గిరిదుర్గం ఖమ్మం ఖిల్లా వెయ్యి సంవత్సరాల సమన్వయ చరిత్ర


ఖమ్మం కోట బయటిగోడ ప్రవేశద్వారం లో
ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలచివున్న ఆది వరాహ రూపం 
ఖమ్మం ప్రాంతం ఇలా రద్దీలేమీ లేని రోజుల్లో వందల సంవత్సరాలు వెనక్కి వెళితే చిన్న చిన్న నివాసాలు, మామూలు రహదారులు ఊరికి మధ్యలో ప్రధానంగా కనిపిస్తూ ఓ పెద్ద గుట్ట, దానిపై నారసింహ స్వామి గుడి అది ఎవరు కట్టించారు ఎప్పటినుండి వుంది అనేవివరాలేమీ తెలియదు. అసలాగుడి ఎప్పుడో త్రేతాయుగం నాటినుంచి కూడా అలాగే వుండేదనికూడా జనాల్లో ఒక నమ్మకం. గుడి అంతా ఒక కొండ శిఖరం మీద వుండగా కొండ క్రింద నిలువుగా వున్న ఒక రాయి స్థంభం లాగా కనిపించేది. అందుకే ఈ ప్రాంతాన్ని స్థంభశిఖరి అని పిలిచేవారు. దూరప్రాంతాలనుంచి గుర్రాలపూ ప్రయాణం చేసుకుంటూ వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నామఫలకాలేమీ చూపించాల్సిన అవసరంలేకుండానే తాము అప్పుడు ప్రవేశించిన వూరు స్థంభ శిఖరి అని చాలా సులభంగా తెలిసిపోయేందుకు కూడా వీలుగా వుండేది. అసలే రాజ్యల స్థిరత్వం తక్కువగా వున్న రోజులు, వీరులు ప్రయాణాలు ఎక్కువగా చేసేరోజులు ఈ ఊరి ప్రత్యేకతలే దూరప్రాంతం వారికి సైతం సులభంగా తెలిసేలా పెట్టుకోవడం ఆనవాయితా ఉండటం ఏమాత్రం ఆశ్చర్యం కాదేమో. చాలా దూరం వరకూ కనిపించే ఆద్యాత్మిక శోభతో విలసిల్లే మహిమాన్వితమని చెప్పబడే శిఖరము. దాని కళను ఇనుమడింపజేస్తూ కీర్తి పతాకాన్ని ఎగరేసేందుకు నిలబడందా అన్నట్లున్న స్థంభము. హిరణ్య కశిపుడిని స్థంభం లోనుంచి బయటకు వెల్వడిన నరసింహుడే చీల్చాడనేదే ఐతిహాసిక కథ కదా. అందుకే నరసింహ క్షేత్రంతో పాటు సహజసిద్దంగానే నిలబడ్డ స్థంభం సైతం జనాలకు ఆరాద్య మయ్యింది. ఖంబా అనేది కూడా స్థంబానికి మరో పర్యాయ పదం. బహుశా తూర్పు సముద్ర తీరపు రేవుల నుంచి దక్కను నేలకొండపల్లి(నెల్కిండా), ఫణిగిరి, కొలనుపాక, వంటి వ్యాపార కేంద్రాలకు చేరుకునే ముఖ్యమైన రహదారిలో పీఠభూమిని ఎక్కే మొదటి మెట్టు, స్తంభగిరి, కంబపురి, కంబం మెట్టు సీమ ప్రాంతాలనుంచి కాకతీయుల సామ్రాజ్య రాజధానిని చేరుకోవాలంటే ఈ ప్రాంతం నుంచే వెళ్ళలి. ఖమ్మం వరకూ వస్తే ఇక ప్రయాణంలో ఓరుగల్లు ప్రాంతానికి చేరుకున్నట్లే అక్కడికోక మెట్టు చేరుకున్నట్లే. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తంగా అప్పట్లో ‘‘ ఖమ్మంమెట్టు’’ అని కూడా పిలిచేవారు. మహాత్మాగాంధీ ఈ ప్రాంతాన్ని సందర్శించినపుడు వార్తలలో గమనించినా, `1953 లో జిల్లాగా ఏర్పడినప్పుటి పేరును గమనించినా ‘ఖమ్మంమెట్టు’ గానే వుంది. తర్వాతి కాలం లోని రెండక్షరాల అపభ్రంశ పేరుతో కేవలం ‘ఖమ్మం’ గా మిగిలింది. ఏదేమైనా అతి చారిత్రకమైన పేరును వేలసంవత్సరాలుగా నిలబెట్టుకుంటూ వస్తున్న ఘనతమాత్రం ఈ జిల్లా ప్రత్యేకం.





నరసింహస్వామి గుట్ట ముందున్న పురాతన తోరణం


అప్పిచ్చువాడు, వైధ్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు లేని చోట నివసించకండని వేమన చెప్పినట్లు అప్పట్లో నగర నిర్మాణానికి కూడా ట్రిపుల్ టి(TTT) పద్దతిని ఖచ్చితంగా పాటించేవారనుకుంటా. టెంపుల్,ట్యాంక్,టౌన్. నీటి పారుదలకు సహజమైన అనుకూలతలు లేనిచోట్ల మిగిలినవి బావుంటే తటాకాలను సైతం అత్యంత ధనాన్ని శ్రమని కాలాన్ని వినియోగించి తవ్వించారు. కానీ ఖమ్మం విషయంలో చారిత్రకమైన గుడి వున్నట్లే నది కూడా సహజంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది. కృష్ణానదికి ఉపనది అయిన మునేరుని ఆనుకుని నగరం విస్తరించింది. అటు కొండపై దేవుడు ఇటు త్రాగేందుకూ, సాగు కార్యక్రమాలతో జీవితాలను సస్యశ్యామలం చేసుకునేందుకు నిరంతరంగా ప్రవహిస్తున్న నీరు. మరింకేం కావాలి రక్షణ కోసం ఒక పటిష్టమైన కోట అంతేకదా? 

భౌగోళికంగా చక్కటి పీఠభూమి ప్రాంతం, పైగా అత్యంత కఠినమైన పురాతనమైన నల్లరాతి నిల్వలున్న ప్రాంతం. నరసింహ స్వామి గుట్టకు కూతవేటు దూరంలో, ఉదయపు దైవనమస్కారాలను ఉదయం కళ్ళు తెరవగానే చేసుకునేంత దగ్గరలో ఒక నల్లరాతి బండల అందమైన కొండ. పెద్దపెద్ద రాళ్ళ తరలింపులేమీ లేకుండా సులభంగా శత్రు దుర్భేద్యమైన నిర్మాణం చేసుకోగల చోటు. 

అది క్రీస్తుశకం 591 ఖమ్మం ప్రాంతాన్ని మహదేవవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మనకి తెలుగు చరిత్రలో కూడా మొట్టమొదటిది అని చెప్పకుంటున్న కలమళ్ల శాసనాన్ని ఎరికల్ ముతురాజు అనే బిరుదు వున్న ధనుంజయుడు వేయించిన కాలం కూడా దీనికో పదిహేనేండ్ల పూర్వం క్రీస్తుశకం 575 కాలం. తెలుగు భాషకు ఎంత పూర్వచరిత్ర వుందో అప్పటినుండి చారిత్రక అస్తిత్వాన్ని బ్రతికించుకుంటూ వస్తున్న ఖమ్మం చరిత్ర నిజంగా గర్వకారణమే. ఈ మహ దేవ వర్మ వంశమే చాలా కాలం క్రమంగా పరిపాలించుకుంటూ వచ్చారట. మహదేవ వర్మ మహారాజు గారి తొమ్మిదవ వంశస్థుడైన మహదేవ రాజు 10వ శతాబ్ధంలో ఖమ్మం రాజ్యపాలన చేశాడు. 



పటిష్టమైన కోట నిర్మాణానికి అనుకోకుండా దొరికిన నిధి సాయం

అప్పుడు ఓరుగల్లు ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలిస్తున్నారు. వెలుగుమట్ల అనే గ్రామంలో ముగ్గురు భూస్వామి రైతులు పొలం పనులు చేయిస్తుండగా వారికి అదృష్ట వశాత్తూ అపార సంపద దొరికింది. నిజమే కదా రాజులకు రాజ్యాలున్నా, సంపదలున్నా దాచుకునేందుకు ఇప్పటిలా పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థలేమీ లేని రోజులు కావడంతోనూ, రాజ్యాలపై దాడులూ, సంపదల దోపిడీలూ ఎక్కువగా వుండటంతోనూ తాము సంపాదించిన ధన,కనకాలను, విలువైన ఆభరణ వస్తు సామగ్రిని నిధి రూపంలోనే వివిధ ప్రదేశాలలో భద్రపరచుకోవలసి వచ్చేది. తమ వారసులకు తెలిపే అవకాశం కూడా మిగలక వారు చనిపోతే ఇలానే ఎవరో ఆ సమయానికి ఆ నిధిని కాలవశాత్తూ కనుక్కోవలసిందిగానే వుండేది. అందుకే ఇప్పటికీ అనేక దేవాలయాను నిధులుంటాయేమో నన్న అనుమానంతో వినాశనం చేస్తున్నారు. 



ఓరుగల్లు ప్రాంతంలో ఇలా పొలం పనుల్లో నిధిని సంపాదించిన ముగ్గురూ రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, వెల్మారెడ్డి ఈ సమాచారాన్ని కాకతీయ ప్రభువుకు తెలియజేసారు. సేద్యంలో దొరికిక ఈ అపార సంపదను మొత్తంగా తీసేసుకోవడం వల్ల వారిలో నిరాశవల్ల వ్యతిరేఖ భావన ఏర్పడుతుంది. లేదూ మొత్తం గా వాడేసుకొమ్మని వదిలేస్తే వృధాఖర్చులతో ప్రజలకు కంటగింపుగా మారే ప్రమాదం కూడా వుంది. అందేకే మహా మంత్రులతో మంతనాలైన పిదప ఈ ముగ్గురు రెడ్లకూ ఒక భాద్యతను అప్పగించి రాజహోదాను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని చేసారు. ధనం దొరకటమే కాదు. ఈ నిర్ణయం కూడా ఖమ్మం చరిత్రకు ఒక చెరిగిపోని మైలు రాయిగా మారింది. అప్పటికే బౌద్దంతో విరాజిల్లుతున్న రాచరిక కేంద్రం నేలకొండపల్లి ప్రాంతానికి దగ్గరలో వుండి, కాకతీయ సామ్రాజ్యానికి ముఖ ప్రాంతంలా వుంటూ, ప్రవహించే నది, జనాల మనసులను కలిపి వుంచే ఆధ్యాత్మిక కేంద్రం వున్న ఖమ్మం ప్రాంతంలో కోట నిర్మాణం అనువుగా వుంటుందని చెప్పారు. నరసింహస్వామి గుట్ట పక్కనే వున్న తమ ఆధినంలోని రాజు పరిపాలనలో వున్న ఖమ్మంరాతిగుట్టమీద ఈ ధనంతో చక్కటి కోట నిర్మాణం చేసి, వారి జీవితాలకూ, వారి పిల్ల పిల్ల తరాలకూ నిలబడిపోయే పేరు తీసుకువచ్చేలా ఈ ధనాన్ని ఖర్చుపెట్టమనే నిర్ణయాన్ని కాకతీయ ప్రభువు చెప్పారు. 

ఈ ముగ్గురు సోదరులు మహారాజు ఆదేశాను సారం నిధిరూపంలో దొరికిన సంపదసాయంతో తమ స్వీయ పర్యవేక్షణలో 950 లో కోట కట్టడం ప్రారంభించారు. మొదట్లో వీరు నిర్మాణం చేసింది సాధారణ మట్టికోట. అయినా సరే సహజంగా ధృఢంగా నిలబడిన రాతి దేహంతో అప్పడైనా ఎంతో శౌర్యప్రతాపాలున్న వీరుడిలాగానే ఈ కోట కనిపించేది. 

ఈ ముగ్గురిలో లక్ష్మరెడ్డి తన ప్రత్యేకమైన శ్రద్దతో కోట పక్కనే ఒక తటాకాన్ని తవ్విచాడు లక్ష్యారెడ్డి చెరువే కాలక్రమాన లకారం చెరువుగా మారివుంటుంది. ఖమ్మం ప్రాంత వాసులు ఈ కోనేరు నీటినే పైపుల ద్వారా మళ్లించుకుని తాగు నీటిని పొందేవారు. నగరానికి జీవాన్ని జవసత్వాలనూ ఇచ్చేందుకూ ఈ కృత్రిమ తటాకం మునేరుకు కొంచెం దూరంగా వున్న ఖిల్లాప్రాంతంలో జనజీవనానికి సౌకర్యాన్ని కల్పించింది. కోటకు సంభందించిన సైన్యంతో పాటు వారి గజతురగాలన్నీ దాహార్తిని తీర్చుకునేందుకు ఇది సమాయకారి అయ్యింది. 

997 లొ పరాక్రమవంతులైన గజపతులతో పాటు ఖమ్మానికి వచ్చిన కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డిలకు తమ పూర్వీక వంశానికి చెందిన వారు నిర్మించిన కోటను మరింత సౌందర్యవంతంగా మరింత శక్తిసామర్ధ్యాలతోనూ నిలబడివుండేలా తయారు చేయాలనిపించింది. తోమ్మిదేళ్ళ పాటు నిరంతరంగా కోట నిర్మాణాన్ని కొనసాగించారు. అదే కొండప్రాంతంలోని నల్లరాతి బండలను నిపుణులైన పనివాళ్ళతో సరైన ఆకారాలలో మలిచి చూట్టూ దుర్భేద్యమైన గోడ, ఆ గోడపై సైతం గుర్రాలతో తిరగేంత వెడల్పుతో దారి. కొండ ప్రాంతం కాబట్టి క్రిందనుంచి నీరు మళ్ళీ మళ్ళీ తొడుకోవటం చాలా క్లిష్టమైన పనిఅవుతుంది కాబట్టి కొటమొత్తంలో పడ్డ వర్షపు నీటిని ఒక్క చుక్కకూడా వృధాగా క్రిందికి కారిపోకుండా ఒడిసిపట్టుకుని ఏన్నో ఎగుడు దిగుళ్ళున్న దుర్గం పై భాగంలో అన్ని వైపుల నీటిని ఒక దగ్గరకు ప్రవహించేలా చేసారు. అలా నీళ్ళను సేకరించుకునే చోటు కూడా అత్యంత సహజంగా రాతి అడుగు భాగాన్నే కలిగివుంటుంది. ఎండతగిలేలా ఏర్పాట్లుకూడా వుండటంతో సంవత్సరం పొడవునా నిల్వవుండే నీరు పాకుడు పట్టిపోకుండా కూడా వుంటుంది. ఈ జలకాసారం వెయ్యిసంవత్సారాల క్రింత నిర్మాణమైనా ఇప్పటికీ అంతే సహజంగా తన నీటి నిల్వ సామర్ధ్యంతో వుంది. 

చట్టూ 60 ఫిరంగులను మోహరించిగల ప్రదేశాలు అక్కడ ఫిరంగి వేర్వేరు దిశల్లో తిప్పి శత్రువుకు ఎక్కుపెట్టే అవకాశం వుంటుంది. అంతే కాకుండా శత్రువుల ఆయుధాలతో క్రిందనుంచి ఈ ఫిరంగులను నాశనం చేయటం దాదాపు అసాధ్యం అనుకునే చోట్లో పెట్టారు. 
పహారా మూలలు, పర్యవేక్షణ రంధ్రాలూ ఎంతో ముందు చూపుతో చేసినవి వున్నాయిక్కడ సాయుదులైన సైనికులు కోట మీదనుండి దూరప్రాంతం వరకూ తమ దృష్టిపరిధినుంచి తప్పించుకోకుండా గమనింపులో వుంచుకునేలా కోటచుట్టూ వున్న వివిధ పహారా మూలలు ఏ ఒక్క దిక్కునూ వదలకుండా మొత్తంగా 360 డిగ్రీలలో చుట్టూ గమనింపులో వుంచుకునేలా వున్నాయి. అంతేకాకుండా సాధారణంగా 45 డిగ్రిలు లేదా క్రింది ప్రాంతం గమనించేందుకు కావలసినంత అనుకూలమైన కోణంలోనూ గోడల్లో అనేక చోట్ల ఈ పర్యవేక్షణ రంధ్రాలున్నాయి వీటిద్వారా కోట క్రింద ఏం జరుగుతోంది అనే విషయాలను జాగ్రత్తగా గమనించే అవకాశం వుంది. 

కొటకు పది ద్వారాలున్నాయి ప్రధానంగా వున్న దర్వాజా రాతితో నిర్మించిన అతి పెద్ద దర్వాజా దీన్ని రాతి దర్వాజా లేదా పోత దర్వాజా అంటారు. దాని తలుపులు అమర్చేందుకు చేసిన రంధ్రాలూ, గడి కర్రలను పెట్టేందుకు గోడలో మిగిల్చిన రంధ్రాలూ ఇప్పటికీ గమనించి వచ్చు. ప్రధాన ద్వారాన్ని ఏనుగులతో ఢీకొట్టించి శత్రువులు పగలగొట్టే అవకాశం లేకుండా ముందు భాగంలో మలుపుని ఏర్పాటు చేసారు. రాతి గోడల పైభాగంలో రామప్పగుడిపై ఇటుకలతో నిర్మాణం చేసినట్లు కొన్ని వరుసల ఇటుక కట్టడం అదనంగా వుంటుంది. ఇప్పడు కోటపై నేతిబావిగా చెప్పబడుతున్న బావి లాంటి ప్రాంతం కాగడాలకు కావలసిన ద్రవ్యాన్ని నిల్వచేసేవారో, లేక నాటు పద్దతిలో చేసిన ఫిరంగులు బాంబులు వంటి వాటికి కావలసిన క్రొవ్వు పదార్ధాన్ని నిల్వవుంచటం వల్ల ఆ పేరు వచ్చిందో చారిత్రక ఆధారసహితంగా నిర్ధారణ కావలసివుంది. లేదా ఆయుధాలు,విలువైన భాండారాలనూ నిల్వవుంచే చోటు కానీ లేదా అత్యవసరపరిస్థితుల్లో రాణీవాసాన్ని తప్పించే సొరంగ మార్గం కానీ కూడా అయ్యివుండవచ్చు. ఒక సొరంగ మార్గం ఇక్కడినుంచి ఓరుగల్లు వరకూ నిర్మించారనే వదంతులు కూడా వున్నాయి. కోటపై నిర్మించిన మహల్ తాలూకు పునాది ఆకారం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. అనేక సార్లు దండయాత్రలతోనూ, విలువైన సంపదలను దోచుకుపోగా, అనేక ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ నిలబడ్డ ఈ నాటి కోటను చూస్తూ మనకి కనిపించే ఈ కొద్ద అంశాలతోనే మనం ఆశ్చర్య పోతున్నాం నిజానికి అప్పట్లో మరెంత ఆశ్చర్చాన్ని కలిగించేంత అధ్భుత సౌందర్యంతో ఈ కోటను కట్టివుండకపోతే శ్రీకృష్ణదేవరాయలంతటి వాడు దీన్ని గెలవాలని చూస్తాడు. షితాబ్ ఖాన్ గా పేరుమార్చుకోవలసి వచ్చిన సీతాపతి దాచిపెట్టితే ఈమధ్య దొరికిన శిల్పాలూ, సంపదకంటే మరెన్ని రెట్ల వెలుగులను ఈ కోట ఒకప్పుడు వెదజల్లివుంటుందో కదా?

కోటవిశేషాలు సంక్షిప్తంగా

► గ్రానైటు రాళ్లతో నిర్మించిన ఈ పఠిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. కోటకు పది ద్వారాలున్నాయి.

► ఖిల్లా ప్రహరీ ఎత్తు 40 నుంచి 80 అడుగులు. వెడల్పు 15 నుంచి 20 అడుగులు.

► పశ్చిమం వైపున్న దిగువకోట ప్రధానద్వారం. తూర్పు వైపున్న ద్వారాన్ని రాతి దర్వాజా లేదా పాత దర్వాజా అంటారు. దీన్నే పోతదర్వాజ అని కూడా పిలుస్తారు.

► ఖిల్లాలోని పది దర్వాజాలలో పత్తార్‌ దర్వాజాగా పిలువబడే సింహద్వారం అతి పెద్దది.

► కోట చుట్టూ 60 ఫిరంగులు మొహరించే వీలుకలదు.

► కోట లోపల జాఫర్‌దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌దౌలా (బావి) ఉంది..

► కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవటానికి ఒక రహస్య సొరంగం కూడా ఉన్నది.

► వర్షపు నీటిని నిలువ చేసుకోవటానికి నీటి కాలువలు కూడా ఉన్నవి.

► ఖిల్లాలోకి ప్రవేశించడానికి రెండు ముఖ ద్వారాలున్నాయి. లోపలి సింహద్వారం చదరంగా ఉండి 30 అడుగుల ఎత్తులో పెద్దపెద్ద రాళ్లతో నిర్మించారు.

► ప్రతి కోట బురుజు (గోడ)పై భాగం 45 అడుగుల వెడల్పుతో లోపలికి దిగడానికి మెట్లు కనబడతాయి.

► ప్రతి బురుజుపైనా రెండు ఫిరంగులున్నాయి. కిలోమీటర్ల దూరంలోని శత్రువును కనిపెట్టే గడీలు నేటికీ సజీవంగా వున్నాయి.

► సింహద్వారం సమీపంలో ఆరు అడుగుల ఫిరంగి ఉంది. ఫిరంగి గుండు తగిలినా చెక్కుచెదరని పటిష్ఠతతో నిర్మించారు ఈ రాతి కట్టడాన్ని.

► కోటగోడలపై ఉన్న చిన్నచిన్న గోడలను జాఫర్ దౌలా (ధంసా) నిర్మించారు.వీటిని ఇటుకలు, సున్నంతో కట్టారు.

► ఖిల్లాలో 80 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద దిగుడు బావి ఉంది. లోపలికి దిగడానికి రాతి మెట్లు ఉన్నాయి.

► కోట సింహందాటి లోపలికి కొద్దిదూరం వెళ్లాక అసలు దుర్గం కన్పిస్తుంది. దీనిపైకి ఎక్కడానికి చిన్న మెట్లు ఉన్నాయి.

► ఈ మార్గంలో చిన్నచిన్న రాతిగోడలతో ద్వారాలున్నాయి. వీటిని దాలోహిస్వారు అంటారు.

► కొండపై కట్టిన ఈ ఖిల్లా విస్తీర్ణం మూడు చదరపు మైళ్లు.

► 15 బురుజులు శత్రుసైన్యం దాడులను తట్టుకునే విధంగా ఒకదానివెంట మరొకటి రెండు గోడలు నిర్మించారు. పెద్దపెద్ద రాళ్లను కోట నిర్మాణంలో నిలువుగా పేర్చి తాటికొయ్య ప్రమాణంలో నిర్మించారు. పక్కరాళ్లు అతకడానికి ఎలాంటి సున్నమూ వాడకపోవడం గమనార్హం. వాటి చుట్టూ లోతైన కందకం తీశారు.

► కాకతీయ పట్టణం ఓరుగల్లు నుంచి ఖమ్మం ఖిల్లా కోటకు సొరంగ మార్గం ఉందని, దాని ద్వారానే రాకపోకలు సాగేవని కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది.

► ఖిల్లాపై లభించిన శాసనాలు, రాతికట్టడాలు, బురుజులు, ఫిరంగులు, అన్ని కాలాల్లోనూ నిండుగా నీరుండే కోనేరు.. ఆరాజుల విజయగాథలను ప్రతిబింబిస్తున్నాయి.

► శత్రుసైన్యాల దాడినుంచి కాపాడుకునేందుకు నిర్మించిన ఈ రాతి కోటలు నిర్మితమై వెయ్యేళ్లు అవుతున్నా పెచ్చులు కూడా ఊడకపోవడం నాటి మానవ సాంకేతిక మేధస్సుకు సంకేతం. గుట్టల మధ్య చెరువులు, పరిపాలనకు అనుగుణంగా భవనాలు, రాజులు, చరిత్రకారులు, నక్షాలు (ప్రణాళిక) రూపొందించిన ఇంజనీర్ల పేర్లూ చెదిరిపోని అక్షరాల్లో దాగున్నాయి.

► కోటలు, చెరువులతో గ్రామాలు నెలకొన్నాయి. కోటలోని భవనాలు, కోనేరులు, ఫిరంగులు నాటి రాచరికాన్ని తెలిపితే.. వాటి చుట్టూ ఉన్న చిన్నచిన్న కోట కట్టడాలు నాటి సైనికుల పనితనానికి కొలమానంగా మిగిలాయి. 

► నాటి కోటల నిర్మాణంలో మనిషితోపాటు సమానపాత్రధారిగా శ్రమించిన ఏనుగులు, గుర్రాల నమూనాలు కోటలముందు నేటికీ కన్పిస్తాయి.



అంతటి శ్రద్ధతో వీరు నిర్మించతలపెట్టిన గిరిదుర్గం క్రీస్తుశకం 1006 సంవత్సరం నాటికి నిర్మాణం పూర్తిచేసారు. నిధిదొరికించుకున్న పుణ్యఫలమో, శ్రధ్దాభక్తులతో నిర్మించిన ఫలితమో ఆ తర్వాత 300 సంవత్సరాల సుధీర్ఘకాలం పాటు రెడ్డి వంశీయుల పాలనలోనే ఖమ్మం ప్రాంతంతో పాటు ఈ గిరిదుర్గం కూడా వుంది. ఆ తర్వాత శౌర్యమున్న వానిదే రాజ్యమన్న సూత్రంతోనే వెలమ రాజులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. . నిర్మాణానంతర అనేక సొబగులను రెడ్డిరాజుల తర్వాత వెలమరాజులు అద్ది ఈ కోటను మరింత మెరుగు పరిచారట. ఆ తర్వాత నందవాణి, కాళ్ళూరు, గుడ్లూరు వంశాల చేతుల్లోకి వెళ్ళింది. కాకతీయులకు రెండో రాజధానిగా మొదట కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం ఖిల్లా తదనంతరం స్వతంత్ర మండలి రాజ్యంగా రూపొందింది. కాకతీయుల సామ్రాజ్యం నశించిపోయిన తర్వాత తెలుగునేలను ఏకం చేయాలనే లక్ష్యంతో 74 మంది సామంతరాజులు ఏకమై ఖమ్మం సమీపంలో ఉన్న మూసురూలి నాయకత్వంలో పదేళ్లపాటు విరోచితంగా పోరాటం జరిపారు. ఓడ్ర గజపతిరాజు ఈ దుర్గాన్ని జయించి 1424లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం మహేంద్ర వీరులైన కాపా నాయుడు, పోలా నాయుడు దీనిని పాలిం చారు. 

షితాబ్‌ ఖాన్‌ అనే బిరుదు గల సీతా పతిరాజు క్రీ.శ 15 వశతాబ్దంలో ఈ కోటకు అధిపతిగా ఉన్నా డు. అనంతరం సీతాపతి కాలంలో ఖమ్మం ఖిల్లా తెలంగాణ ముఖ్యకేంద్రం అయింది. సీతాపతి బహమని సుల్తానుల సహాయంతో వరంగల్‌కు రాజప్రతినిధిగా ఎన్నికయ్యాడు. సీతాపతిరాజుకు మంత్రిగా పెద్దామాత్యుడు పనిచేసారట. పెద్దయ్యమాత్యుని సహాయంతో తెలంగాణలో తిరిగి తెలుగు సామ్రాజ్యం విస్తరింపచేశారు. 

"గోల్కొండ సీమ కావ్యాలు"లో - "చిత్తాబ్జ ఖానుడు..అనే పదం వుంది అదేమిటంటూ పరిశోదించి అది మరెవరో కాదు చితాబ్ ఖాన్ అనే నామాంతరం కల సీతాపతిరాజే నని శ్రీ ఆదిరాజు వీరభద్రరావు గారు తన పరిశోధనలో తేల్చారు. 



కాకతీయ సామ్రాజ్యం పతనమైన తరువాత రెండుశతాబ్దాలకు ఒక కోయ వీరుడు సీతాపతిరాజు - మహమ్మదీయులు అతని మతం మార్చి ‘షితాబుఖాన్’ అనే పేరు పెట్టారు- ‘జీర్ణ కాకతీయ రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదంతో వరంగల్‌ను పాలించి గొల్కోండ నవాబ్ కులీని గడగడలాడించాడు. ఖమ్మంమెట్టు, బెల్లంకొడ దుర్గాలను అతని నుండి లాక్కునేసరికి నవాబ్ కులికీ చావు తప్పి కన్నులొట్టపోయంది. సీతాపతిరాజు, ఓరుగల్లును కోల్పోయిన తరువాత, గజపతుల అధీనంలోగల కొండపల్లి కోటకు వచ్చి గజపతి విద్యాధరదేవ్ కుమారుడు, దుర్గ్ధాపతి రామచంద్రదేవ్‌ను నవాబుతో యుద్ధానికి సిద్ధం చేశాడు. కాని వారు ఓడిపోయి సంధి కుదుర్చుకున్నారు. ఈ సమయంలోనే కృష్ణదేవరాయలు దండెత్తివచ్చారు. గజపతుల ప్రతినిధిగా అతనితో తలపడి ఏలూరువద్ద సీతాపతిరాజు వీరమరణం పొందాడని ‘రాయవాచకం’ అని శౌర్యాన్ని కీర్తిస్తున్నది. కృష్ణాజిల్లా మాన్యుయల్ (1883) పన్నెండువేల విలుకాండ్ల బలానికి నాయకుడుగా సీతాపతిరాజును పేర్కొంటూ అతని పోరాటాలను అనేక సార్లు ప్రస్తావించింది.

సుల్తాన్ కులీకుత్బూల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్‌ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మంకోటను స్వాధీనం చేసుకున్నాడు.

వరంగల్ గణపురంలోని కోటగుళ్ళను సైతం కాపాడిన సీతాపతి

క్రీ.శ. 1504 నుంచి 1512వరకు ఓరుగల్లును పాలించిన షితాబుఖాన్ అనే సీతాపతి రాజు మహ్మదీయుల కంటపడి విధ్వంసం కాకుండా కాపాడి భూమిలో పూడ్పించిన 8అడుగుల శివ, విష్ణువు ద్వారపాలకుల విగ్రహాలు, రాజనర్తకి, సూర్య భగవాన్‌ల విగ్రహాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిని పురావస్తు శాఖ వారు గణపేశ్వరాలయ ప్రాంగణంలోని హరిత హోటల్ ముందు భద్రపర్చారు.

హరిత హోటల్ ముందు భద్రపరచిన విగ్రహాలు
 సీతాపతి వీటినే భూగర్భంలో దాచి కాపాడాడు 


పరిపాలన సౌలభ్యం కోసం ఖమ్మాన్ని తమ సామ్రాజ్యానికి రెండో రాజధానిగా చేసుకున్నారు. ఈ సమయంలో కులీకుతుబ్‌షాహీ ఓటమి పాలైనా సీతాపతి ఖమ్మాన్ని కేంద్రంగా చేసుకుని ఈప్రాంతానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఇక్కడ కూడా దండెత్తి ఇక్కడి ధనరాసులను గోల్కొండకు తరలించారు. 

శకసంవత్సరం 1425 అంటే క్రీస్తుశకం 1503 నాటి ఓరుగల్లు శాసనం ప్రకారం ఖమ్మంకోటను పాలించిన వారిలో మరికొంత విశేషంగా చెప్పుకోవలసిన మహావీరుడైన సీతాపతి రాజు గురించి కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈయన నాగవంశానికి చెందిన భోగికులానికి చెందిన వాడట. తన భుజబల పరాక్రమాలతోనూ, బుద్ధికుశలతతోనూ మహ్మదీయులనుంచి ఏకశిలా నగరాన్ని స్వాధీన పరచుకుని హిందూ రాజ్య సముద్ధరణ తన ధ్యేయంగా పనిచేశాడు. ఓరుగల్లు లోని పాంచాలరాయ దేవాలయమును పునరుద్ధరించింది కూడా ఇతడే. 

కానీ అతని బలం కోటను తన ధ్యేయాన్ని నిలబెట్టేందుకు చాలకపోయింది. సీతాపతి రాజు షితాబ్ ఖాన్ ముసుగుతో చెప్పుకోబడుతూ తనకు సాధ్యమయినంత మేర శిల్పసంపదనూ, వారసత్వ ప్రతీకలనూ భద్రపరిచేందుకు ప్రయత్నించాడు. 



సాధ్యమయినంత చోటును గెలుచుకుంటూ వెళ్ళాలనే కంకణం కట్టుకున్న సుల్తాన్ కులీకుత్భుల్ ముల్క్ 1531 లో సీతాపతి రాజును ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానితో ఈ దుర్గం కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్ళిపోయింది. హిందుమతపరమైన చిహ్నాలనూ ఆధారాలనూ సహజంగానే తొలగించివేస్తారు కాబట్టి ఆతర్వాత ముస్లింపద్దతుల్లోకి కోట స్థూలరూపం మార్చబడింది. ఆ తర్వాత కూడా 17 వ శతాబ్ధంలొ ఇది అసఫ్ జాహీల పాలనలోకి వచ్చింది. ఒక కొండ పైన ఠీవిగా వుండే ఈ కోట అటు సాహసానికి, ఇటు వివిధ నిర్మాణ శైలుల మిశ్రమానికి ప్రతీక. ఈ ప్రాంతాన్ని వివిధ మతాలకు చెందిన వివిధ రాజవంశీకులు పరిపాలించిన౦దు వల్లనే ఈ మిశ్రమ శైలి ఏర్పడింది ఇదీ ఒక ప్రత్యకతేనేమో.



అబుల్ హసన్ తానీషా కాలంలో 21 సర్కారులు (ఇప్పటి జిల్లాల లాగా) ఉండేవి వాటికింద 356 పరగణాలు ఉండేవి. తరు వాత నైజం పాలనలో రావటంతో పరిపాలన సౌలభ్యం కోసం 21 సర్కారులను 40 సర్కారులుగా విభజించాడు. వాటిలో ఖమ్మం, వరంగల్ సర్కారులు ఉన్నాయి.

► 1687 వరకు ఐదుగురు నవాబు ఖమ్మంగిరిని పాలించినట్టు చెబుతారు. వారిలో ఆఖరివాడు అబ్దుల్ హసన్ కుతుబ్‌షా. 1658-1687 వరకు పాలించాడు. ఈయనను తానీషా అని పిలుస్తారు. 

► 1687 ప్రాంతంలో గోల్కొండపై దండెత్తిన ఔరంగజేబు ఈ దుర్గాన్ని వశపర్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అటు తర్వాత నిజాం ఏలుబడిలో ఖమ్మం ఖిల్లా కొనసాగింది. 

► 1722లో ఈ ప్రాంత సుబేదారు నిజాం ముల్కీ అసల్‌జీ అనే వ్యక్తి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. 

► 1761 నుంచి 1803 వరకు జాఫర్‌దౌల్ అనే తహసీల్దార్ పర్యవేక్షణలో ఖమ్మం ఖిల్లా కొనసాగింది. ఇతనికాలంలో ఖమ్మం ఖిల్లా మరింతగా ఆధునీకరించారు. అభివద్ధి కూడా జరిగింది. 

► 1768లో రెండో జాఫర్‌దౌలా తహసీల్దార్‌గా నియమితుడయ్యాడు. ఈయన అన్న పేరుతోనే ధంసలాపురం గ్రామాన్ని స్థాపించారు. 

► 1800 సంవత్సరం నాటి తెలంగాణ అధికారుల పరిపాలన కొనసాగిన ఈ ఖిల్లాను 1937లో నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

నైజాం కాలంలో రాజ్య పునర్విభజనలో వరంగల్, కరీంగనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపి సుభా ఏర్పాటు చేశారు. దానికి కేంద్రంగా వరంగల్‌ను ఉంచారు. దానిలోనే ఖమ్మం జిల్లాను విలీనం చేశారు. దీంతో ఖమ్మం తన సుభా స్థాయిని కోల్పోయి కొంతకాలం తాలూకా కేంద్రంగా మారింది

ప్రాచీన కాలం నుంచి, ముఖ్యంగా తాలూకాల హయాం నుంచీ ఖమ్మం వాణిజ్య, సామాజిక కార్యకలాపాల కేంద్రంగా వుండేది. ఖమ్మం ను పరిపాలించిన ఎంతో మంది రాజవంశీకులు ఈ నగర చరిత్ర, కళ, నిర్మాణ శైలుల మీద చెరగని ముద్ర వేశారు. ఖమ్మం మత సామరస్యానికి కూడా చక్కటి ఉదాహరణ. వివిధ మతాలకు చెందిన వారు తమ తమ మతాలను అవలంబిస్తూ వుండడం ఖమ్మం కు ప్రత్యేకత తీసుకు వచ్చింది. ఖమ్మం లోని ప్రధాన ఆకర్షణలు గుళ్ళూ, మసీదులే, అందులోనూ పక్క పక్కనే ఉండేవి ఎక్కువ.



శిలాక్షరాలు ఏం చెపుతున్నాయో

ఖమ్మం ఖిల్లా ( కోట) తెలంగాణలో రెండో అతిపెద్ద పర్యాటక కోటగా, వెయ్యి సంవత్సరాల చరిత్ర గలకోటగా పత్యేకతలున్న ఈ గిరిదుర్గపు ప్రవేశం ద్వారం వద్ద ఉన్న శిలాఫలకంపై ఆనాటి తెలుగులో ఈవిధంగా రాసి ఉంది.


1. హయగరుడ కోటలో గొంగ్గ, 
2. బయ్యతల గుండు గండ గడి, 
3. కోటమాల గంగని తలగుండు గండ, 
4. తేరా సామంత బారామండలి కాయ,
5. జాయుల మూరురాయ జగద్దళ ముఖి, 
6. బీరుసస్థాపంగా బీతిరుద్రకాని స్థాపంగా బీతి, 
7. కాకతీయ రాజ్యస్థాపనాఛాయ్య నెల్లూరి వీరక్ష. 


నెల్లూరి వీరక్షనిగా పేరుపొందిన కాకతీయ రాజ్యస్థాపనాచార్యుడెవరో కోటమాల గంగని తల ఎగరగొట్టి సామంతులనందరినీ కాపాడాడట ఆ విజయాన్ని సూచిస్తూ రాసిన రాతలలాగానే ఈ శాసనం కనిపిస్తోంది.



అంతే కాకుండా కోట గోడలపై వివిధ చిత్రాలు అనేక సన్నివేశాలను వివరిస్తున్నట్లు గీసారు. ఒక గుర్రానికి ముందు వెనుకలగా ఇద్దరు వ్యక్తులు నిలబడిన చిత్రం లాంటివాటి వెనకున్న భావాన్ని పరిగట్టేందుకు పరిశోధకులు మరింత కృషిచేస్తే చరిత్రగతిలో మరుగున పడిపోయిన ఏన్నో విషయాలు వెలుగు చూసే అవకాశం వుంటుంది. 

ఖిల్లా బయటి గోడపైనున్న ఒక చిత్రం వీరగల్లు కావచ్చు
లేదా అశ్వవైద్యం,
అశ్వమేధం లాంటి సందర్భంలో పరాక్రమంతో భందించిన గుర్రం,
లేదా కోట నిర్మాణంలో ప్రత్యేకంగా సాయం చేసిన అశ్వమా
అనేది అనుభంద ఆధారాలైమైనా దొరికితే తప్ప తేల్చలేము



శ్రీకృష్ణదేవరాయల సందర్శన

దేశభాషలందు తెలుగు లెస్సని చెప్పిన కవిరాజు శ్రీకృష్ణదేవరాయలవారితో కూడ ఈ కోటకు గల సంభందాన్ని చారిత్రక ఆధారాలతో నిరూపించారు. క్రీ.శ. 1615లో శ్రీకష్ణదేవరాయలు కులీకుతుబ్‌షాహీని ఓడించి ఖమ్మం దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆంధ్రభోజుడు శ్రీకష్ణదేవరాయలు తన దిగ్విజయయాత్రలో భాగంగా దీనిని కూడా జయించారట గజపతుల నుంచి 1615లో దీనిని స్వాధీనపరచుకున్నారు. 

ముక్కు తిమ్మన రచించిన పారిజాతాపహరణము లో కృతిపతి కృష్ణదేవరాయల శౌర్య ప్రతాపములు వర్ణించే సందర్భంలో ‘‘గంబంబుమెట్ట గ్రక్కనఁ గదల్చె’’ అని పారిజాతాపహరణం ప్రబంధంలో వర్ణించడం సాహిత్యపూర్వక ఆధారంగా ఈ విషయాన్ని దృవీకరిస్తోంది. 

ఆ పూర్తి పద్యం ఇది

ఉదయాద్రి వేగ యత్యుద్ధతి సాధించె, - వినుకొండ మాటమాత్రాన హరించెఁ,
గూటము ల్సెదరంగఁ గొండవీ డగలించె, - బెల్లముకొండ యచ్చెల్లఁ జెఱిచె,
దేవరకొండ యుద్వృత్తి భంగము సేసె, - జల్లి పల్లె సమగ్రశక్తి డులిచెఁ,
గినుక మీఱ ననంతగిరి క్రిందుపడఁ జేసె, - గంబంబుమెట్ట గ్రక్కనఁ గదల్చె

బలనికాయము కాలిమట్టులనె యడఁచుఁ
గటకమును నింక ననుచు నుత్కలమహీశుఁ
డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు
రాజమాత్రుండె! శ్రీకృష్ణరాయవిభుఁడు.



మరికొన్ని జాగ్రత్తలు తీసుకోలేమా?

పర్యాటక దినోత్సవం సందర్భంగా ఖిల్లా పై రాక్‌ క్లైబింగ్‌ విన్యాసాలు నిర్వహిస్తారు. 
జాతీయ పండుగల నాడు ఖిల్లాపై అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు.
2010లో శ్రీకృష్ణదేవరాయలు పంచశతాబ్ది పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా అప్పటి కలెక్టర్ రాయలవారి విగ్రహాన్ని ఖిల్లాపై ప్రతిష్టించారు. ఆ విగ్రహం కూడా నేడు శిథిలావస్థకు చేరింది. 
రేణుకా చౌదరి కేంద్రమంవూతిగా ఉన్నప్పుడు ఖిల్లాపైకి వెళ్ళేందుకు రేయిలింగ్ ఏర్పాటు చేసి మెట్లు చెక్కించారు. 
ఖిల్లాపై పర్యాటకులు సేద తీరాడానికి రెండు రేకుల షేడ్లు నిర్మించారు. ఆ తర్వాత వాటిని పట్టించుకపోవడంతో అవీ శిథిలావస్థకు చేరాయి.
టివి, సినిమా షూటింగ్‌లు కొన్ని జరుగుతున్నాయి చారిత్రక సంపదను ధ్వంసం చేయకుండా మరింతగా ఈ కోటను షూటింగుల నిమిత్తం వాడుకోవచ్చు
చరిత్ర, కళా నైపుణ్యం, వినోదం, విజ్ఞానం కలగలుపుగా ఉన్న ఖిల్లాఇది.
గోల్గొండలో మాదిరిగా లైటింగ్ షో లు వారానికి ఒక్కసారైనా వుండేలా నిర్వహించగలిగితే పర్యాటకులకు అదనపు ఆకర్షణగా వుంటుంది. రాత్రి పూట ఈ గిరిదుర్గం దానినుంచి చూసే నగరం రెండూ మరింత సౌందర్యవంతంగా వుంటాయి. 
చరిత్రను తెలియజేసే అంశాలను భద్రాద్రిలో నిర్మించిన శిల్పాల మాదిరిగా లేదా పటాల వంటి ఇతర పద్దతుల ద్వారా ప్రదర్శిస్తూ వాటిపై వివరాలను ఇచ్చినట్లయితే ఖ్యాతి విస్తరిస్తుంది.
కేవలం మెట్ల మార్గమే కాకుండా అతి ప్రాచీన నరసింహ స్వామి గుట్టకు ఈ కోటకు మధ్య రోప్ వేకు అత్యంత అనుకూలంగా వుంటుంది.

గిరిదుర్గపు నీటికోలను శుద్దిచేసి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

కోటకు ప్రధాన ఆకర్షణ ఫిరంగులు వాటిలో చాలా ఫిరంగులను కోటనుంచి దూరంచేసి ఖమ్మంలోని వివిధ ఆఫీసులకు తరలించారు. వుంచిన రెండు మూడు లోహ పిరంగులూ కేవలం మట్టిలో వదిలేసినట్లు పడేశారు. వాటిని చిన్న గద్దెలాంటి నిర్మాణాలపై వుంచగలిగితే సందర్శకులకు ఆకర్షణీయంగా ఫోటోలు దిగేందుకు అనుకూలంగా వుండటమే కాకుండా తుప్పపట్టకుండా చాలా రోజులు మనుగడ సాగించగలుగుతుంది. 

బయటి గోడలపై వున్న శాసనాలూ, బొమ్మలకు సరైన రక్షణ లేకపోవడంతో వాటిపై పోస్టర్లూ, ప్లెక్సీలూ వేసి శైధిల్యానికి గురిచేస్తున్నారు. వాటిని స్పల్పఖర్చుతో చేసే రక్షణ చర్యల ద్వారా కాపాడుకోవాల్సిన అవసరం వుంది. 

కోటలోని నిలువు బండ(గిరికంబం,) యువతకు ఆకర్షణీయంగా వున్న గుండె ఆకారపు బండ (హృదయప్రదేశం) ధ్యానానికి అనుకూలంగా వున్న గుహ ( ధ్యానవేదిక) లాంటి చోట్లకు, కోట అన్నివైపుల నుంచి కొలనులోకి నీటి మళ్ళింపు వరుసలు (జలమార్గం) లాంటి ఆకర్షణీయమైన పేర్లతో గుర్తింపు నివ్వడం ద్వారా ఇప్పటి నేతిబావి, రాతిదర్వాజా, లాగా గుర్తుంచుకునేలా చేసి పర్యాటకులకు ఆకర్షణను కలుగజేయవచ్చు





ఖమ్మం పర్యటన : 

ఖమ్మం, భారతదేశం లోని లక్షలాదిమంది పర్యాటకులు ఆకర్షించే ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఖమ్మంలోను, చుట్టుపక్కల ఆస్వాదించదగ్గ అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం కోట, జమలాపురం ఆలయం, ఖమ్మం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణలు. ఈ ప్రాంతంలో పాలేరు సరస్సు లాంటివి దగ్గరలోని ప్రధాన సందర్శనీయ స్థలాలు.

ఆహ్లాదకర వాతావరణం ఉండే శీతాకాలంలో ఖమ్మం సందర్శించడం బావుంటుంది. ఈ ప్రాంతం ఏడాది పొడవునా ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, ఉత్తర ప్రాంత౦తో పోలిస్తే తక్కువ చలిని కలిగి ఉంటుంది. అయితే, వేసవిలో అధిక వేడి వల్ల ఆ సమయంలో ఖమ్మం సందర్శించడం కొంచెం క్లిష్టంగా వుంటుంది. ఈ ప్రాంతంలో ఋతుపవనాల ఆధారంగానే వర్షం పడుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత పడిపోతుంది, కానీ మంచు స్థాయి పెరుగుతుంది.

ఖమ్మం నగరం రాష్ట్రంలోని, దేశంలోని ఇతర భాగాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. ఖమ్మంజిల్లా కేంద్రానికి విమానాశ్రాయం ఏర్పాటుకు వాతావరణ అనుకూలతలు వున్నప్పటికీ ప్రస్తుతానికి ఎటువంటి విమానాశ్రయం లేదు, రాజధాని నగరమైన హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీప విమానాశ్రయం. ఖమ్మం గుండా రెండు జాతీయ రహదారులు ఉండడం వల్ల రోడ్డు ప్రయాణం సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం, ఇతర నగరాల మధ్య అనేక బస్సులు నడుపుతుంది. ఇది హైదరాబాద్-విశాఖపట్టణం లైన్ లో ఉండడం వల్ల భారతదేశం అంతటి నుండి అనేక రైళ్ళు ఖమ్మం కి చేరుకుంటాయి.

సీతాపతిరాజు మరికొన్ని విశేషాలు

సూర్యా సీతాపతిగా చేస్తే?
 నమూనా చిత్రం మాత్రమే
సీతాపతి రాజు జనవరి 21, 1504లో వేయించిన శిలా శాసనం వరంగల్ కోటలోని దక్షిణ తోరణం దగ్గర దొరికింది. ఆయన మంత్రి ఎనుములూరి పెద్దన పోషణలో చరిగొండ ధర్మన్న అనే కవి ‘చిత్రభారతం’ అన్న అద్భుతమైన కావ్యమూ రాశాడు. సమకాలిక ముస్లిం చరివూతకారుల రచనల్లో కూడా షితాబ్ ఖాన్ ప్రస్తావించబడ్డాడు. అయితే, సీతాపతి నిజానికి బోయ కులానికి చెందినవాడు. బోయ కులం అంటే ‘భోగం కులం’ అని కొందరు, ‘భోజ కులం’ అని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ‘భోజ’ అనేది గ్రామాధికారుల కులం. అయితే, సీతాపతే షితాబ్ ఖాన్ అయ్యాడు. అదీ చరిత్ర. సీతాపతి తండ్రీ, అతడి తాతలు విలువిద్యలో, మల్లయుద్ధంలో నిష్ణాతులు. షితాబ్ ఖాన్ ఆ విద్యలను నేర్చుకొని క్రీ.శ. 14వ శతాబ్ది చివరి దశాబ్దాల్లో ఓరుగల్లు (తెలంగాణ) రాజ్యాన్ని పాలిస్తున్న బహమనీ సుల్తానుల సైన్యంలో సైనికుడిగా చేరాడు. అటు తర్వాత ఆయన తన యుద్ధవిద్యలతో వారిని మెప్పించి, ముస్లిం మతంలోకి మారి తన పేరును సీతాపతి నుండి షితాబ్ ఖాన్‌గా మార్చుకొన్నాడు. ఇలా వారి అభిమానాన్ని చూరగొని, ఓరుగల్లు దుర్గాధిపతిగా, తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా ఎదిగాడు. అడ్డువచ్చిన రాజాద్రి (రాచకొండ, నల్గొండ జిల్లా) వెలమ రాజులనూ జయించాడు. షితాబ్ ఖాన్ అనే వరంగల్ రాష్ట్రపు రాజు క్రీ.శ. 1500 ప్రాంతంలో ‘షితాబ్ ఖాన్ సౌధం’(ఖుష్ మహల్’).కట్టించాడు.

ఖుష్ అంటే సంతోషం కదా! ఈ మహల్ గోడలు చాలా వెడల్పుండి బలిష్టమైనవి. అవి సుమారు 77 డిగ్రీల వాలుతో ఉండి వేలాడుతున్నట్లుగా కన్పిస్తాయి. కాబట్టి, ఈ ఖుష్ మహల్ మాతృకైన మహల్‌ను ‘హిందోళ మహల్’ అంటారు. అంటే, ‘ఊగే సౌధం’ అని అర్థం. దీనిని మధ్యవూపదేశ్, గుజరాత్‌లలోని మాళ్వా ప్రాంతపు రాజధాని మాండులో హుషాంగ్ అనే రాజు క్రీ.శ.1425లో కట్టించాడు. దాని కంటే కొంచెం చిన్నదే ఈ ‘ఖుష్ మహల్’. కానీ, ‘హిందోళ మహల్’లో లేని నీటికుండం ఖుష్ మహల్ మధ్యలో ఉంది. ఇది ఖుష్ మహల్ అదనపు ఆకర్షణ. చారిత్రాత్మకంగా ఈ సౌధానికి మరో విశేషమూ అందమూ ఉంది. తురక సైన్యాలు కూల్చిన, ధ్వంసం చేసిన వందలాది హిందూ దేవాలయాలను, విగ్రహాలను సీతాపతి ముస్లిం మతంలోకి మారి మరీ పునరుద్ధరించడంలోనే ఆసక్తికరమైన అందం కనిపిస్తుంది. కాకతీయులు కాలగర్భంలో కలిసిన రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ప్రజల్లో వారికున్న గౌరవాన్ని చూసి, వారు కట్టించిన దేవాలయ శిల్పాల సౌందర్యాలను చూసి ముగ్ధుడైన సీతాపతి ఖాన్ అంతే అందమైన, ఆసక్తికరమైన ఖుష్ మహల్‌ను కట్టించడంలో ఆశ్చర్యం లేదు. షితాబ్ ఖాన్ 1515 ప్రాంతంలో ఒరిస్సాలోని కళింగ గజపతి రాజులకు విధేయుడిగా ఉన్నందుకు తెలంగాణలో తనపై దండెత్తిన మరో తెలుగువాడు శ్రీకృష్ణదేవరాయల సైన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

తన విలువిద్యతో మొదట రాయల సైన్యాన్ని చిత్తు చేశాడు కూడా. చివరలో గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతంలో రాయలతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు. కానీ, ఆయన ప్రజలకు ప్రత్యేకించి కళా పిపాసకులకు ఇచ్చిన కానుక మాత్రం కాల గమనాన్ని తట్టుకొని నేటికీ అలరిస్తూనే ఉంది. అదే మన ఖుష్ మహల్. వరంగల్ కోట కొన్ని శతాబ్దాల కాలం తెలుగు వారి రాజధాని కాబట్టి ప్రజల మనోభావాలను సంతృప్తి పరచడం కోసమే ఆ కోటలో షితాబ్ ఖాన్ రాజదర్బార్ కట్టించాడు. అది తెలంగాణలోను, యావత్ తెలుగుదేశంలోనూ కట్టిన మొట్టమొదటి ప్రజా భవనం. కాకతీయ తోరణాల మధ్య దొరికిన స్వయంభు దేవాలయ శిథిల శిల్పాలను ప్రస్తుతం ఈ ఖుష్ మహల్‌లో భద్రపరిచారు. తురక సైన్యాలు కూల్చిన, ధ్వంసం చేసిన వందలాది హిందూ దేవాలయాలను, విగ్రహాలను సీతాపతి ముస్లిం మతంలోకి మారి మరీ పునరుద్ధరించడంలోనే ఆసక్తికరమైన అందం కనిపిస్తుంది. ‘హిందోళ మహల్’ను అధ్యయనం చేసిన పెర్సీవూబౌన్ దానిని ‘అందమైన దానికంటే ఆసక్తికరమైంది’ అన్నాడు. మనం చెప్పాలంటే, ఖుష్ మహల్‌ను ‘అందమైంది, ఆసక్తికరమైంది’ అని చెప్పవచ్చు.

ఆంధ్రరాష్ట్ర అవతరణకు ముందే జిల్లా హోదా పొందిన ఖమ్మంమెట్టు

నైజాం పాలన 1948లో ముగిసిన తర్వాతహైదరాబాద్ రాష్ట్రంలో ఉండగానే 1953 అక్టోబరు 1న ఖమ్మం మెట్టు, మధిర, ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు తాలూకాలతో కలిసి ఖమ్మం మెట్టును జిల్లాగా ప్రకటించారు. కాలక్రమంలో ఖమ్మం మెట్టు పేరును ఖమ్మంగా మార్చుతూ గెజిట్ విడుదల చేశారు. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఆవతరణ జరిగినప్పుడు జిల్లా హోదాలోనే ఖమ్మం ఉంది. 1959లో నాటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం, నూగురు తాలుకాలను ఖమ్మం జిల్లాలో కలిపారు. ఈ రెండు తాలూకా కలయికతో జిల్లా విస్తీర్ణం బాగా పెరిగింది. మొదట ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం, మణుగూరు తాలూకాలు ఉన్నాయి. మధిర తాలుకా విశాలమైనది కావడంతో దాని నుంచి సత్తుపల్లి ప్రాంతాన్ని వేరు చేసి కొత్తగా సత్తుపల్లి తాలుకాను ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనకాలంలో మండల వ్యవస్థ ఏర్పడడంతో జిల్లాలోని తాలూకాలను 46 మండలాలుగా విభజించారు. ప్రస్తుతం జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి.




ఆధారం

1. ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి (రెండుబాగాలు) శ్రీ బి.ఎన్.రెడ్డి
2. ఆంధ్రుల చరిత్ర - డాక్టర్ బి.యస్.యల్  హనుమంతరావు
3. కాకతీయ చరిత్రము - తేరాల సత్యనారాయణ శర్మ
4. కాకతీయులు శ్రీ పివి పరభ్రహ్మశాస్త్రి
5. పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన (పూర్తిపద్యం కోసం)
9. సూర్య దినపత్రిక 
10. ఎపి ఆన్ లైన్ వెబ్ సైట్ ఖమ్మం జిల్లా ఏర్పాటు వివరాలు




కామెంట్‌లు

  1. కట్టా శ్రీనివాస్ గారు మీరు ఖమ్మం గురించి రాసిన చారిత్రక అంశాలు పదిలపరచకోవాల్సిన విశేషాలు. ఖమ్మం ప్రాచీనతను చారిత్రక పూర్వయుగం నుంచి పరిశోధించాలి.దక్కన్లో వున్న అతి పురాతన భౌగొళికస్వరూపాల్లో గొప్పది. చరిత్రలో వొదిలేసిన కాలాల్ని వెతికిపట్టుకోవాలి.ఏదేమైనా మీకు నా శుభాభినందనలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్యూ సర్
      ఆదిమానవుడి ఆవాసాలు వుండేవనటానికి నిదర్శనంగా ఇప్పటికీ ఎన్నో రాక్షసగుళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి. లిపి పూర్వపు గుహచిత్రాలు కూడా దొరుకుతున్నాయి. మొన్నీ మధ్య పరిశోదనలో డైనోసర్ల కాలంలో కూడా ఖమ్మం ఉభయగోదావరి కృష్ణాజిల్లాలలో ఎక్కువగా ఆవాసాలను ఏర్పరచుకుని వుండేవనటానికి ఆధారాలు దొరియాన్నారు.

      దక్కన్ లోని అతిపురాతన భౌగోళిక స్వరూపం గురించి మీ వంటి పెద్దల సహకారంతో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి రావాలని నేను కూడా కోరుకుంటాను. ప్రయత్నం చేస్తాను మాస్టారూ..

      తొలగించండి
  2. Srinivas garu khammam lo untunna maaku/ evarikina khammam history gurinichi inthaga theliyaka povachu, meeru chala viluvina samacharam pondhu parcharu hats off sir

    రిప్లయితొలగించండి
  3. ఖమ్మం గురించి విపులమైన Article.

    రిప్లయితొలగించండి
  4. Thanks to Srinivas Garu ,khammam gurunchi chala viluvaina samacharam
    Pondu paricharu....oka khammam vasi ga maku teliyani vishyalu chala teliyachesaru.....

    రిప్లయితొలగించండి
  5. With your permission, this will be inserted in our Annual issue of Sahithi sravanthi special coming on 29,30 June 2014

    రిప్లయితొలగించండి
  6. Thanks to Srinivas Garu ,khammam gurunchi chala viluvaina samacharam
    Pondu paricharu....oka khammam vasi ga maku teliyani vishyalu chala teliyachesaru..

    రిప్లయితొలగించండి
  7. మీరు వ్రాసిన చరిత్రలో కల్పితాలు ఎక్కువగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి