దేవుడు కనిపిస్తాడా ?


దీనిపై మన సాధారణ చర్చలకంటే చాలా లోతైన, శాస్త్రబద్దమైన చర్చే జరిగినట్లు ఉపనిషద్ సారాలలో తెలుస్తోంది.
కేనోపనిషత్తు ద్వితీయఖండంలో శిష్యుని ప్రశ్నకు సమాధానంగా గురువు చెప్పిన బ్రహ్మసాక్షాత్కార రహస్యం ఇలా వుంది.

అస్య బ్రహ్మణ: యద్ రూపం(తత్)
త్వం సువేదేతి యది మన్యసే
నూనం దభ్రమేవ వేత్థ. అథను దేవేషు
అస్య యద్ (రూపం) విదితం తదపి త్వం నున్యసే
సువేదేతి తే మీమాంస్యమేవ మన్యే

(పదపదార్ధాన్ని కాదు కానీ విశ్లేషణ ఏమిచ్చారో కొంచెం వివరణాత్మకంగా చూస్తే)
ప్రత్యక్షం కావడం అంటే సినిమాల్లో ఎన్టీవోడు డింగ్ మని కెమేరా ముందుకొచ్చి ‘ భక్తా ఏమి నీ కోరిక’ అని అడగటం కాదు. లేకపోతే ‘నరుడా ఓ నరుడా ఏమి కోరికా ’అని గంతులేయడమూ కాదు.
ఇంద్రియాల ద్వారా తెలియటం లో ఆలోచిస్తే రూపం మాత్రమే కంటికి కనిపిస్తుంది. మీకు తీపిని తెలుసుకున్నారా? అని అడిగితే అవును నా కంటికి కనిపించింది అని చెప్పరు. దానిని గుర్తించే సాధనానికి తెలియాల్సిన పద్దతిలో తెలిసిందో లేదో చూస్తారు. అంటే తీపి తెలియటం అంటే నాలుకకు ప్రత్యక్షం గా తాకించటం ద్వారా తెలియడమే కదా. అలాగే చక్కటి సంగీతమో, వీనుల విందైనా శబ్దమో మీకు తెలిసిందా? అంటే అది కూడా కళ్ళముందు కదలాడటం కాదు. నునుపో చల్లదనమో తెలియడం అంటే అదికూడా మరేదో ఇంద్రియ గోచరం కావడమే కానీ కేవలం కంటికి సంభందించిన గొడవ మాత్రమే కాదు. ఇది ఇంద్రియాలకు తెలియటం గొడవ.

ఇక పోతే రేడియో తరంగాలు వున్నాయని మీరెరుగుదురా? అంటే సమాధానం చెప్పేందుకు ఇంద్రియసామర్ధ్యం మాత్రమే సరిపోదు ఇంద్రియానికి అతీతమైన రేడియో తరంగాలు, పరారుణ కిరణాలు ( Infra Red), అతినీలలోహిత కిరణాలు ( Ultra violet) లాంటి వాటిని గుర్తెరగాలంటే మరేదో సాధనం సహాయాన్ని తీసుకుని ఇంద్రియాల శక్తికి అందేలా చేసుకుని గుర్తిస్తున్నాం.

కరుణ,ప్రేమ, వాత్సల్యం లాంటి అభౌతికాంశాలను, అబ్ స్ట్రాక్ట్ అంశాలనూ మనో విశ్లేషణలతో గర్తించామని చెపుతున్నాం. ఏదో సినిమాలో బ్రహ్మనందం అడిగినట్లు ‘‘ ఏదే నా మీద ప్రేమను చూపించు, ఇప్పుడు చూపించు ’’ అని రోడ్డు మీద వీరంగం ఆడితే గబుక్కున జేబులోంచో, సంచీలోంచో తీసి దడాలున చూపించేది కూడా కాదు.

మరి భగవంతుడు / సృష్టికర్త / సృష్టికారకుడు / ఇంకా... వగైరా వగైరా వున్నాడనో (నిశ్చయం), వున్నాడేమోననో ( అనుమానం), ఖచ్చితంగా లేడనో అనుకోవాలంటే ఏం తెలియాలి ??

ఏ లక్షణము లేదా ధర్మము ద్యారా తనని గుర్తించే వీలుందో ఆ లక్షణాన్ని గుర్తించటమే తన రూపాన్ని తెలుసుకోవటం అని చెపుతుంది. పై సమాధానం అతడు ఇంద్రియాలకు అలభ్యుడని (కేవలం మహద్ వాచకంగా సౌలభ్యం కోసం వాడుతున్నాను) ఇతర సాధనాలకు దొరకడనీ చెపుతున్నారు.

డామిట్ మాకు అర్ధం కానిదే మేం గుర్తించం. కుదిరితే ప్రెండ్ రిక్వెస్ట్ పంపమనండి చాట్ చేసి తేల్చుకుంటాం. ఫేక్ ఐడీ నో ఒరిజినలో నని అంతే దట్సాల్..

కామెంట్‌లు

  1. ఫేసు బుక్కులో ఉన్న ఫేమస్ వాళ్లే మనకి తెలిసిన సాధనాల ద్వారానే అక్కడ ఉన్నారని తెలుసుకోగలం. ఇక తెలియనివాళ్లు అక్కడే ఉన్నా మనకి దృగ్గోచరం కాదు కదా....ఇది కూడా అలాంటిదే. కాకపోతే మనని గమనిస్తున్నవారు, మనని ఫాలో అయ్యేవారు మనకి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపకుండానే ఫాలో అవడం చూస్తూనే ఉన్నాం. ఈ దేవుడు కూడా మనకి కనిపించని నేస్తం అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  2. పరారుణ కిరణాల్నీ, అతినీలలోతిత కిరణాల్నీ గుర్తించే సాధనాలున్నాయి. ఆ సాధనాలు మీవద్దనుంటే వాటిని మీరు 'చూడ'గలగటమేకాక ఇంకొకరికి 'చూపించ'గలరుకూడా.

    అదే దేవుడిని 'చూడాలంటే'మాత్రం ముందుగా దేవుడు ఉన్నాడని నమ్మి ప్రయత్నించాలి అని చెబుతారు. నిజజీవితంలో దేన్నీ ఇలా ప్రయత్నించం మరి దేవుడినిమాత్రం రుజువుకు ముందే ఎందుకు నమ్మాలి? పోనీ అప్పుడైనా 'కనబడ'తాడా? లేదు. కనబడ్డట్టుగా మనకి మనం అదేపనిగా చెప్పుకుంటూ ఉండాలి. సృష్టిలో ప్రతి ఒక్కదాన్నీ అది ఉన్నది అనే అనుకోలుతో సంబంధమేలేకుండా దర్శించవచ్చు (పోనీ తెలుసుకోవచ్చు) ఒక్క దేవుడు, దయ్యం తప్ప.

    ఓపని చేద్దామండీ. నా గదిలో ఒక రెక్కల గుర్రం ఉంది, అది ఎవరికీ కనబడదు, అది సవ్వడికూడా చెయ్యదు కాబట్టి వినబడదు, దానికి శరీరమే లేదుకాబట్టి అది చేతికి తగలదు అని చెప్పాననుకోండి. నన్ను మోసగాడు/మోసగత్తె అంటారు. లేదా స్కీజోఫ్రెనిక్ అంటారు. రెక్కలగుర్రం బదులు దేవుడు అనిచెప్పాననుకోండి, అప్పుడు మాత్రం స్వామి/దేవి/మాత అనో, ఇంకేదో అనో పిలుస్తారు. అంతే తేడా.

    రిప్లయితొలగించండి
  3. రామకృష్ణ పరమహంస గారిని నరేంద్రుడు దేవుడు వున్నాడా? మీరు చూచారా? అని అడిగినపుడు.
    నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూచాను నీకూ చూపించగలను అన్నారు. ఆయన పదే పదే చెప్పిందీ అదే..దేవుడున్నాడు చూచే ప్రయత్నం చేయండి అని.
    ఆయన్ని చూడాలంటే దానికి ఓ విద్య వుంది. అదే ఆధ్యాత్మ విద్య.
    సంగీతం అనుభఙ్ఞులైన గురువు దగ్గర నేర్చుకుంటే తప్ప రానట్టు ఇదీ అంతే. నమ్మకం లేకపోతే పోనివ్వండి, మనకి తెలియని విషయం గురించి తెలిసినట్లు మాట్లాడటం మనకెప్పుడు మంచి చెయ్యదు....

    ఋజువుకు ముందే నమ్మమని మిమ్మల్నెవరూ బలవంతం చేయరు.
    మనం ఫలానా వస్తువుని/విషయాన్ని అనుభవించాలంటే మనకి మనమే అనుభవించి తెలుసుకోవాలి తప్ప, ఇంకొకరి అనుభవాల్ని మనం స్వంతం చేసుకోలేం. దృశ్యాన్ని వినలేం, సంగీతాన్ని చూడలేం, వాసనని స్పర్శ ద్వారా గ్రహించలేం, స్పర్శని ఆఘ్రాణించలేం, రుచిని ముక్కు ద్వారా తెలుసుకోలేం. ప్రత్యేకించి ఫలానా ఇంద్రియానుభూతినిచ్చే విషయాన్ని/వస్తువుని దాని సంబంధిత ఇంద్రియాన్ని ఉపయోగించి తెలుసుకోగలం తప్ప మరొక ఇంద్రియం ద్వారా ఆ అనుభవం గ్రహించలేం, అవునా! అలాగే భగవంతుడ్ని గ్రహించడానికి మనకి వున్న ఒకే ఒక ఉపకరణం మనసు. అదెక్కడుందో, ఎలా వుంటుందో, దాని పనేమిటో తెలుసుకుంటే, దానికి ప్రత్యేక శిక్షణ ఇస్తే - దానికి పవిత్రత, ఏకాగ్రత అనే సగుణాలు అభ్యాసం చేయిస్తే అప్పుడు మీరు నిరూపణ అడిగిన వారి గురించి స్వయంగా మీరే తెలుసుకోవచ్చు - మీరు ఒక ఉపకరణంలా మారి మరొకరి అట్టి అనుభవాల్ని ఇవ్వవచ్చు. వీటన్నిటిని సాధ్యం చేసేదే సాధన, దీనికి గురువు, శిష్యుడు, సాధన, ఓర్పు, సహనం, నిరీక్షణ, శ్రద్ధ, తెగువ, పట్టుదల అవసరం.

    శ్రద్ధావాన్‌ లభతే విద్య - వున్నాడా, లేడా! అనే కాలక్షేపం రాయుళ్లకి, వుంటే ఎంత లేకపోతే ఎంత అనుకునే మహిళామణులకి....సమాధానం చెప్పాల్సిన అవసరం భగవంతుడికి లేదనే అనుకుంటున్నాను. సరదాలు అభివృద్ధికి ఆటంకాలు. అభివృద్ధి చెందాలంటే శ్రమని నమ్ముకోవాలి. దేని కోసం శ్రమిస్తే అది దొరుకుంతుందిక్కడ.........అదే మనం నివశిస్తున్న భూమి మీద.

    రిప్లయితొలగించండి
  4. దృశ్యాన్ని, సంగీతాన్ని, వాసనని, స్పర్శని, రుచిని తెలుసుకోవడానికి పంచేంద్రియాలున్నాయి. మనసు ఇంద్రియం కాదు. అది భ్రమలను కల్పిస్తుందని, చంచలమైనదని, దానితో జాగరూకతతో మెలగవలసిఉన్నదనీ చెబుతారు. దేవుడు మాత్రం మనసు కల్పించే ఒక భ్రమ కాదని, మీరంటున్న సాధన చంచల మనసును ఆ భ్రమ పైనే మనసును లగ్నం చేసే ఒక ప్రయత్నంకాదని ఎలా నమ్మటం?

    అలౌకికానందాన్ని దేవుడి ప్ర్ఫత్యక్షంగా భ్రమిస్తున్నారంటాను. ఇదే అలౌకికానందం మెదడులోని కొన్ని భాగాలను కృత్రిమంగా ప్రేరేపించినప్పుడు, కొన్ని మత్తుపదార్ధాలు తీసుకున్నప్పుడు కూడా కలుగుతుంది. సాధన ఆప్రక్రియలకి ప్రత్యామ్నాయం మాత్రమే. దేవుడైనా మరోటైనా దానికి భౌతిక అనువర్తనాలు లేనప్పుడు, ఖచ్చితమైన ఋజువులు లేనప్పుదు దానికి ఎక్కువ విలువనివ్వడం అనవసరం అని నా అభిప్రాయం.

    "మనకి తెలియని విషయం గురించి తెలిసినట్లు మాట్లాడటం", "కాలక్షేపం రాయుళ్లకి, వుంటే ఎంత లేకపోతే ఎంత అనుకునే మహిళామణులకి....సమాధానం చెప్పాల్సిన అవసరం భగవంతుడికి లేదనే" ఇవి అనవసరమైన మాటలు. భ్రమలో ఉన్నవారికి ఆ భ్రమే లోకమౌతుంది. అది భ్రమ మాత్రమే అని తెలిపేవారిపై మీకే ఏమీ తెలీదు తరహా విమర్శలు రావడం సహజమే. ఇక కాలక్షేపం విషయానికొస్తే, దైవంకోసం చేసే ప్రయోజనాలవల్ల ఒక్క వస్తువన్నా ఉత్పత్తి అవుతుందా? ఇదంతా శ్రమ దండుగ కాదంటారా? జపాన్ లాంటి దేశాల్లో డెభై ఏళ్ళవాళ్ళుకూడా ఉత్పత్తి రంగంలో పాలుపంచుకుంటుంటే మనదగ్గర యాభై ఏళ్ళకే భజనలకూ, భక్తి కార్యక్రమాలకూ అంకితమౌతారు. ఇది మాత్రం కాలక్షేపంకాదంటారూ? యువకులకి మత్తు పదార్ధాల వ్యసనం. వృధ్ధులకి దేవుడి వ్యసనం. ఈ ఇద్దరు వ్యసనపరులవల్లా సమాజానికి ఏం మేలుజరుగుతున్నట్లు? స్థూల జాతీయీత్పత్తికి వీళ్ళ చేర్పాటు ఎంత అన్నట్లు?

    శెలవు

    రిప్లయితొలగించండి
  5. భ్రమని కల్పించేది మనసు కాదు. అది చంచలమైనదీ కాదు. అది మీరెలా తయారుచేస్తే అలా తయారవుతుంది. ఉదాహరణకి ఏకాగ్రత అనేది కూడా మనసు లక్షణమే. ఒక శాస్త్రం పై పూర్తి అవగాహనకి రావాలంటే ఆ శాస్త్రంలో ఉన్నత స్థితిని చేరిన వారి అనుభవాల్ని పరిశోధించి తెలుసుకొవడమే కాక వారి సాధనలు మనమూ అనుష్ఠించి తెలుసుకోవాలి తప్ప - నాలుగు పుస్తకాలు చదివి, నలుగురు అనుభవలేమితో బాధపడేవారితో చర్చించి మనకు తెలిసిన మిడిమిడి ఙ్ఞానం ద్వారా శాస్త్రవాక్యాలు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయకూడదు.

    తాగుబోతు పొందేది అలౌకిక ఆనందం కాదు......వాస్తవాన్ని మరవడం, లోకాన్ని మరవడం రెండు భిన్నమైన అనుభవాలు. ఒక తాగుబోతు ఆనందం, ఒక యోగి పొందుతున్న ఆనందం రెండూ ఒకటే ఐన పక్షంలో శిరిడీ సాయి బాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి మహాయోగులు ఉబ్బసం, కాన్సరు రోగాలను అనుభవిస్తూ వాటి నుండి బయటపడటానికి మత్తు పదార్ధాల సేవనమో, ఆధునిక వైద్య చికిత్సలో చేయించుకోలేదు. జస్ట్‌ అనుభవించారు....మనం ఆనందాన్ని అనుభవించినంత తేలిగ్గా వారు బాధని అనుభవించారు. ఇతరుల రోగాల్ని నయం చేశారు. తాము సర్వఙ్ఞులమని, సర్వ సమర్ధులమని, సర్వ వ్యాపకత్వం తమ సహజ లక్షణమని నిరూపించారు. ఇలా తాగుబోతులు, తిరుగుబోతులు, మత్తు పదార్ధాలని సేవించేవారు చేయగలరని నేను కలలో కూడా భావించలేను....మీరు చెప్తున్నట్లు మనిషి ఒక యోగిగా మారాలి అంటే మెదడులో కొన్ని ప్రత్యేక భాగాల్ని ఉద్దీపనం చేస్తే సరిపోయినట్లైతే.......మిలరేపా, నరోపా, సిద్ధారూడ స్వామి, శిరిడీ సాయి లాంటి యోగులు ఏళ్ల తరబడి నిరాహారులై, గురుసేవ కోసం సర్వం త్యజించి నానా కష్టాలు, బాధలు భరించి, అందరినీ, అన్నిటినీ ఒదులుకుని యోగులవడం దండగని యోగులయ్యాకైనా మీరు చెప్పిన విషయం తెలుసుకునే వారేనే......తమ తమ శిష్యులకి మెదడులోని ఆ ప్రత్యేకప్రాంతాల గురించి చెప్పి సులువైన పద్ధతులు ఆవిష్కరించేలా చేసేవారేనే. కనీసం వారి శిష్యులకి కూడా వారు అలాంటి పద్ధతులు సూచించినట్లు ఎక్కడా నేనైతే గమనించలేదు....వారు సాధన చేసిన పద్ధతుల్నే వారి శిష్యులకు ఉపదేశించారు.

    భ్రమలో వున్నవారికి భ్రమే లోకం ఐనట్లు...సత్యంలో ఐక్యమైన వారికి సత్యమే లోకం అవుతుంది. మీకు అనవసరం అనిపించిన మాటలు మరొకరికి అవసరం కావచ్చు, మీ అనుభవాన్ని నేనెలా ప్రామాణికంగా తీసుకోగలను. మీకు నచ్చని విషయం మర్చిపోయే మధురమైన అవకాశం మీకు భగవంతుడు కల్పించాడు లేదూ మీరన్నట్లు మీ మెదడు కల్పించింది.

    దైవం కోసం చేసే పనుల వల్ల వస్తువులు ఉత్తత్తి అవుతాయా లేదా అన్నది పక్కన పెడితే......ఒక యోగి ఇంకో యోగిని తయారు చేయగలడు. అలా తయారైన యోగులు తరతరాలకి ప్రేరణని ఇవ్వగలరు....ఒక్కరి పేరు మాత్రం చెప్తాను......స్వామి వివేకానంద. మనం చేస్తున్న పని గురించి మనకి పూర్తి అవగాహన వుంటే అది దండగమారి పనో.....దేశాన్ని ఉద్దరించే పనో......తెలుసుకోవచ్చు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి