఆయన వారసులుగా ఆయన కథను చెప్పుకునే వారు మిగిలినట్లులేరు. మనిషిని కుటుంబంతో సహా  అయితే చంపేశారు కానీ నిజాన్ని చంపలేరుగా. అందుకే అది ఇలా వందల ఏళ్ల తర్వాత మళ్లీ బ్రతికొచ్చింది. వాగ్నర్‌ కూడా ఆ కథను అంతటితో ముగిసిపోనివ్వదలచుకోలేదు. ఆయన పుస్తకంగా ఈ కథను రాస్తూ దానికి  ద స్కల్‌ ఆఫ్‌ ఆలం బాగ్‌( ద లైఫ్‌ ఆండ్‌ డెత్‌ ఆఫ్‌ ఏ రెబల్‌ ఆఫ్‌ 1857) అనే పేరుతో విడుదల చేసారు. అలంబేగ్ కపాలం : 1857 విప్లవకారుని జీవన్మరణాలు అనే ఈ పుస్తకం కేవలం చరిత్రగానే కాక ఇప్పుడొక సంచలనమైన అంశంగా మారింది.











ఆ పుర్రెను భారత్ కు పంపాలి : వాగ్నర్ పుస్తకం రాయడంతోనే కూడా ఆగలేదు అక్కడి అధికారులకు ప్రత్యేక అభ్యర్దనలు పంపారు. సదస్సులో ఈ విషయాన్న నొక్కి చెపుతున్నారు. అలంబేగ్ భారతీయ వీరసైనికుడు అబద్దపు అభియేగాలతో అసువులు బాసాడు. ఆయన పుర్రెను కనీసం ఇప్పటికైనా భారతదేశానికి పంపండి. అక్కడ సగౌరవంగా అంత్యక్రియలు జరిగేలా చూడటం ద్వారా ఈ వీరసైనికుడి త్యాగానికి తగిన గౌరవం దొరకాలి.
భారతదేశ చరిత్రలో మిస్ అయిన ఈ చరిత్రకారుని ఉదంతం కనీసం ఒక పేజీగా జతపడాలి. అంటూ వాగ్నర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కథని అక్కడక్కడా కొంత కొంత చదివిన తర్వాత నాకు చాలా పెద్ద అనుమానం ఏమిటంటే వాగ్నర్ పట్టించుకున్నాడు సరే మరి మన భారతీయ మీడియా కానీ ప్రభుత్వం కానీ పుస్తకమంత అంశాలకు ఇస్తున్న కవరేజ్ ఎంత? దీనిలో నిజానిజాలు వెలికితీయడం కోసం చేస్తున్న కృషి ఎంత? వాగ్నర్ చెప్పాడు కాబట్టి నమ్మటమే కాకుండా ఆయన చూపుతున్న ఆధారాలన్నీ పుస్తకంలో ఇచ్చాడు వాటిని జాగ్రత్తగా సరిచూసుకుని నిజలను నిగ్గుతేల్చుకుంటూ అలంబేగ్ వీరత్వమూ త్యాగమూ నిజమే అయితే తగిన చర్యలకోసం ఎందుకు కృషిచెయ్యడం లేదు? అలా చెయ్యల్సిన అవసరం వుందని మేధావులు ఎందుకు సూచించడం లేదు?





కామెంట్‌లు