కదిరిలో ప్రేమకథ : 15 శతాబ్ధం నాటి చంద్రవదన, మొహియార్ లది

అది 15వ శతాబ్దం విజయనగర మహా సామ్రాజ్యంలో ఒకానొక సామంత రాజు శ్రీరంగరాయులు ఆయనగారికి ఏకైక గారాల పుత్రిక చంద్రవదన. ఆమె కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు వచ్చి పూజలు చేసి వెళుతుండేది. ఒకనాడు పర్షియా వజ్రాల వ్యాపారి అయిన మొహియార్‌ దుకాణం ముందునుంచే వెళ్లింది. ఆమె దృష్టి వజ్రాలకన్నా వాటిని విక్రయిస్తున్న మొహియార్‌పైన పడింది. అతని ఠీవి, దర్పాన్ని చూస్తూ, ఆమె పులకితురాలైంది. అతను కూడా చంద్రవదన అందాన్ని చూసి , గుండెల్లో ముద్రవేసుకున్నాడు.పరస్పర ఆకర్షణల మధ్య మధుర ప్రేమలు పంచుకున్నారు. ఆమె బాహ్యప్రపంచంలోకి వచ్చి తనస్థితినీ,స్థాయినీ గుర్తుతెచ్చుకుని వేగంగా కదిలి తన నివాసమందిరానికి వెళ్లింది. కాని మనసు మొహియార్‌ చుట్టూ తిరుగుతూనే వుంది. కొన్ని నిముషాలు మెరుపులా మెరిసి తనమదిలో ముద్రపడిన చంద్రవదనని మొహియార్‌ మరవలేక పోయాడు. ఆ తరువాత రోజులన్నీ అతన్ని పిచ్చివాడిగా మార్చాయి. ప్రతీక్షణం చంద్రవదనే మదిలో తలపురేపుతూ. నిద్రాహారాలను దూరం చేసింది. అంతఃపురంలో చంద్రవదన పరిస్థితీ అలానే వుంది. కానీ తన స్థాయి వేరు మతం వేరు. తన ప్రేమకు అర్థం లేదని భావించింది. ప్రేమను మరిచిపోవడానికి మనసు రాక విలవిలలాడింది.

ఒకరోజు మొహియార్‌ చంద్రవదనని ఎలాగైనా చూడాలని గాఢమైన కోరికతో ఆమె అంతఃపుర భవనం ముందుకు వచ్చాడు. అక్కడ రాజభటులు అతన్ని అడ్డగించారు. అతను చంద్రవదన ప్రేమతో పిచ్చివాడిగా మారి ఆమెనే కలవరిస్తుండటంతో రాజభటులు అతని మాటలు విని పిచ్చివాడిగా భావించి బలవంతంగా అతన్ని తోసేస్తారు. అతను ప్రక్కనవున్న గోడకు తలపగిలి అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.

గొడవంతా తెలిసిన శ్రీరంగనాయకులు స్వయంగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. మొహియార్‌ చనిపోయాడని తెలిసిన చంద్రవదన కూడా అక్కడికి వచ్చి మొహియార్‌ శరీరంపై పడిపోయి ప్రాణాలు విడిచింది. ఇదంతా చూసిన శ్రీరంగనాయకులు మొదట వారిద్దరి ప్రేమను అర్థం చేసుకుని తన కొలువులోని గురువులు, పెద్దలను సంప్రదించి అందరి ఆమోదంతో చంద్రవదన, మొహియార్‌ల శవాలను ఒకే ప్రదేశంలో ఖననం చేయించదలచి ముస్లింలతో హిందువుల సమైఖ్యతను చాటుతూ వారి సమాధులను అటు హిందూ, ఇటు ముస్లిం సంప్రదాయ ప్రకారం నిర్మించాడు. ఆనాటి పాతర్లపట్నమే నేటి కదిరిని అప్పుడు ఖాద్రి అనేవారు.

13వ శతాబ్దంలో శ్రీరంగరాయల పూర్వీకుడు రంగనాతిప్పానాయుడు శ్రీఖాద్రి అనే పేరుతో పట్టణం నిర్మించాడని చెపుతారు. శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం నాలుగు గోపురాలలో ఒక గోపురాన్ని టిప్పుసుల్తాన్‌ కాలంలో ముస్లిం పాలకులు నిర్మించారు.చంద్రవదన మొహియార్‌ల సమాథి మందిరాన్ని అటు ముస్లింలు ఇటు హిందువులు, అనేక మంది సందర్శించి తమ ప్రేమలు ఫలించాలని మొక్కుకుంటారు.

మొహియార్ శవాన్ని అంత్యక్రియలకోసం తీసుకెళదామని ఎంతమంది వచ్చి కదిపినా అది కదలలేదనీ చివరికి ఘోర దుఖంలోఉన్న చంద్రవదన వచ్చి ఆతని శవాన్ని తాకినమీదటనే దానిని లేపగలిగారనీ, చంద్రవదనకూడా మొహియార్ తో ఎడబాటును సహించలేక అతనితోపాటు సజీవసమాధి అయ్యిందనీ,వారిది దైవికమైన అమరప్రేమగా అక్కడి ప్రజలు భావించారనీ మరో కధ ప్రచారంలో ఉంది.

వీరి సమాధి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలోని ముస్లిముల స్మశానస్థలంలో ఉంది.తాము ఆజన్మాంతమూ విడిపోకూడదనుకునే ప్రేమికులూ దంపతులు కూడా ఈ సమాధిపై ఉంచిన కుంకుమను నేటికీ భక్తిశ్రద్ధలతో తీసుకెళుతుంటారు". చంద్రవదన మొహియార్ అమరప్రేమ గాధ కదిరిలో జరిగిన యధార్ద సంఘటన. వీరి ప్రేమ గాధ మతసామరస్యానికి ప్రతీక. వీరిప్రేమకు గుర్తుగా కదిరి పురపాలక సంఘం ఒక ప్రాధమిక పాఠశాలను నెలకొల్పినది.



ఈ విషయాన్ని ఫేస్ బుక్ వాల్ పై చర్చనిర్వహించిన నూర్ భాషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి